No Result
View All Result
రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలకు అవుతున్న సరాసరి వ్యయం రూ. 30,336
79% మంది ప్రైవేటులోనే చికిత్స
ఈ అంశంలో జాతీయ సగటు 58% మాత్రమే
జాతీయ నమూనా సర్వే వెల్లడి
రోగమొస్తే జేబు గుల్లవుతోంది. తెలంగాణలో ఏ అనారోగ్య కారణంతోనైనా ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్న రోగులు సగటున రూ.30,336 వెచ్చిస్తున్నారు. జాతీయ గణాంక మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ఈ అంశంలో జాతీయ సగటు ఖర్చు రూ.31,845గా ఉంది. రాష్ట్రంలో ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్న వారిలో 79 శాతం మంది (ప్రసవాలు మినహా) ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారని నివేదిక స్పష్టం చేసింది. ఈ అంశంలో జాతీయ సగటు 58 శాతం మాత్రమే కావడం గమనార్హం.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సలకూ తప్పని ఖర్చు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స పొందుతున్న రోగులు కూడా ఎంతోకొంత తమ జేబులోంచి ఖర్చుపెట్టుకోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం పొందుతున్న వారు సగటున సొంత డబ్బు రూ.3,367 (జాతీయ సగటు రూ.4,452) ఖర్చు చేస్తున్నారు. ఇందులో ఔషధాల కోసం గ్రామీణ ప్రాంతాల్లో 53%, పట్ణణాల్లో 88% ఖర్చు అవుతోందని నివేదిక పేర్కొంది. ఓపీలో చికిత్సకు కూడా సగటున రూ.602 ఖర్చు అవుతోందని తెలిపింది.
టీకాల్లో రాష్ట్రం భేష్
* దేశంలో సమగ్ర టీకాలు పొందిన చిన్నారుల సగటు 59.2% కాగా.. తెలంగాణలో 70.1% నమోదైంది.
* దేశవ్యాప్తంగా అలోపతి చికిత్సలు పొందుతున్నవారు 95% మంది కాగా, తెలంగాణలో 99% మంది.
* ఆసుపత్రి ఖర్చుల కోసం గ్రామీణంలో 13.4% మంది, పట్టణాల్లో 8.5% మంది అప్పులు చేస్తున్నారు.
ప్రభుత్వ వైద్యం పొందే వారు తక్కువే
రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 21% మంది మాత్రమే చికిత్స పొందుతుండగా.. ఈ అంశంలో జాతీయ సగటు 42% ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం పొందుతున్నవారు జాతీయ సగటు కంటే సగం తక్కువ కావడం గమనార్హం.
* దేశవ్యాప్తంగా 2017 జులై నుంచి 2018 జూన్ వరకూ 1,13,823 కుటుంబాల్లో ఈ సర్వే నిర్వహించారు. తెలంగాణలో 3,646 కుటుంబాల్లోని 14,442 మంది నుంచి వివరాలు సేకరించారు.
(Courtesy Eenadu)
No Result
View All Result