‘హౌడీ-మోడీ’ వేదికకు సమీపంలో భారీ ప్రదర్శన – కాశ్మీర్, ఎన్ఆర్సీ, దళితులపై దాడులు, మూకదాడులను వ్యతిరేకిస్తూ ఆందోళన – హౌడీ-మోడీ, నిరసనలు రెండింటినీ చూపిన అమెరికా మీడియా – ట్రంప్, మోడీ ఒకే నాణేనికి రెండు ముఖాలు : సీఎన్ఎన్ హూస్టన్ :
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోడీ పాల్గొన్న మెగా ఈవెంట్కు సమీపంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చోటుచేసుకుంది. ఆర్టికల్ 370 నిర్వీర్యం, కాశ్మీర్లో నిర్బంధాలు, మూక దాడులు, దళితులపై, ఆదివాసీలపై దాడులు వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో నిరసనకారులు ‘హౌడీ-మోడీ’ వేదికకు సమీపంలోనే ఆందోళనకు దిగారు. ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని పెద్దపెట్టున నినాదాలు చూస్తూ భారతీయ అమెరికన్లు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసనలకు వేలాదిమంది అమెరికన్లు సైతం మద్దతుగా నిలబడటం గమనార్హం. భారత్లో పెరుగుతున్న హిందూత్వ శక్తుల ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. హౌడీ-మోడీ సభను భారతీయ మీడియా చాలా హైలైట్ చేయగా, అమెరికా మీడియా ఇటు సభ-అటు నిరసనల మధ్య సమతుల్యం పాటించింది. ఆ కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో, అలాగే నిరసన జరిగిన తీరును కూడా చూపారు. ‘అలయన్స్ ఫర్ జస్టిస్ అండ్ ఎకౌంటబిలిటీ'(ఏజేఏ) అనే సంస్థ నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ సంస్థకు చెందిన హిందూ, ముస్లిం, దళిత్, సిక్కు, క్రైస్తవ గ్రూపులు, హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, ప్రోగ్రెస్సివ్ హిందూ గ్రూప్, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, ఇతర మైనార్టీ గ్రూపులు ఈ నిరసనల్లో పాల్గొన్నాయి. ‘జ్యూయిష్ వాయిస్’ వంటి అమెరికాకు చెందిన పౌర హక్కుల సంఘాలు కూడా పాల్గొన్నాయి. ”భారతీయ మూలాలున్న అమెరికన్లం. అయితే మేము ఏ ఒక్క దేశానికో చెందినవారుగా భావించటం లేదు. మా ఎజెండా అంతా ఒక్కటే. అది…అప్రజాస్వామిక, ప్రజా వ్యతిరేక, మైనార్టీ వ్యతిరేక రాజకీయ విధానాల్ని నిరసించటమే. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ పార్టీ ఆ విధానాలతో ముందుకెళ్తోంది. కాబట్టే ఇక్కడ నిరసనలకు దిగా”మని ఏజేఏ ఒక ప్రకటనలో తెలిపింది. కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని తొలగించిన విధానం ప్రస్తావిస్తూ, ముందు ముందు దళితుల, మైనార్టీల, ఆదివాసీలకు సంబంధించిన చట్టాల్ని సైతం నిర్వీర్యం చేస్తారన్న ఆందోళన వ్యక్తమైంది. ొడొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసమే హౌడీ-మోడీ సభను ఏర్పాటుచేసినట్టు అమెరికా మీడియా పేర్కొంది. ట్రంప్, మోడీ ఒకే నాణేనికి రెండు ముఖాల వంటివారని ‘సీఎన్ఎన్’ మీడియా తెలిపింది. – అమెరికా పార్లమెంట్ సభ్యురాలు తుల్సీ గబ్బార్డ్కు హిందూత్వ గ్రూపులు హిందూ స్వయం సేవక్, ఆర్ఎస్ఎస్ అంతర్జాతయ విభాగం పెద్ద ఎత్తున నిధులు అందజేశారనీ ‘ఏజేఏ’ ఒక ప్రకటనలో తెలిపింది. – హిందూత్వ గ్రూపులు పెద్ద ఎత్తున నిధులు ఖర్చుచేసి ‘హౌడీ-మోడీ’ సభను నిర్వహించారని అమెరికా మీడియా రాసింది. జాతీయ అతివాద నాయకులతో, వారి రాజకీయాలతో ఒక భయానక వాతావరణం ఇండియాలో నెలకొంది. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని, చట్టాల్ని బలహీనం చేశారు. వ్యతిరేక గళం వినిపిస్తే వారిని నిర్బంధిస్తున్నారు. అలాగే కాశ్మీర్లో నేడు నెలకొన్న పరిస్థితిపై మేమంతా ఆందోళన చెందుతున్నాం. నిర్బంధం కారణంగా ఆ రాష్ట్రానికి చెందినవారు దాదాపు 20లక్షలమంది కాశ్మీర్ బయటే ఉండిపోవాల్సి వచ్చింది. – సునీతా విశ్వనాథ్, హిందూస్ ఫర్ హ్యూమన్రైట్స్.
Courtesy Nava telangana…