-ఉపాధి… ఆదాయంపై లాక్డౌన్ గట్టిదెబ్బ
– కార్మికులు, వీధి వ్యాపారుల పరిస్థితి తారుమారు : ఐఎల్ఓ నివేదిక
న్యూఢిల్లీ : భారత్లో లాక్డౌన్, కరోనా మహమ్మారి కారణంగా 36.4 కోట్లమంది ఉపాధిని కోల్పోయారని ‘అంతర్జాతీయ కార్మిక సంఘం'(ఐఎల్ఓ) వెల్లడించింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిపింది. కోవిడ్-19కు ముందే దేశంలో ఆర్థికమాంద్యం ఉన్నదని, దాంతో నిరుద్యోగం రికార్డుస్థాయికి చేరుకుందని, కరోనా మహమ్మారి నేపథ్యంలో పరిస్థితులు మరింతగా దిగజారాయని ఐఎల్ఓ నివేదిక అభిప్రాయపడింది. సాధారణ కార్మికులు, వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి కలిగినవారు తీవ్రంగా నష్టపోయారని నివేదిక పేర్కొంది.
ఇందులోని మరికొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.. లాక్డౌన్, కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి, ఆదాయం కోల్పోయినవారి సంఖ్య 36.4కోట్లకు చేరుకుంది. ముంబయి, పూణెలాంటి నగరాల నుంచి లక్షలాదిమంది తమ స్వంతగ్రామాలకు వెళ్లిపోయారు. దేశవ్యాప్తంగా ప్రతి నగరంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నగరాల్లో ఇంకా మిగిలిపోయిన కొద్దిమంది సైతం భవిష్యత్తుపై ఆందోళనతో జీవనం సాగిస్తున్నారు. వారికి పనిలేదు. కంపెనీలు లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయి. వేతనాల్లో కోతలు విధిస్తున్నాయి.
అన్నిరాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి
మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ, పశ్చిమబెంగాల్…అన్ని రాష్ట్రాల్లోనూ ఉపాధి సమస్య తీవ్రంగా ఉంది. దేశంలో 75శాతం అసంఘటిత కార్మికులే ఉన్నారు. 2020 జనాభా గణాంకాల్ని పరిగణనలోకి తీసుకుంటే, 47.3కోట్లమంది కార్మికులు ఉన్నారని అంచనా.
బతుకులు ఆగం..
కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న 6.5 కోట్లమందికి ఎలాంటి సామాజికభద్రతా పథకాలు వర్తించటం లేదు. సంక్షోభ సమయాన వీరి బతుకులు ప్రమాదంలో పడ్డాయి. లాక్డౌన్, కరోనా మహమ్మారి కారణంగా అనేక కంపెనీలు మొదట తొలగించింది కాంట్రాక్ట్ ఉద్యోగుల్నే. అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే రెగ్యులర్ ఉద్యోగాలు సైతం పోతున్నాయి. యువత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నది. ఉపాధిరంగంలో తీవ్రమైన పోటీ నెలకొంది.
ఏం చేయాలో తెలియటం లేదు : ఎస్పీ గడ్గరీ
మేం పనిచేస్తున్న కంపెనీ తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయిందని కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పెద్ద సంఖ్యలో తొలగించింది. నా ఉద్యోగమూ పోయింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు పాలుపోవటం లేదు. సొంతగా ఏదైనా చేయాలంటే…ఇప్పుడున్న పరిస్థితుల్లో అదంత సులభం కాదు. నాలాంటి వాళ్లు అనేకమంది ఉపాధిలేక తల్లడిల్లిపోతున్నారు.
Courtesy: NT