‘ఎన్డీటీవీ’ రవీశ్కుమార్కు పురస్కారం
ప్రముఖ భారతీయ టీవీ జర్నలిస్టు రవీశ్ కుమార్కు ప్రతిష్ఠాత్మకమైన రామన్ మెగసెసె పురస్కారం లభించింది. జర్నలిజంలో నైతిక విలువలను నిలబెట్టినందుకుగాను రవీశ్కుమార్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు అవార్డు కమిటీ ప్రకటించింది. గొంతులేనివారికి ప్రజావాణిగా మారడమే జర్నలిస్టు విధి అని, ఆ విధిని సమర్థమంతంగా రవీశ్ నిర్వర్తిస్తున్నారని కొనియాడింది. రవీశ్ (44) ప్రస్తుతం హిందీ న్యూస్ చానల్ ‘ఎన్డీటీవీ ఇండియా’లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఎవరికీ పట్టని సామాన్యుల వాస్తవిక జీవితాలపై ఈ చానల్ ప్రైమ్ టైమ్లో రవీశ్ నిర్వహిస్తున్న షో మంచి ఆదరణ పొందుతోంది. అవార్డు కమిటీ కూడా ఈ కార్యక్రమాన్నే పరిగణనలోకి తీసుకొని, రవీశ్ను ఎంపిక చేసింది. వృత్తి జీవితంలో తెగువ, తమ రంగంలో విశిష్ఠ నేతృత్వం అందించిన ప్రముఖులకు ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె పేరిట ఏటా అవార్డులను అందిస్తున్నారు.
ఈ అవార్డును ఆసియా నోబెల్ పురస్కారంగా వ్యవహరిస్తుంటారు. 2019 సంవత్సరానికి గాను రవీశ్తో కలిపి మొత్తం ఐదుగురిని రామన్ మెగసెసె పురస్కారం వరించింది. కో స్వే విన్ (మయన్మార్), అంగ్ఖానా నీలపాయిజిత్ (థాయిలాండ్) రెముండో పుజాంతే (ఫిలిప్పీన్స్), కిమ్ జోంగ్ కి (దక్షిణాఫ్రికా) ఈ అవార్డు అందుకోనున్న ఇతర ప్రముఖులు. కాగా, ప్రభుత్వంలో పెద్దలకు సంబంధించిన వాస్తవాలను రవీశ్కుమార్ నిర్భీతితో, అద్దంలో చూపినట్టు బయటపెట్టారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక కొనియాడారు. భారత్పె జరుగుతున్న దురాగతాలకు వ్యతిరేకంగా రవీశ్ వంటి వారు గట్టిగా నిలబడుతున్నారని ఢిల్లీ సీఎం, పూర్వ మెగసెసె అవార్డు గ్రహీత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. గొంతువిప్పే తెగువను ప్రదర్శించారంటూ జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ప్రశంసించారు.
రవీశ్ కుమార్… ఈ ఏడాది రామన్ మెగసెసే అవార్డు అందుకున్న అయిదుగురిలో ఒకరు. పాత్రికేయ విలువల్ని ఒక మెట్టు ఎక్కించిన అసలు సిసలు జర్నలిస్ట్, మానవతావాది. ఎన్డీటీవీలో ‘ప్రైమ్ టైమ్’ షో ద్వారా సామాన్యుడి గొంతుకగా నిలిచి, నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే ఆయన ధైర్యానికి గుర్తింపుగా ‘ఆసియా నోబెల్’గా పిలిచే రామన్ మెగసెసే అవార్డు దక్కింది. ఎన్డీటీవీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా విధులు నిర్వహిస్తోన్న రవీశ్ జనం మెచ్చిన జర్నలిస్ట్ ఎలా అయ్యారంటే…
బీహార్లో పుట్టి పెరిగిన రవీశ్ కుమార్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఆ తర్వాత ఐఐఎమ్ ఢిల్లీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్)లో జర్నలిజంలో పీజీ డిప్లొమా చేశారు. మొదట ఎన్డీటీవీలో ఫీల్డ్ రిపోర్టర్గా చేరిన ఆయన ఏదైనా విషయాన్ని అర్థమయ్యేలా చెప్పేందుకు టీవీ సరైన మీడియం అని భావించారు. కొన్నాళ్లకు ఎన్డీటీవీ హిందీ ఛానల్లో రవీశ్ ‘ప్రైమ్ టైమ్’ డెయిలీ షో నిర్వాహకుడిగా చేరారు. ఈ షోలో వెలుగులోకి రాని అనేక అంశాలు, సామాన్య ప్రజల సమస్యలను చర్చించేవారాయన. సామాజిక పరిణామాల మీద అధ్యయనం చేసి, అర్థవంతమైన చర్చ చేయడంలో రవీశ్ సమర్థుడు. ‘నీవు ప్రజల గొంతుకగా మారినప్పుడు సిసలైన జర్నలిస్టువు’ అనే మాటను బలంగా నమ్మడమే కాదు ఆచరణలో చూపి,
జర్నలిజం విలువల్ని మరోమెట్టు ఎక్కించారు రవీశ్. తన న్యూస్ రూమ్ను ‘పీపుల్స్ న్యూస్రూమ్’గా వర్ణించే ఆయన ప్రస్తుతం ఎన్డీటీవీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు.
సామాన్యుల సమస్యలే చర్చనీయాంశాలు..
ఏ విషయాన్నయినా సాధారణ ప్రజానికానికి అర్థమయ్యే భాషలో చెప్పడం రవీశ్ ప్రత్యేకత. ఆయన భాష, వార్తలు చదివేటప్పుడు హావభావాలు స్టోరీ టెల్లర్స్కు ఉండాల్సిన లక్షణాల్ని చూపుతాయి. పార్లమెంట్లో రూపుదిద్దుకొనే బిల్లులే కాదు… భవన నిర్మాణ కార్మికుడు, సొంతిల్లు లేని వితంతువు, మధ్యాహ్న భోజనం కోసం ఎదురు చూస్తున్న గ్రామీణ పిల్లలు, బేకరీలో పనిచేసే వ్యక్తి… ఇలా సామాన్యుల రోజువారీ బతుకు కష్టాలను ప్రస్తావించడం కూడా ముఖ్యమే అంటారాయన. విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు పరిశోధన పత్రాలు, ఆర్టికల్స్ ఎక్కువగా చదువుతారు. ఇదంతా తన పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికే కాదు వీక్షకులకు సులభంగా వివరించేందుకు ఉపయోగపడుతుంది. యూపీఏ ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు ఎలా దారి మళ్లాయో వాటి గుట్టు రట్టు చేశారాయన. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయనకు చాలామంది నుంచి బెదిరింపులు వచ్చాయి. అయినా ఆయన తను నమ్మిన దారి వీడలేదు. నమ్మిన విలువల కోసం నిలుచున్నాడు కాబట్టే రవీశ్ను ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే వరించింది. రవీశ్ జర్నలిస్ట్ మాత్రమే కాదు… చక్కని స్టోరీటెల్లర్, కవి, సింగర్ కూడా.
ఇతర అవార్డులు..
- 2010 సంవత్సరానికి గానూ హిందీ జర్నలిజం, క్రియేటివ్ లిటరేచర్ విభాగంలో గణేశ్ శంకర్ విద్యార్థి అవార్డు అందుకున్నారు.
- 2013, 2017లో ‘జర్నలిస్ట్ ఆఫ్ ద ఇయర్’ గా నిలిచినందుకు ‘రామ్నాథ్ గోయెంకా’అవార్డు ఆయన్ను వరించింది.
- జర్నలిజం విభాగంలో 2017 సంవత్సరానికి ‘కుల్దీప్ నాయర్’ జర్నలిజం అవార్డుకు ఎంపియ్యారు.
(Courtacy Andhrajyothi)