-63కి చేరిన మృతుల సంఖ్య, 2300 మందికి గాయాలుబాగ్దాద్: ఇరాక్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. అవినీతి నిర్మూలన, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలపై ఈనెల1 నుంచి ఇరాక్లో ఆందోళలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. నిరసనకారులు పెద్ద ఎత్తున బాగ్దాద్ వీధుల్లోకి చేరుకొని ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనకారులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. ఉవ్వెత్తున ఎగసిన ఆందోళనలను అణచివేసేందుకు ప్రయత్నించారు. ఇరాక్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చెలరేగిన తర్వాత 63 మంది మృతి చెందగా, 2300 మంది గాయపడినట్టు ఇరాక్ మానవ హక్కుల కమిషన్ సోమవారం ప్రకటించింది. ముగ్గురు నిరసనకారులపై పోలీసులు శనివారం కాల్పులకు తెగబడ్డారని తెలిపింది. ఇరాక్లో మానవ హక్కుల ఘటనలు చోటుచేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాక్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలు మోహరించాయి.
ఆందోళనకు దిగుతున్న నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. బాగ్దాద్లోని లిబరేషన్ స్క్వేర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన నిరసనకారులపై పోలీసులు దాడికి పాల్పడ్డారని ఆందోళనకారులు ఆరోపించారు. ఇరాక్ జనాభాలో 60శాతం మంది 25ఏండ్లలోపు యువత ఉన్నారని అన్నారు. నిరుద్యోగ సమస్య కారణంగా వీరంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి యువకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధాని అదెల్ అబ్దెల్ మహ్దీ నిరసనకారుల మృతికి నైతిక బాధ్యత వహించి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Courtesy Nava Telangan..