– బుల్డోజర్తో పంట నాశనం.. ఆపై భార్యాభర్తలపై పాశవిక దాడి
– పురుగుల మందు తాగిన బాధితులు
– అయినా వదలని పోలీసులు
– పిల్లలను ఈడ్చి పారేసిన వైనం
– బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఘటన
భోపాల్ : ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంటను రక్షించాల్సిన ప్రభుత్వమే వచ్చి నాశనం చేయడాన్ని చూసి తట్టుకోలేని దళిత దంపతులు.. ఆ దారుణాన్ని అడ్డుకున్నందుకు ఖాకీలు వారిపై విరుచుకుపడ్డారు. మానవత్వాన్ని మరిచి వారిపై పాశవికంగా దాడికి దిగారు. తమ పంటను పాడు చేయొద్దని కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడినా వినకుండా.. భార్యాభర్తలిద్దరినీ గొడ్డును బాదినట్టు బాదారు. చేసేదేమీలేక పురుగుల మందు తాగినా వారిని విచక్షణారహితంగా అక్కడినుంచి ఈడ్చిపారేశారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లోని గుణలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన బుధవారం జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా అన్నివర్గాల ప్రజలు, ప్రతిపక్షపార్టీల నేతలు తీవ్రంగా స్పందించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగింది….?
గుణలోని జగంపూర్ గ్రామానికి చెందిన దళిత దంపతులు రాంకుమార్ అహిర్వార్, సావిత్రి దేవి కొన్నేండ్లుగా పడావుగా పడి ఉన్న సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఆ భూమిని వెంటనే ఖాళీ చేయాలని మూడు రోజుల క్రితం ఆ దంపతులను రెవిన్యూ అధికారులు ఆదేశించారు. కానీ దానికి వాళ్ళు అంగీకరించకపోవడంతో అధికారులు పోలీసులతో వచ్చి వారిని బెదిరించారు. ఈ క్రమంలోనే బుధవారం బుల్డోజర్ ను తీసుకొచ్చి చేతికందిన పంటను నాశనం చేశారు. తమకు కొన్ని రోజుల సమయమివ్వాలని భార్యాభర్తలిద్దరూ ప్రాధేయపడినా వినకుండా పంటను ఆ యంత్రంతో తొక్కించారు. రేయింబవళ్లు కష్టపడి సాగు చేసిన పంట కండ్ల ముందే పాడైపోతుంటే చూసి తట్టుకోలేని దంపతులిద్దరూ.. బుల్డోజర్కు అడ్డంగా వెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన దాదాపు 20 మంది పోలీసులు.. ఆ ఇద్దరు అభాగ్యులపై పాశవికంగా దాడికి దిగారు. మహిళ అని కూడా చూడకుండా ఇష్టారీతిన కొట్టారు. రాంకుమార్ను కింద పడేసి లాఠీలతో బాదుతూ.. అక్కడి నుంచి ఈడ్చి పారేశారు. పిల్లలని చూడకుండా వారినీ కొట్టారు. దీన్ని చూసి ఆ భార్యాభర్తలిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. 2018లో ప్రభుత్వం ఈ భూమిని ఒక కాలేజీ కోసం కేటాయించినట్టుగా అధికారులు చెబుతున్నారు.
అప్పులు సర్కారు చెల్లిస్తుందా..? : బాధితులు
ఘటన జరుగుతున్నప్పుడే అధికారులతో దంపతులిద్దరూ వాగ్వాదానికి దిగారు. ‘ఎన్నో ఏండ్లుగా ఈ భూమి సాగు చేసుకుంటున్నాం. పంట కోసం రూ. 3 లక్షల అప్పు చేసాం. ఇప్పుడొచ్చి ఇక్కణ్ణుంచి వెళ్లిపొమ్మంటున్నారు. మా అప్పు ప్రభుత్వం చెల్లిస్తుందా..? అన్నీ వదిలేసి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళేది. మేం ఎలా బతకాలి..? చావు తప్ప మాకు వేరే గత్యంతరం లేదు’ అని ఆవేదన చెందుతూ బాధితులిద్దరూ పురుగుల మందు తాగారు.
వెల్లువెత్తిన ఆగ్రహం…
గుణ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో రాష్ట్ర ప్రజల్లోనే గాక దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైనది. దళిత దంపతులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు, సామాజిక హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేశారు. అయితే ఇందుకు విరుద్ధంగా.. ఇందులో పోలీసుల తప్పేమి లేదని గుణ కలెక్టర్ వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇది ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారి తీసింది. దీంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా రంగంలోకి దిగారు. బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. పోలీసులకు క్లీన్ చిట్ ఇచ్చిన జిల్లా ఎస్పీ, కలెక్టర్లను సస్పెండ్ చేశారు. కాగా, ఘటన జరిగిన కొద్దిసేపటికి ప్రభుత్వం స్పందిస్తూ.. ఆ భూమిని స్థానిక గ్యాంగ్స్టర్ ఒకడు ఆక్రమించుకున్నాడనీ, అతడే రాంకుమార్కు కౌలుకు ఇచ్చాడని తెలపడం గమనార్హం.
జంగిల్ రాజ్ పాలన : మాజీ సీఎం కమల్ నాథ్
దళిత దంపతులపై దాడిని రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై మాజీ సీఎం కమల్నాథ్ స్పందిస్తూ.. ‘దళితులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఇది జంగిల్ రాజ్ పాలనా..? ఒకవేళ వాళ్ళు ప్రభుత్వ భూమినే సాగు చేసినా దాన్ని చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలి. ఇలా జాలి లేకుండా దాడి చేస్తారా..?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్లో వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘ఈ భావజాలానికి, అక్రమాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి’ అని ట్వీట్ చేశారు.
Courtesy: NT