న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్తో ప్రజలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోవడంతో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం విలయ తాండవం చేస్తు న్నది. దీంతో నిరుద్యోగరేటు నానాటికీ పెరుగుతూనే ఉంది. అంతకుముందు నెలలతో పోల్చితే జూలైలో కొంత తగ్గినట్టు కనిపించినా.. ఆగస్టు నుంచి మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. పట్టణాలు, గ్రామాల్లో సగటున ఒక శాతం చొప్పున పెరగడం గమనార్హం. ఈమేరకు భారతీయ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను విశ్లేషించే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సర్వేలో జాతీయ స్థాయి నిరుద్యోగిత రేటు 8.35 శాతంగా నమోదైంది. జులైలో ఇది 7.43 శాతం ఉండగా.. ఆగస్టు నాటికి 8.35 శాతానికి చేరింది. పట్టణాల్లో అయితే పరిస్థితి ఆందోళనకరంగా మారుతున్నది. వ్యాపారాలు కుదేలై.. అందులో పనిచేస్తున్నవారి ఉద్యోగాలు ఊడుతున్నాయి. ప్రస్తుతం పట్టణాల్లో ప్రతి పదిమందిలో ఒకరి ఉద్యోగం పోయినట్టు తాజా సర్వే ద్వారా వెల్లడైంది. వీరిలో 30 ఏండ్లలోపు యువతే ఎక్కువగా ఉంది.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధ్వానం
దేశవ్యాప్తంగా పరిశీలిస్తే బీజేపీ పాలనలో ఉన్న హర్యానాలో నిరుద్యోగరేటు అత్యధికంగా 33.5 శాతంగా నమోదైంది. ఆ తరువాత త్రిపురలో 27.9 గా ఉంది. మొత్తం 13 రాష్ట్రాల్లో పది శాతానికన్నా ఎక్కువగా ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో నిరుద్యోగం రేటు కొంత తగ్గిందని సర్వేలో పేర్కొన్నారు. జులైలో 9.1 శాతంగా ఉంటే.. ఆగస్టు నెలాఖరు నాటికి 5.8 శాతానికి తగ్గింది.
జేబులో పైసల్లేక..
లాక్డౌన్ సమయంలో పట్టణాల్లోని 52 శాతం మంది కార్మికులు నెలరోజుల పాటు చేతిలో చిల్లిగవ్వ లేకుండానే బతుకుబండిని లాగారు. చేసేందుకు పని లేక, వేతనాలు అందక కష్టాలతో కలిసి బతికారు. ప్రభుత్వాల పరిహారం నాలుగోవంతు మందికి మాత్రమే అందిందనీ, ఇక అసంఘటితరంగంలో పనిచేసే వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని మరో సర్వేలో వెల్లడైంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (ఎల్ఎస్ఈ), యూకే ఆర్థిక సామాజిక పరిశోధన మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఎల్ఎస్ఈ ఆర్థిక పురోగతి కేంద్రం (సీఈపీ) ఈ అధ్యయనం చేసింది. మే, జూన్, జులై నెలల్లో 18-40 ఏండ్లలోపు పట్టణ కార్మికులు 8,400 మందిని కలిసి వివరాలు సేకరించారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న యువత ఉద్యోగాల కోతను ఎదుర్కొంటోందని ఆ సర్వే నివేదిక వివరించింది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు పట్టణ ఉపాధి హామీ పథకం అవసరమని 70 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆదాయం పడిపోవడంతో చాలామంది పేదరికంలోకి వెళ్లడంతో పాటు దీర్ఘకాల నిరుద్యోగ కష్టాలు ఎదుర్కొనాల్సి వస్తోందని వెల్లడైంది. ఈ కష్టాలు తీర్చేందుకు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాతీయ విధానం అవసరమని అభిప్రాయపడింది.
సర్వేలో వెల్లడైన మరిన్ని అంశాలు..
– సర్వే చేసిన నెలల్లో 15.5 శాతం మంది కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. మరో 21.7 శాతంమందికి చేసేందుకు పనిలేకుండాపోయింది. కొందరికి ఏప్రిల్ నెలకు వేతనాలు కూడా అందలేదు.
– కరోనాకు ముందుతో పోల్చితే ఏప్రిల్, మే నెలల్లో ఆదాయం 48 శాతం పడిపోయింది.
– కరోనా కారణంగానే ఉద్యోగాలు పోయాయని 90 శాతానికిపైగా అభిప్రాయపడ్డారు.
– మూడునెలల సర్వే కాలంలో 80 శాతం మంది అసంఘటితరంగం కార్మికులు పనిలేకుండా ఉండిపోయారు. సంఘటిత రంగంలో పనిచేస్తున్నవారిలో ఇది 20 శాతంగా ఉంది.
Courtesy: NT