దేశవ్యాప్త ఎన్నార్సీ, పౌరసత్వ సవరణ బిల్లు ఇత్యాది అంశాలతో దేశం వేడిగా ఉన్న కాలంలో, గుజరాత్ ప్రభుత్వం ఐదేళ్ళక్రితం నాటి నానావతి కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం వెనుక ఏవో నిగూఢ లెక్కలు, సందేశాలున్నాయని కొందరి అనుమానం. మోదీకి క్లీన్చిట్ ఇచ్చే నివేదికలు ఎప్పుడు వెలుగుచూసినా ఈ తరహా వ్యాఖ్యలు తప్పవు కానీ, గుజరాత్ ఊచకోతల నిందనుంచి ఆయనను బయటపడవేసేందుకు ఇది ఉపకరిస్తుంది. అడ్డగోలు అబద్ధాలతో మోదీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు స్వచ్ఛంద సంస్థలు, విదేశీశక్తులు కుట్రపన్నాయన్న బీజేపీ నాయకుల వాదనకు మరింత బలం చేకూరుతుంది.
మోదీ మాత్రమే కాదు, ఆయన మంత్రివర్గ సహచరుల్లో ఒక్కరు కూడా ఈ ఊచకోతలకు కుట్రపన్నినట్టుగా, ప్రోత్సహించినట్టుగా, దిశానిర్దేశం చేసినట్టుగా ఆధారాలు లేవని కమిషన్ తేల్చేసింది. పదిహేనువందల పేజీల నివేదికలో ప్రధానంగా పోలీసులనే తప్పుబడుతూ, పోలీసులు బాధ్యతగా వ్యవహరించలేదనీ, సంఖ్య తక్కువైనందునో, ఆయుధబలంలేనందునో మారణకాండను నిలువరించలేకపోయారని ప్రకటించింది. ఊచకోతల వెనుక రాష్ట్రప్రభుత్వ హస్తం ఉన్నదంటూ అప్పట్లో కీలకస్థానాల్లో ఉన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఆర్.బి. శ్రీకుమార్, రాహుల్ శర్మ, సంజీవ్ భట్లు సమర్పించిన సాక్ష్యాలు, ఆధారాలను తోసిపుచ్చడమే కాక, వారి విశ్వసనీయతనే ప్రశ్నించింది.
అదనపు డీజీపీగా ఉన్న శ్రీకుమార్, అహ్మదాబాద్ డిప్యూటీ కమిషనర్గా ఉన్న శర్మ, ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న భట్ సమర్పించిన సీడీలు, ఫ్యాక్స్లు, ఆడియో రికార్డులు విశ్వసించదగినవి కావనీ, వాటిలో అనేకం నకిలీవని కమిషన్ అంటున్నది. మత కల్లోలాల వ్యాప్తిలో వారిపాత్రనూ, నివారణలో వైఫల్యాన్నీ తవ్వితీయవలసిన అవసరం ఉన్నదని సూచించింది. అక్కడక్కడ వీహెచ్పి, బజరంగ్దళ్ వంటి సంస్థలు దాడులకు పాల్పడినప్పటికీ, ఈ అల్లర్ల వెనుక ఏ మతసంస్థగానీ, పార్టీగానీ లేదనీ, పూర్తిగా గోధ్రా వేడి ఇందుకు కారణమని నిర్థారించింది.
సబర్మతీ ఎక్స్ప్రెస్ ఘటనకు సంబంధించిన నివేదిక తొలిభాగం 2009లోనే వెలువడితే, తదనంతర మారణకాండకు సంబంధించిన రెండవభాగం శ్రీకుమార్ హైకోర్టులో కేసు వేసిన నేపథ్యంలో విడుదలైంది. కమిషన్ నిర్థారణలను అటుంచితే, కరసేవకుల సజీవదహనానికి హిందువులను ప్రతీకారం తీర్చుకోనివ్వవలసిందిగా ముఖ్యమంత్రి నరేంద్రమోదీ ఆదేశాలున్నందున తదనుగుణంగా వ్యవహరించమంటూ అప్పటి డీజీపీ పోలీసులను ఆదేశించారని శ్రీకుమార్ కమిషన్కు తెలియచేశారు. మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర పెద్దలు ఊచకోతలు యథేచ్ఛగా సాగేట్టు ఇచ్చిన ఆదేశాల మొబైల్ ఫోన్ రికార్డులను రాహుల్ శర్మ సమర్పించారు. ఈ కారణంగా, వీరిద్దరి ప్రమోషన్లు నిలిపివేసి, గుజరాత్ ప్రభుత్వం వారిని రాచిరంపాన పెట్టిందని అంటారు. ఇక సంజీవ్భట్ కథ అందరికీ తెలిసిందే.
ఇంటెలిజెన్స్ అధినేతగా తాను పాల్గొన్న మీటింగ్లోనే మోదీ ఊచకోతలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారనీ, మోదీ, ఆయన మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు ఊచకోతల నిరోధానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించలేదని భట్ కమిషన్కు వాంగ్మూలం ఇచ్చారు. మరీ ముఖ్యంగా, గుల్బర్గ్ సొసైటీకీ, అందులో నివాసం ఉంటున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ ప్రాణానికీ ముప్పు ఉన్నట్టుగా తాను మోదీని ముందే హెచ్చరించానన్నారు. ఈ సొసైటీలో తీవ్ర హింస సాగి, జాఫ్రీ దహనమైన విషయం తెలిసిందే. దీనితో అప్పటివరకూ ప్రభుదాస్ వైష్ణానీ లాకప్డెత్ ఘటనలో భట్ పక్షాన నిలిచిన గుజారాత్ ప్రభుత్వం ఆయనపై కక్షసాధించడం ఆరంభించింది.
సిఐడీ దర్యాప్తు భట్ను నిర్దోషిగా తేల్చిందంటూ ప్రాసిక్యూషన్కు సైతం అనుమతించని ప్రభుత్వం న్యాయస్థానంలో రివిజన్ పిటిషన్ ఉపసంహరించుకొని ప్రాసిక్యూషన్కు అనుమతించింది. అనుమతి లేకుండా సెలవు తీసుకున్నారన్న ఆరోపణతో కేంద్రప్రభుత్వం 2015లో భట్ను ఉద్యోగం నుంచి పీకేస్తే, ఓ న్యాయవాదిని డ్రగ్స్ కేసులో ఇరికించిన ఆరోపణలపై రాష్ట్రప్రభుత్వం భట్ను ఏడాదిపాటు జైల్లో తోసింది. ఆయన జైల్లో ఉండగానే, అక్రమ నిర్మాణమన్న వాదనతో ఇంటిని కూడా కూల్చేసింది. ఈ ఏడాది జూన్లో జామ్నగర్ సెషన్స్ కోర్టు ఈ మాజీ ఐపీఎస్ అధికారికి వైష్ణానీ కేసులో యావజ్జీవ ఖైదు విధించింది. లాకప్ డెత్ కేసులో ఒక ఐపీఎస్ అధికారికి ఈ శిక్షపడటం దేశచరిత్రలో అదే ప్రథమం. నరమేథాలకు ప్రత్యక్ష సాక్షులుగా నిలబడిన వారిని పాలకులు ఎలా శిక్షిస్తారో, కమిషన్లు పాలకులను ఎలా బయటపడవేస్తాయో ఈ పరిణామాలు మనకు తెలియచెబుతున్నాయి.
Courtesy Andhrajyothi..