ప్రభాత్ పట్నాయక్
(స్వేఛ్చానుసరణ)
ప్రధాని నరేంద్రమోడీ నాలుగు గంటల వ్యవధిలోనే, ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే లాక్డౌన్ ప్రకటించారు. దీని పర్యవసానంగా లక్షలాది వలస కార్మికులు ఒక్కసారి రోడ్డున పడ్డారు. ఈ వలస కార్మికుల దుస్థితి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ఒక ప్రధానమైన లక్షణాన్ని వెలుగు లోకి తెచ్చింది. మన గ్రామాలు వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థతో, ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో నేటికీ కొనసాగుతూ కోట్లాది మంది పట్టణ కార్మికులకు వెన్ను కాపు కాస్తున్నాయి. ఈ పట్టణ కార్మికులు నిరంతరం పెట్టుబడిదారీ వ్యవస్థలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకోడానికి కిందామీదా పడుతుంటారు. ఒక్కసారిగా హఠాత్తుగా చేయడానికి పనిలేక, చేతుల్లో డబ్బులేక, తల దాచుకోడానికి ఇల్లు కూడా లేని పరిస్థితి ఎదురయ్యేసరికి వలస కార్మికులలో అత్యధికులకి తమ గ్రామాలకు పోవాలనే ఆలోచనే వచ్చింది. రవాణా సౌకర్యాలు బంద్ అయినా, కాలినడకన వందలాది కిలోమీటర్లు నడవాల్సి వచ్చినా వారు ఆ ఇబ్బందిని భరించైనా సరే తమ స్వగ్రామాలకి ఎలాగో ఒకలాగ చేరిపోవాలని అనుకున్నారు. తమ సొంత ఊరు చేరిపోతే ఈ రబీ పంట కోతల కాలంలో తమకు చేయడానికి ఏదో ఒక చిన్నపాటి పనైనా దొరుకుతుందన్న ఆశతో ఉన్నట్టు చాలామంది వలస కార్మికులు పాత్రికేయులతో చెప్పారు. అంటే గ్రామాలు, అక్కడి వ్యవసాయ రంగం మన భారతీయ పెట్టుబడిదారీ వ్యవస్థకు తమకు అక్కరలేని కార్మికులను పారవేసే ఒక చెత్తకుండీలా ఉపయోగ పడుతున్నాయన్నమాట.
చేతివృత్తుల స్థానే అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ విధానం, ఆ క్రమంలో దెబ్బతినే చేతివృత్తులపై జీవించే వారందరినీ తను కల్పించే పనుల్లో ఇముడ్చుకుంటుందని కొందరు చెప్పే కథలు వాస్తవం కాదు. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో సంపద పోగుబడే ప్రక్రియతో బాటే ఏకకాలంలో సాంకేతికాభివృద్ధి కూడా జరుగుతూ వుంటుంది. అంతకంతకూ తక్కువ మంది కార్మికులతో మరింత ఎక్కువగా ఉత్పత్తి చేయించడమే లక్ష్యంగా ఈ సాంకేతిక మార్పులు జరుగుతూ వుంటాయి. అందువలన పెట్టుబడిదారీ విధాన తాకిడికి దివాలా ఎత్తే చిన్న తరహా, పాత రకం వృత్తిదారులను, పెరిగే కార్మికవర్గ జనాభాను అందరినీ తన వ్యవస్థలో ఇముడ్చుకోవడం పెట్టుబడిదారీ విధానంలో సాధ్యపడదు. ఇలా నిరాధారంగా మిగిలిపోయే వారందరూ చేరుకునే చెత్తకుండీలే మన గ్రామాలు.
యూరప్ ఖండం లోని పెట్టుబడిదారీ దేశాలలో ఇలా నిరాధారులైన వారందరికీ చెత్తకుండీలుగా అమెరికా ఖండం ఉపయోగ పడింది. యూరప్ నుంచి ప్రజా సమూహాలు పెద్ద సంఖ్యలో అమెరికా ఖండానికి వలసలు వెళ్లారు. అక్కడి స్థానికులనందరినీ (వీరినే రెడ్ ఇండియన్లు, అమెరిండియన్లు అంటాం) వారి భూముల నుంచి వెళ్లగొట్టి తమ వరకు బతుకు తెరువు కల్పించుకున్నారు. యూరప్లో పారిశ్రామిక విప్లవం పర్యవసానంగా పేదరికం పెరిగిందే తప్ప తగ్గలేదని ఎరిక్ హాబ్స్బామ్ వంటి వారు వాదించారు. కాని 1820 దశకం నాటికి పెట్టుబడి పోగుబడిన తీరు (అమెరికాకు, ఇతర ప్రాంతాలకు వలసలు పోవడం, కొత్త మార్కెట్లు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం వంటి చర్యల పర్యవసానంగా) అక్కడ పేదరికాన్ని తగ్గించ గలిగిందని అంగీకరించారు. నెపోలియన్ శకం తర్వాత యూరప్ నుండి బైటకు సాగిన వలసలే ఈ మార్పుకు కారణం. యూరప్ ఖండానికి చెత్తకుండీగా మొదలైన ఈ నూతన ప్రపంచం (అమెరికా ఖండం) అంత అన్యాయంగా చెత్తకుండీ మాదిరిగానే ఉండిపోలేదు.
యూరప్లో జరిగిన క్రమానికి భిన్నంగా భారతదేశంలో పెట్టుబడిదారీ దోపిడీ ధాటికి తట్టుకోలేని వారు పట్టణాల నుండి వలస పోవడానికి వేరే చోటు లేదు. వారికి గ్రామాలే దిక్కయ్యాయి. ఒక పక్క నగరాల్లో పెట్టుబడి పోగుబడుతూ వుంటే ఇంకో పక్క గ్రామాల్లో పేదరికం, కనీస అవసరాల కొరత పెరుగుతూ వచ్చాయి. స్వతంత్రం వచ్చాక తొలి దశాబ్దాలలో ప్రభుత్వాలు అనుసరించిన ‘సంక్షేమ’ విధానాలు వ్యవసాయ రంగంలో తలసరి ఉత్పత్తిని పెంచగలిగాయి. ఐతే అలా పెరిగిన ఉత్పత్తి యొక్క ఫలితాలు అన్ని వర్గాల ప్రజలకూ గ్రామాల్లో ఒకే విధంగా అందలేదు. ఇంకోపక్క వ్యవసాయేతర రంగాలలో అభివృద్ధి ఆ రంగాలలో ఉపాధి కల్పనను పెంచింది. వ్యవసాయంలో పెరిగిన పని దినాల కన్నా వ్యవసాయేతర రంగాలలో పనిదినాలు పెరిగిన రేటు హెచ్చుగా ఉండేది.
ఇటు వ్యవసాయంలో తలసరి ఉత్పత్తి పెరుగుదల, అటు ఇతర రంగాలలో కలిగిన కొత్త ఉపాధి అవకాశాలు ఈ రెండింటి వలన గ్రామీణ ప్రాంతాల జీవన ప్రమాణాలు మెరుగుపడ సాగాయి. స్వాతంత్య్రానికి పూర్వం వలసపాలనలో క్రమంగా క్షీణిస్తూ వచ్చిన గ్రామీణ జీవన ప్రమాణాలు తదనంతరం ‘సంక్షేమ’ కాలంలో దిశమారి మెరుగుపడనారంభించాయి. ఐతే ప్రస్తుత నయా ఉదారవాద కాలంలో పరిస్థితి మళ్లీ తిరగబడింది. గ్రామీణ ప్రాంతాలు తిరిగి ‘చెత్త కుండీలు’గా మారి, ప్రజలు దుర్భర పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నారు.
భారతదేశం ఒక అగ్రరాజ్యంగా ఆర్థికంగా ఎదిగిపోతుందని లేదా మనది ”ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ”గా పెరుగుతోందని ఎన్ని బడాయి కబుర్లు చెప్పినా, మన గ్రామీణ వ్యవసాయ రంగం మాత్రం చెత్తకుండీ గానే మారిపోతున్నది. నయా ఉదారవాద విధానాల ఫలితంగా పెట్టుబడి పోగుబడటం అంతకంతకు పెరిగిపోతోంది. కాని దానివల్ల కార్మికులకు ఒరిగిందేమీలేదు సరికదా వారు పనులు కోల్పోయి నిరాధారులుగా తమ స్వస్థలాలకు (చెత్తకుండీలకు) చేరుకుంటున్నారు. అదే పనిగా భారత ఆర్థిక వ్యవస్థ పెరిగి పోతోందంటూ ఏం చెప్పినా, ఈ చెత్తకుండీలలో పేదలు మరింత ఒత్తిడికి గురవుతూనే ఉన్నారు. దేశంలోని శ్రమ జీవులలో అత్యధిక భాగం ఈ గ్రామాల్లో ఉన్నారు. తక్కిన దేశంలోని కార్మికుల పరిస్థితులను వీరే ప్రభావితం చేస్తున్నారు. కార్మికవర్గం తమ వేతనాల కోసం బేరసారా లాడే శక్తి సంఘటిత కార్మిక వర్గంతో సహా గ్రామీణ ప్రాంత ప్రజల తలసరి ఆదాయాలను బట్టి ఉంటుందని మనం గమనించాలి. (గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయ రంగం నుండి ఇతర రంగాలకు మళ్లిన భూస్వాములు, ధనిక రైతులను మినహాయించి).
మన సంఘటిత రంగ కార్మికులు సైతం గ్రామీణ మూలాల నుండి వచ్చినవారే. తమ వేతనాలను పెంచుకోవడానికి పట్టుదలగా వారు పోరాటాలను, సమ్మెలను దీర్ఘకాలం కొనసాగించా లంటే, వారికి ఆ సమయాల్లో తమ ”ఇళ్ల” నుండి (స్వగ్రామాల నుండి) అదనపు సహాయం అందాలి. ఈ ‘దన్ను’ ఏమేరకు అందుతుందన్న దానిని బట్టి కార్మికులు ఆమేరకు తమ పోరాటాలను పట్టుదలగా కొనసాగించి తమ డిమాండ్లను సాధించగలుగుతారు. ఆ విధంగా గ్రామాలు అందించే సహాయం ఏ మేరకు ఉంటుందనేది తిరిగి ఆ గ్రామాల్లో ఈ ప్రజలు తలసరి నిజ ఆదాయాలు ఏ మేరకు పెరుగుతాయనే దానిపై ఆధారపడి వుంటుంది.
వ్యవసాయ రంగంలోని శ్రామిక ప్రజల తలసరి నిజ ఆదాయాలు పెరుగుతూ వుంటే పట్టణాల్లో కార్మికుల పొరాటాలకు ఆ మేరకు దన్ను అందుతూ వుంటుంది. అలాగే పట్టణాల్లో ఉపాధి కల్పన అవకాశాలు పెరుగుతున్నకొద్దీ, గ్రామాల్లోని శ్రామిక ప్రజల ఆదాయం స్థాయి కూడా పెరుగుతూ వుంటుంది. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి మద్దతునివ్వడం తగ్గిస్తున్న కొద్దీ గ్రామీణ ప్రజల నిజ ఆదాయాలు తగ్గిపోవడం మొదలెడతాయి. అప్పుడు వారు పట్టణ శ్రామికులకు అందించగలిగే ‘దన్ను’ తరిగిపోతుంది. దాంతో పట్టణాల్లో శ్రామికుల ఆదాయాలూ తగ్గిపోతాయి. ఇంకోపక్క పట్టణాల్లో ఏర్పడే కొత్త ఉపాధి అవకాశాలు పెరిగే పట్టణ జనాభాతో సమానంగా పెరగకపోతే, దాని పర్యవసానంగా గ్రామీణ శ్రామికుల నిజ ఆదాయాలు తగ్గిపోతాయి. ప్రస్తుతం నయా ఉదారవాద కాలంలో ఈ రెండు రకాల ధోరణులూ ఒకేసారి తీవ్రం అవుతున్నాయి. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇచ్చే మద్దతు తగ్గిపోతున్నది. పెట్టుబడిదారులు నూతన సాంకేతిక పద్ధతులను ఏ మోతాదులో ప్రవేశ పెడుతున్నారనే దానినిబట్టి ఈ ఉపాధి అవకాశాల తరుగుదల రేటు పెరుగుతూ పోతుంది.
ఒకసారి పట్టణ జనాభాలో వచ్చే పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు పెరగకుండా పోవడం మొదలైతే దాని పర్యవసానాలు పట్టణ శ్రామికుల జీవితాలపైనేగాక గ్రామీణ శ్రామికుల జీవితాలపై సైతం పడతాయి. మొత్తంగానే శ్రమ జీవులను దోపిడీ చేసే రేటు పెరుగుతుంది. మొత్తం స్థూల జాతీయోత్పత్తిలో దోపిడి వర్గాలు చేజిక్కించుకునే ‘మిగులు’ వాటా పెరిగిపోతుంది.
ఉద్యోగాల సంఖ్యను కుదించగలిగే నూతన టెక్నాలజీలను ఏమోతాదులో ప్రవేశ పెడతారు? ఇది ప్రధానంగా జిడిపి మిగులులో ఎక్కువ భాగాన్ని చేజిక్కించుకోగలిగే సంపన్న వర్గాల (ఉన్నత ఆదాయ వర్గాల) జీవన శైలిలో వస్తున్న మార్పులపై, వారు ఖర్చు చేసే తీరుపై ఆధారపడి వుంటుంది. ఐతే ఈ వర్గాలు ఖర్చు చేసే తీరు ఉపాధిని కల్పించడానికి తోడ్పడేదిగా ఉండదు. పైగా (ఉదా : సాధారణ సెల్ఫొన్ నుండి స్మార్ట్ఫోన్ వైపు, ‘మారుతి’ కారు నుండి ‘ఆడి’ కారుల వైపు) ఈ మార్పు జరుగుతున్న కొద్దీ ఉపాధి కల్పన అవకాశాలు తరిగిపోతూ వుంటాయి. దోపిడీ రేటు పెరిగిపోతూ వుంటుంది. దీనివలన శ్రామిక ప్రజల ‘నిజ’ తలసరి ఆదాయాలు పడిపోతూ వుంటాయి. దానివలన వారి జీవన ప్రమాణాలూ పడిపోతూ వుంటాయి. మన దేశంలో నేడు జరుగుతున్నది ఇదే.
ప్రభుత్వం అధికారికంగా నిర్ధారించిన కనీస పౌష్టికాహార స్థాయి కన్నా తక్కువ స్థాయిలో ఆహారం పొందుతున్న వారి సంఖ్య ప్రస్తుత నయా ఉదారవాద కాలంలో నానాటికీ పెరిగిపోతోంది. సవరించిన పౌష్టికాహార ప్రమాణాల ప్రకారం ఒక రోజుకు ప్రతి వ్యక్తీ గ్రామీణ ప్రాంతంలోనైతే 2,200 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోగలగాలి. అదే పట్టణాల్లోనైతే 2,100 క్యాలరీలు. మన జాతీయ శాంపిల్ సర్వే నివేదికల ప్రకారం ఈ కనీస ప్రమాణాలకు తగ్గట్టుగా ఆహారం పొందలేకపోతున్నవారు గ్రామసీమల్లో 1993-94లో 58 శాతం ఉంటే, 2011-12 నాటికి 68 శాతానికి పెరిగారు. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో కనీస పౌష్టికాహారం పొందలేక పోతున్నవారు 1993-94 57 శాతం ఉంటే 2011-12 నాటికి 65 శాతానికి పెరిగారు.
ప్రస్తుతం ఆవరించిన కోవిడ్ మహమ్మారి ఈ పేదరిక స్థాయిని ఇంకా పెంచుతుంది. ఇప్పటికే దానివలన పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం మరింత పెరిగిపోయింది. లాక్డౌన్ అమలవుతున్న కాలంలో ఈ నిరుద్యోగం దేశం మొత్తం మీద గ్రామసీమలతో సహా, నిరుద్యోగం ఏ విధంగా పెరగబోతోందో వలస కార్మికులు మూకుమ్మడిగా తరలిపోవడం చూపిస్తోంది.
Courtesy Prajasakti