నేడో, రేపో మంత్రి ఈటల రాజేందర్తో భేటీ
ఆ తర్వాతే నిర్ణయం: కార్పొరేట్ ఆస్పత్రులు
కరోనా వైద్య రేట్లపై స్పష్టత ఇవ్వాలి..
హైదరాబాద్: ‘‘కరోనా వైరస్ సోకిన వ్యక్తికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేసే వైద్యానికి ఎంత ఖర్చు అవుతుంది’’ ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న ఇది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకయ్యే ధరలను ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దానిపైౖ కార్పొరేట్ ఆస్పత్రులు కూడా మరింత స్పష్టత కోరుతున్నాయి. సర్కారు ఇచ్చిన జీవోపై తమకున్న సందేహాలు, అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు మంత్రి ఈటల రాజేందర్తో నేడో, రేపో సూపర్ స్పెషాలిటీ ప్రైవేటు హస్పిటల్స్ అసోసియేషన్(తిష) సమావేశం కానుంది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రత్యేక గదులతో కలుపుకొని ఆ చార్జ్ చేయాలా? లేదా? అన్నది స్పష్టత లేదని, హైఎండ్ డ్రగ్స్, ఇతర ఇన్వెస్టిగేషన్స్ విషయంలో కూడా మరికొంత స్పష్టత కావాలని ప్రైవేటు ఆస్పత్రులు అడుగుతున్నాయి.
వాస్తవానికి సర్కారు చెప్పిన రేట్లతో వైద్యం చేసేందుకు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఏమాత్రం ఆసక్తిగా లేవు. దీనిపై బుధవారం ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు వీడియో కాన్ఫెరెన్స్ కూడా నిర్వహించుకున్నాయి. ప్రభుత్వం తమకున్న సందేహాల విషయంలో పూర్తి స్పష్టత ఇచ్చిన తర్వాతే ఆ జీవో ప్రకారం వైద్యం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తమ ఆస్పత్రుల్లో సర్కారు సూచించిన ధరల ప్రకారం వైద్యం అందించలేమని, అది మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే హస్పిటల్స్కు అయితే బాగా సరిపోతుందని ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపింది. కేవలం పీపీఈ కిట్లకే రోజుకు ఒక్కో రోగికి 4-5 వేల రూపాయలు అవుతుందని, 20 రోజులు ఉండాల్సివస్తే వాటికే లక్ష రూపాయల వరకు అవుతుందని చెప్పారు.
దరలపై సర్కారు స్పష్టతనిచ్చిన తర్వాత మరోమారు తాము చర్చించుకొని నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర సూపర్ స్పెషాలిటీ ప్రైవేటు హస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బొల్లినేని భాస్కరరావు చెప్పారు. కాగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చేసే చికిత్సకు రూ.1.10 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే, రోగి పరిస్థితి, ఆస్పత్రి స్టేటస్, వైద్యులకు ఉన్న పేరు ప్రఖ్యాతుల ఆధారంగా ఈ బిల్లుల్లో హెచ్చుతగ్గులుండే అవకాశముంది. వైరస్ సోకిన వ్యక్తికి అప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలుంటే వైద్య బిల్లులు మరింత పెరిగే అవకాశం ఉంది. రోగిని ఐసోలేషన్లో ఉంచితే రోజూకు రూ.4 వేలు, ఐసీయూలో ఉంటే రూ.7,500, ఐసీయూలో వెంటిలేటర్పై ఉంటే రూ.9 వేలు చార్జ్ చేయాలని జీవోలో పేర్కొన్నారు.
14 రోజులకు 14 లక్షలు..!
కొవిడ్ చికిత్సకు ప్రభుత్వం ప్రకటించిన చార్జీలను కాకుండా, సొంత చార్జీలను వసూలు చేస్తూ ప్రైవేటు ఆస్పత్రులు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే.. రోగికి ఇతర వ్యాధులు కూడా ఉన్నందున ఆ చార్జీలు వర్తించవని చెబుతున్నారని రోగులు ఫిర్యాదు చేస్తున్నారు. తార్నాకకు చెందిన ఓ మహిళ (58)కు శ్వాస సమస్య తలెత్తడంతో శనివారం సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్న ఆస్పత్రి వైద్యులు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు సోమవారం తెలిపారు. రోజుకు లక్ష చొప్పున, 14 రోజులకు రూ.14 లక్షలు ఖర్చవుతుందని, డబ్బు సమకూర్చుకోవాలని చెప్పారు. అప్పటికే తాము రెండున్నర లక్షలు చెల్లించామని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం చార్జీలు చెల్లిస్తామని మొర పెట్టుకున్నా ఆస్పత్రి యాజమాన్యం వినిపించుకోవడం లేదని ఆ రోగి కుమారుడు రోదిస్తూ చెప్పారు.
Courtesy Andhrajyothy