త్వరలో తీర్పు వెలువడే అవకాశం 27 ఏళ్లలో ఎన్నో మలుపులు
దిల్లీ- ‘1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూలగొట్టారు. అక్కడ యధాతథ స్థితిని కొనసాగించాలన్న కోర్టు ఆదేశాలను కాపాడుతామని హామీ ఇచ్చి, దానికి విరుద్ధంగా ప్రవర్తించారు. మసీదును కూలగొట్టి ఇస్లామిక్ నిర్మాణాన్ని తుడిచిపెట్టడం దారుణమైన చట్టఉల్లంఘన’ అని సుప్రీంకోర్టు శనివారం తనతీర్పులో వ్యాఖ్యానించింది. దాంతో ప్రస్తుతం అందరి దృష్టి లఖ్నవూ సీబీఐ కోర్టులో 27 ఏళ్లుగా కొనసాగుతున్న కేసుపైకి మళ్లింది. ఈకేసు నిందితుల్లో 49 మంది ఇప్పటికే కన్నుమూశారు.
* 1992 డిసెంబర్ 6న మసీదును కూల్చేసిన వెంటనే సాయంత్రం 5.15 గంటలకు గుర్తుతెలియని కరసేవకులపై 197/92 నంబరుతో మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. మరో 10 నిమిషాల తర్వాత 198/92 నంబరుతో రెండో ఎఫ్ఐఆర్ నమోదైంది. అందులో ఎల్కే ఆడ్వాణీ, అశోక్సింఘాల్, గిరిరాజ్కిశోర్, మురళీమనోహర్జోషీ, ఉమాభారతి, వినయ్కటియార్, విష్ణుహరి దాల్మియా, సాద్వీ రితంభరపై కేసు పెట్టారు.
* తర్వాత కాలంలో అన్ని కేసులనూ సీబీఐకి కట్టబెట్టింది. దర్యాప్తు అనంతరం 40 మందిపై 1993 అక్టోబరు 5న లఖ్నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. 1996 జనవరి 11న మరో తొమ్మిది మందిపై అభియోగాలు మోపడంతో నిందితుల సంఖ్య 49కి చేరింది.
* నేరపూరిత కుట్రతోనే కూల్చినట్లు 1997 సెప్టెంబరులో భాజపా, ఆర్ఎస్ఎస్ల ప్రముఖులపై అభియోగాలను నమోదు చేశారు.
* విద్వేష పూరిత ప్రసంగాలపై 48 కేసుల్లో అభియోగాల నమోదుకు అనుమతిస్తూనే, ఆడ్వాణీ, మురళీమనోహర్జోషీ, ఉమాభారతి, వినయ్కటియార్, ఇతరులకు మినహాయింపు ఇచ్చింది. ఈపరిణామంతో 21 మందిపై గతంలో తామిచ్చిన ఆదేశాలను 2001 మే 4న సీబీఐ లఖ్నవూ కోర్టు ఉపసంహరించుకుంది.
* సీబీఐ 2003 జనవరి 27న రాయబరేలీ కోర్టును ఆశ్రయించి ప్రముఖులపై నమోదైన కేసు విచారణ కొనసాగించాలని కోరింది.
* 2003 సెప్టెంబరు 19న రాయబరేలీ స్పెషల్మేజిస్ట్రేట్ విద్వేష పూరిత ప్రసంగం కేసు నుంచి నాటి ఉపప్రధాని ఆడ్వాణీకి విముక్తి కల్పించారు. మిగిలిన వారిపై అభియోగాల నమోదుకు అనుమతిచ్చారు.
* ఆడ్వాణీకి విముక్తి కల్పించడంపై పలువురు సవాల్ చేయగా… హైకోర్టు ఆదేశంతో 2005 జులై 26న నిందితులందరిపై తిరిగి అభియోగాలు నమోదయ్యాయి.
* 49 మందిపై వేర్వేరు చోట్ల విచారణ సాగడంపై 2011లో సుప్రీంను సీబీఐ ఆశ్రయించగా… 2017 ఏప్రిల్ 19న అన్ని కేసులను లఖ్నవూ సీబీఐ కోర్టుకు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆడ్వాణీతోపాటు మిగిలిన 20 మందిపైనా అభియోగాలు నమోదు చేయాలంది.
పి.వి. ఆపి ఉండేవారా? దిల్లీ: పి.వి.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదు కూల్చివేత చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆయన మౌనంగా ఉండిపోయారని, తలచుకొని ఉంటే మసీదు విధ్వంసాన్ని ఆపగలిగే ఉండేవారని అప్పటి నుంచి వస్తున్న ప్రధాన విమర్శ. ఆ సమయంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా వ్యవహరించిన మాధవ్ గాడ్బోలే ‘బాబ్రీ మసీదు- రామ మందిర వివాదం: భారత రాజ్యాంగానికి కఠిన పరీక్ష’ పేరుతో ఓ పుస్తకాన్నే రాశారు. బాబ్రీ మసీదు రక్షణకు కేంద్ర హోం శాఖ రూపొందించిన ప్రణాళికను ఆయన పొందుపరిచారు. రాష్ట్రపతి పాలన విధించి మసీదు ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నది ఆ ప్రణాళిక సారాంశం. ఎటువంటి మెరుపు సంఘటనలు జరిగినా, మసీదుకు భద్రత కలిగించి, దాన్ని స్వాధీనం చేసుకునేలా కేంద్ర పారామిలటరీ బలగాలను పంపించాలన్నది ప్రధాన అంశం. ఇది ఆచరణ సాధ్యం కాదంటూ పి.వి. తిరస్కరించారని ఆ పుస్తకంలో రాశారు. మసీదు రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అప్పటి యూపీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ హామీ ఇచ్చి, అనంతరం చేతులు ఎత్తివేశారని పలు సందర్భాల్లో పి.వి. తెలిపారు. |
Courtesy Eenadu..