వుహాన్: కరోనా వైరస్ జన్మస్థానం చైనా హుబేయ్ ప్రావిన్స్లో ఉన్న వుహాన్ నగరం కోలుకుంటోంది. కరోనా పాజిటివ్ కేసులు తగ్గిపోవడంతో రెండు నెలలుగా అమల్లో ఉన్న లాక్డౌన్ ఎత్తివేయడంతో వుహాన్ వాసులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కరోనాపై పోరులో భాగంగా విధించిన నిర్బంధం తొలిగిపోవడంతో వుహాన్లో చిక్కుకుపోయిన ఇతర ప్రాంతాల ప్రజలు ఒకేసారి బయటికి రావడంతో కోలాహలం చోటుచేసుకుంది. వుహాన్ నుంచి పొరుగున ఉన్న జియాంగ్ షీ ప్రావిన్స్కు వెళ్లేందుకు జనం పెద్ద సంఖ్యలో సరిహద్దు దగ్గరకు రావడంతో కొంచెం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హుబేయ్ ప్రావిన్స్, జియాంగ్ షీ ప్రావిన్స్కు మధ్య ఉన్న వంతెన పోలీసులు మూసివేయడంతో బాధితులు ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులపై దాడికి దిగారు. స్టోర్లు, షాపింగ్ మాల్స్ క్రమంగా తెరుచుకుంటున్నాయి.
ఇదిలావుంటే.. కరోనా మహమ్మారి కారణంగా చాలా రోజులు ఇళ్లకే పరిమితమైన చిన్నారులకు స్వేచ్ఛ లభించింది. కరోనా కారణంగా ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలు తాత్కాలికంగా మూతపడటంతో ఇళ్లలోనే ఉండిపోయిన పిల్లలకు ఊరట లభించింది. వుహాన్ నగరంలో లాక్డౌన్ ఎత్తివేయడంతో అక్కడి పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో చిన్నారులు ఉత్సాహంగా స్కూళ్లకు వెళ్తున్నారు. అయితే కరోనా జాగ్రత్తలు మాత్రం మర్చిపోలేదు. నోటికి మాస్క్లు కట్టుకుని పాఠశాలలకు వచ్చారు. తరగతి గదుల్లో తగినంత దూరం పాటిస్తూ విద్యార్థులు చక్కగా పాఠాలు వింటున్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా అంతంమయ్యే వరకు జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు టీచర్లు సూచిస్తున్నారు.