-కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : కోవిడ్ రోగులకు సేవలందిస్తున్న డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలకు పూర్తి వేతనాలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్, ఎస్కె కౌల్, ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది. వైద్యులకు ప్రత్యేక క్వారంటైన్ సదుపాయాలు, సమయానికి సరైన వేతనాలు అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఓ వైద్యుడు దాఖలుచేసిన పిటిషన్ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పై ఆదేశాలు జారీచేసింది.
‘ఆరోగ్యకార్యకర్తలకు వేతనాలు రెగ్యులర్గా చెల్లించటంలేదు. వైద్యసేవలందించే డాక్టర్లకు వారం రోజులపాటు క్వారంటైన్లో ఉంచాలి. ఇందుకు సంబంధించి వసతి సౌకర్యాలను కూడా ప్రభుత్వం కల్పించటంలేదు’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది విశ్వనాథన్ కోర్టుకు తెలిపారు. కాగా, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన క్వారంటైన్ వసతులను కూడా కల్పించేలా రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేయాలని న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి గురువారంలోగా ఆదేశాలు జారీ చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు స్పష్టంచేసింది. కోర్టు ఆదేశాలను రాష్ట్రాలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం, ఐపీసీ సెక్షన్ 188 కింద నేరంగా పరిగణించబడుతుందని తెలిపింది. కోర్టు ఆదేశాల అమలుకు కేంద్రానికి నెల రోజుల సమయమిచ్చింది.
కరోనాతో పోరాడుతుంటే చర్యలా?
– ఢిల్లీ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
”దేశంలోని డాక్టర్లు, నర్సులు యుద్ధ వీరులు. కరోనా మహమ్మారితో చేస్తున్న యుద్ధంలో వారు ముందుండి మనల్ని నడిపిస్తున్నారు. సరైన వైద్యం అందించకపోతే ఈ పోరులో ఎలా గెలవగలం. మీ విధానం వైద్యులు, సిబ్బందిపై కాల్పులు జరుపుతూ.. ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నట్టుగా ఉంది. ఇలా అయితే ఎలా గెలవగలం” అంటూ ఢిల్లీ సర్కారుపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల కరోనా చికిత్స అందిస్తున్న పలు ఆస్పత్రుల్లో వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తెచ్చిన వైద్యులు, సిబ్బందిపై కేసులు నమోదు చేయడాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ”ఆస్పత్రుల్లోని వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకొచ్చిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలపై చర్యలు తీసుకోవడమేమిటని ఢిల్లీ సర్కారును నిలదీసింది. కరోనాతో జరుగుతున్న యుద్ధంలో ముందుండి పోరాడుతున్న వైద్యులపై కేసులు నమోదుచేయడం ఆపాలని తెలిపింది.
డిస్మిస్ అయిన వైద్యులను తిరిగి విధుల్లో చేర్చుకున్నారా? వైద్యులపై ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకున్నారా? ఆరోగ్య కార్యకర్తలకు వేతనాలు చెల్లించారా? అంటూ ప్రశ్నలు సంధించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని శుక్రవారం వరకూ ఢిల్లీ సర్కారుకు గడువు విధించింది.
అలాగే, కరోనాకు సంబంధించి ప్రస్తుత పరిస్థితుల వివరిస్తూ రిపోర్టులు అందించాలని ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
Courtesy: NT