తెలంగాణలో కొత్తగా జన్మించిన పిల్లల్లో 22 వేల మందికి బరువు తక్కువగా ఉన్నట్లు ఐ.సి.డి.ఎస్ రికార్డులు తెలుపుతున్నాయి. 2018 మార్చి నుంచి 2019 ఏప్రిల్ మధ్య కాలంలో రాష్ట్రంలో ఐదు లక్షల 89 వేల 571 మంది పిల్లల జననాలు నమోదయ్యాయి.
4వ జాతీయ కుటుంబ సర్వే లెక్కల ప్రకారం దేశంలోని అయిదేళ్లలోపు పిల్లల్లో 28 శాతం మంది స్టంటేడ్ అంటే పౌష్టికాహారం కొరతవల్ల ఎదుగుదలలేని వారిగా నమోదయ్యారు. వీరిలో ఐదు శాతం మంది అత్యంత బలహీనంగా ఉన్నారు. 18 శాతం మందికి ఎత్తుకు తగిన శరీర సౌష్టవం లేదు. యూనిసెఫ్ తదితర సంస్థలు అంచనా ప్రకారం భారతదేశంలో 40 శాతం మందికి పైగా పిల్లలు తరతమ స్థాయిల్లో పౌస్తికాహారలోపం, రక్షితహీనతలతో బాధపడుతున్నారు. తెలంగాణలో పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల పిల్లలు అధికంగా పౌష్టికాహార కొరతతో బాధపడుతున్నట్లు ఈ రంగానికి చెందిన నిపుణులు చెప్పారు. అందులోనూ పౌష్టికాహార లోపంతో బాధపడే వారిలో అత్యధిక శాతం మంది ఎస్సీ, ఎస్టీ పిల్లలు. రంగారెడ్డి హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలు ఈ సమస్యలో ముందున్నాయని ‘’టైమ్స్ ఆఫ్ ఇండియా’’ పేర్కొంది. తెలంగాణ ప్రజల సమగ్ర అభివృద్ధి, అందులోనూ దళితుల ఉన్నతికి పెద్దపీట వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తరచూ చెప్పుకుంటూ ఉంటుంది. అయితే పై వివరాలు చూస్తే టిఆర్ఎస్ ప్రభుత్వ రికార్డు అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నది