కరోనా నిర్ధారిత పరీక్షలు ఉచితంగా చేసేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ: అనుమతి పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ లేబరేటరీల్లో ప్రజలకు కరోనా పరీక్షలు ఉచితంగా చేయాలని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. ఇందుకు అనుగుణంగా తక్షణమే తగిన ఆదేశాలు జారీ చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్లు, డబ్ల్యూహెచ్వో/ఐసీఎం ఆర్ అనుమతి పొందిన లేబరేటరీల్లోనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించేలా చూడాలని ఆదేశించింది. భారత వైద్య పరిశోధన సంస్థ(ఐసీఎంఆర్), ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ), నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబరేషన్ లేబరేటరీస్(ఎన్ఎబీఎల్).. వీటిలో ఏదోక దాని నుంచి అనుమతి పొందిన లేబరేటరీల్లో కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తలెత్తిన ప్రస్తుత విత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్ల పాత్ర అత్యంత కీలకమని, ప్రజలకు సేవలందించడంలో ఔదార్యం చూపాలని సర్వోన్నాత న్యాయస్థానం పేర్కొంది.
ప్రైవేట్ ల్యాబ్ల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షల పేరిట పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, దీన్ని నివారించాలని కోరుతూ న్యాయవాది శశాంక్దేవ్ సుధీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ప్రైవేట్ ల్యాబ్ల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు భారీగా రుసుములు వసూలు చేస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువగా వసూలు చేయకుండా చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. ప్రైవేట్ ల్యాబ్లు తీసుకున్న సొమ్మును ప్రజలకు ప్రభుత్వం వాపసు చేసే అంశాన్ని చేయాలని పేర్కొంది. దీనిపై సమాధానం చెప్పేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు రెండు వారాల సమయం ఇచ్చింది.