– విద్యార్థులు, మేధావులు కదలిరావాలి..
– దేశంలో ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులు
– హిందూత్వ ఎజెండా కోసమే ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్
– వాటి ఫలితంగా ఎక్కువగా నష్టపోయేది ఆదివాసీలు, సంచార జాతులే
– వృద్ధిరేటు పతనం, ప్రజాసమస్యలు పట్టవా? : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
”దేశాన్ని మతరాజ్యంగా మార్చే కుట్రలో భాగంగా ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్లను మోడీ సర్కారు తెరపైకి తెచ్చింది. దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను హిందూ, ముస్లిం గొడవగా చిత్రీకరిస్తున్నది. ఇది ముమ్మాటికీ హిందూ, ముస్లిం సమస్య కాదు. మన సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్పైనా, రాజ్యాంగంపైనా జరుగుతున్న దాడి. రాజ్యాంగంపై దాడి అంటే దేశంపై దాడి జరుగుతున్నట్టే. మన దేశ రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు విద్యార్థులు, మేధావులు ప్రతి ఒక్కరూ కలిసి రావాలి”
– సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
హైదరాబాద్ : హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని లైబ్రరీ హాల్లో ‘దేశాన్ని రక్షించుకుందాం…రాజ్యాంగాన్ని రక్షించు కుందాం’ అనే పేరుతో విద్యార్థి సంఘాలు, పీహెచ్డీ పరిశోధక విద్యార్థుల బృందం ఆధ్వర్యంలో శుక్రవారం సెమినార్ను నిర్వహించారు. ఈ సెమినార్తో పాటు హెచ్సీయూ, చార్మినార్, బుక్ఫెయిర్లో జరిగిన కార్యక్రమాల్లో ఏచూరి హాజరయ్యారు.
జీవన ప్రమాణాలు పడిపోతున్నా పట్టదా?
.”దేశంలో ప్రజల జీవన ప్రమాణం ఎందుకు పడిపోతు న్నది? ప్రజలపై భారాలు ఎందుకు పెరిగిపోతున్నాయి? ఆర్థిక వృద్ధి రేటు పతనానికి కారణాలేంటి? 50ఏండ్లలో ఎన్నడూలేని విధంగా నిరు ద్యోగరేటు ఎందుకు పెరిగిపోయింది? రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆగడం లేదు? నిత్యావసర సరుకులు ఎందుకు అందుబాటులో లేకుండా పోయాయి? ఉల్లిగడ్డ రేటెందుకు పెరుగుతున్నది? అనే అంశాలేవీ మోడీ సర్కారుకు పట్టవు. ప్రపంచవ్యాప్తంగా సైన్స్పై జరుగుతున్న పరిశోధనల్లో 20శాతం మంది భారతీయ శాస్త్రవేత్తలే పని చేస్తున్నారు. మన శాస్త్రవేత్తలు నాసాలో కీలక భూమిక పోషిస్తు న్నారు. స్విట్జర్లాండ్లోని సీఈఆర్ఎల్లో 200 మందికిపైగా భారత శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఆ మేధోసంపత్తిని మన దేశ అభివృద్ధిలో పాలుపంచుకునేలా ఎందుకు చేయట్లేదు? వారి సేవలను ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? సైన్స్లో ఉన్నత విద్య చదివినవారి సంఖ్యను 50 శాతానికి చేరిస్తే భారతదేశం ప్రపంచంలోనే అద్భుతశక్తిగా ఎదుగుతుందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు పరిగణనలోకి తీసుకోవట్లేదు?’ అని ఏచూరి ప్రశ్నించారు.
హిందూత్వ ఎజెండాలో భాగమే…
మతోన్మాద ఘర్షణలు సృష్టిస్తూనే మరోవైపు ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ వాటిని తెరపైకి తెచ్చి దేశంలో హిందూత్వ ఎజెండాను అమలు చేయాలనే కుట్ర దీని వెనుక దాగి ఉన్నదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాని ఏచూరి సూచించారు. స్వాతం త్రోద్యమ కాలంలోనే ప్రపంచంలోనే ఎక్కడా లేని వైవిధ్యం మన దగ్గర ఉండటంతో స్వాతంత్య్రం తర్వాత భారతదేశం ఎలా ఉండాలనే దానిపై మూడు ప్యూహాలు పుట్టుకొచ్చాయన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భాషలు, వైవిధ్య ప్రాంతాలున్న మన దేశంలో సమైక్యతను కాపాడుకు నేందుకు సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా ఉండాలని, వేరే మార్గం లేదని అనేక చర్చోపచర్చల తర్వాత రాజ్యాంగంలో చేర్చారని వివరించారు. సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ దగ్గరే ఆగిపోకుండా ప్రతి ఒక్కరికీ ఆర్థిక స్వాతంత్య్రం దక్కేలా సోషలిజం ముందుకు సాగాలని వామపక్షాలు ఆకాంక్షించాయన్నారు. మతం ఆధారంగా దేశం ఉండాలనే 1939లో హిందూ మహాసభ అధ్యక్షులు వీడీ సావర్కర్ తెరపైకి తెచ్చారనీ, జిన్నా దాన్ని సపోర్టు చేస్తూ మత ఆధారిత రాజ్యాలను కోరుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఫలితంగా ఇస్లామిక్ స్టేట్గా పాకిస్థాన్ విడిపోయిం దన్నారు. ఇండియాను హిందూ దేశంగా ప్రకటించాలని ఆర్ఎస్ఎస్ వాదన తెచ్చిందనీ, అది వద్దన్న కారణంతోనే గాంధీ హత్య జరిగిందని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ప్రజల నుంచి ఆర్ఎస్ఎస్ దూరమైందన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ స్టేట్ను హిందూత్వ దేశంగా మార్చాలనే ఆర్ఎస్ఎస్ కుట్ర కొనసాగుతూనే ఉందన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాల న్నారు. ఎన్నార్సీని అమలు చేయబోమని ఇప్పటికే 13 రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిం చాయనీ, సీపీఐ(ఎం)గా స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే, ఎన్పీఆర్ పైనా స్పష్టత ఇవ్వాలని కోరారు. పాలనాపరంగా ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కేరళ ప్రభుత్వం ఎన్పీఆర్ చేపట్టబోమని తీర్మానించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్పీఆర్ చేయబోవ ుని సీఎం కేసీఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్, డాక్టర్ నాగేశ్వర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, ఆర్ఎల్ మూర్తి, ఎస్ఎఫ్ఐ ఓయూ అధ్యక్ష, కార్యదర్శులు గణేష్, రవి, ఏఐఎస్ఎఫ్ జాతీయ నాయకులు స్టాలిన్, ఓయూ సహాయ కార్యదర్శి హరీశ్ ఆజాద్, రంజిత్(పీడీఎస్యూ), ఆనంద్(పీడీఎస్యూ(వి)), చందు(టీవీవీ), భద్రి(డీఎస్యూ), తిరుమలేశ్ (ఎమ్ఎస్ఎఫ్), దర్శన్(డీబీఎస్ఏ), నరేశ్(డీఎమ్ఎస్ఏ), కృష్ణమాదిగ (టీఎస్వీ), సలీమ్పాషా(ఎమ్హెచ్పీఎస్), విద్యార్థి, నిరుద్యోగ ఫ్రంట్ చైర్మెన్ సీహెచ్.దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
Courtesy Nava telanagana