– వందశాతం ఫలితాల్ని ఇస్తాయని భావించలేం.. కొన్ని చోట్ల తప్పుడు పాజిటివ్లు : అధ్యయన బృందం వెల్లడి
– ఇతర వైరస్లు సోకిన సందర్భాల్లో పాజిటివ్ అని తేల్చేస్తున్నారు..
న్యూఢిల్లీ : కరోనా వైరస్ శరీరంలో ప్రవేశించిందా? లేదా? అని తేల్చడానికి ప్రభుత్వం జరుపుతున్న పరీక్ష ‘యాంటీబాడీ టెస్టులు’. ఆర్టీ-పీసీఆర్ టెస్టుతో పోల్చితే దీని ఫలితం కొద్ది గంటల్లో రావటం ఇందులో ఉన్న సౌలభ్యం. అయితే ఈ యాంటీబాడీ టెస్టుల కోసం మనదేశంలో ప్రభుత్వ, ప్రయివేటు ల్యాబ్లు జైడస్ కవచ్, ఆర్బీడీ, డయాసోరిన్ అనే కిట్లను పెద్ద సంఖ్యలో వాడుతున్నాయి. అయితే ఒక అధ్యయనం ప్రకారం, ఈ కిట్లను తయారుచేసిన సంస్థలు పేర్కొన్నవిధంగా వాటి పనితీరు లేదని, కొన్ని చోట్ల తప్పుడు పాజిటివ్లు, నెగెటివ్లు వస్తున్నాయని తేలింది. ఈనేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) కిట్ల పనితీరుపై అధ్యయనం జరిపింది. ఫరీదాబాద్లోని ‘ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్(టీహెచ్ఎస్టీఐ) ప్రొఫెసర్ భట్నాగర్, వైరల్ ఇన్ఫెక్షన్ నిపుణుడు గగన్దీప్ కాంగ్లతో కూడిన శాస్త్రవేత్తల బృందం అధ్యయనం కోసం ఏర్పాటైంది.
యాంటీబాడీ టెస్టింగ్కు వాడే ఆర్బీడీ కిట్ను టీహెచ్ఎస్టీఐ సంస్థ తయారుచేసింది. జైడస్ కవచ్ను ఐసీఎంఆర్, జైడస్ సంయుక్తంగా రూపొందించాయి. డయాసోరిన్ను ఇటలీకి చెందిన సంస్థ తయారుచేసింది. ఈ మూడు కిట్ల పనితీరుపై అధ్యయనం బృందం దృష్టిసారించింది. 379 కోవిడ్ పాజిటివ్, 184 కోవిడ్ నెగెటివ్ శాంపిల్స్ను పరిగణలోకి తీసుకున్నారు. వీటి ఆధారంగా..యాంటీ బాడీలను గుర్తించడంలో ఏ కిట్ బాగా పనితీరు కనబర్చిందన్నది పరిశీలించగా, ఆశ్చర్యకరంగా ఏ కిట్ కూడా పూర్తిస్థాయిలో ఫలితాల్ని సాధించలేదని అధ్యయనం తేల్చింది.
ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో పాజిటివ్ అని తేలాక.. కరోనా రోగి కోలుకున్నాక, 20 రోజుల గడువు తీసుకొని యాంటీబాడీ కిట్లను ఉపయోగించాం. వారి శరీరంలో వైరస్ ఉందని మాకు తెలుసు. కానీ యాంటీబాడీ టెస్టింగ్కిట్స్ గుర్తిస్తాయా?లేదా? అన్నదే మా పరిశీలన…అని శాస్త్రవేత్త భట్నాగర్ వివరించారు. కిట్ల తయారుదారూ చెప్పినట్టుగా వాటి పనితీరు, ఫలితాలు లేవని ఆయన చెప్పారు.
ఫలితాలు తేడా కొడుతున్నాయి…
జైడస్ కవచ్ కిట్ పనితీరు 98.7శాతం ఉంటుందని ఐసీఎంఆర్ చెప్పుకుంటోంది. కానీ అది నిజం కాదని, అధ్యయనంలో దాని ఫలితం 75.7శాతంగా ఉందని వెల్లడైంది. ఆర్బీడీ కిట్ 84.7శాతం, డయాసోరిన్ కిట్ 82శాతం పనితీరు కనబర్చాయని తేలింది. ఒక వ్యక్తి స్వైన్ ఫ్లూ, డెంగ్యూ…ఇతర వైరస్ల బారిన పడి కోలుకున్నాక అతడి శరీరంలో యాంటీబాడీలు ఏర్పడతాయి. ఇలాంటి సందర్భాల్లో ఆ వ్యక్తి కోవిడ్-19 యాంటీబాడీ టెస్టుకు వెళితే, ఈ మూడు కిట్లు పాజిటీవ్ అని తేల్చేస్తున్నాయి.
Courtesy Nava telangana