బీజింగ్: కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు చైనా వినూత్న పద్ధతులు అనుసరిస్తోంది. ఈ మహమ్మారి మరింత విస్తరించకుండా విస్తృత చర్యలు చేపడుతోంది. రూరల్ చైనాలో డ్రోన్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తోంది. డ్రోన్ కెమెరాల ద్వారా అప్రమత్తం చేస్తూ.. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని స్థానిక అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో గ్రామాల్లో డ్రోన్ ద్వారా సూచనలు ఇస్తున్న వీడియోను చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ వార్తా పత్రిక వెలుగులోకి తెచ్చింది. డ్రోన్ కెమెరాను చూస్తున్న వృద్ధురాలి ఫొటోను ప్రచురించింది. ‘ఆంటీ.. మీతో డ్రోన్ మాట్లాడుతోంది. ముఖానికి మాస్క్ లేకుండా బయట తిరగడం మంచిది కాదు. వెంటనే ఇంట్లోకి వెళ్లిపోండి. చేతులను శుభ్రంగా కడుక్కోవడం మరిచిపోకండి. ఇంట్లోకి బయటకు రావొద్దని అందరికీ చెప్పండి’ అంటూ డ్రోన్ నుంచి వాయిస్ సందేశం వినిపిస్తున్న వీడియోను చూపించింది.
కరోనా వైరస్ వ్యాపించకుండా సానిటైజర్ ను డ్రోన్ ద్వారా స్ప్రెడ్ చేస్తున్నారు. బయట ఆటలు ఆడుకోవద్దని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని డ్రోన్ ద్వారా అధికారులు హెచ్చరిస్తున్న వీడియోను సోషల్ మీడియా వెబ్ సైట్ ‘వీబో’ షేర్ చేసింది. టెక్నాలజీ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడాన్ని చాలా మంది హర్షిస్తున్నారు. కొంత మంది మాత్రం చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రచారం చేసుకుంటోందని విమర్శిస్తున్నారు.
కాగా, చైనాలో కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3226కి చేరింది. కరోనా వైరస్ తొలి కేంద్రమైన వుహాన్ నగరంలో సోమవారం ఒక్క కేసు మాత్రమే కొత్తగా నమోదైంది. చైనా వ్యాప్తంగా కరోనా కారణంగా సోమవారం 13 మంది ప్రాణాలు కోల్పోగా, వుహాన్కు చెందిన వారే 12 మంది ఉండటం గమనార్హం.