వాళ్లు ఎవరిపైనా రాళ్లు రువ్వలేదు,కేవలం నినాదాలు చేస్తూ మార్చ్ లో మాత్రమే పాల్గొన్నారు. మహిళా పోలీసులెవరూ అందుబాటులో లేకపోయినా యూనిఫాంలో ఉన్న పురుష పోలీసులు వారిపైకి దూసుకొస్తున్నా తమ ఎంతో ధైర్యంగా వాళ్లని ఎదుర్కొని,వెనుదిరిగేలా చేసారు ఐషా మరియు లదీదా.
కేరళకి చెందిన ముగ్గురు జామియా విద్యార్థులు ఆదివారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లోని కొన్ని వీడియోలలో వైరల్ అయ్యారు.తమ సహ విద్యార్థిని ఒక పోలీసు ఈడ్చుకొచ్చి అతనిపై విరుచుకుపడుతుంటే ఓ నలుగురు మహిళలు అతడ్ని కాపాడటానికి ముందుకొచ్చి ఆ పోలీసుని వెనక్కి తగ్గేలా చేసారు.
సోమవారం ఉదయానికల్లా వారు చూపించిన తెగువ జామియా నిరసనల పట్ల పోలీసు క్రూరత్వానికి సాక్షీభూతంగా నిలిచింది. లాఠీలతో ఇష్టమొచ్చినట్లు కొడుతూ,బెదిరిస్తూ ఉన్నా కూడా ఏమాత్రం భయపడకుండా వారంతా షహీన్ ని పోలీసుల నుంచి రక్షించారు.
తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ తామూ కొద్దిపాటిలో లాఠీఛార్జ్ నుంచి తప్పించుకున్నామనీ,పక్కనే నిల్చున్నవాళ్లు పోలీసులనే గమనిస్తూ,ఫోటోలు తీస్తుండడంతో బయటపడగలిగామనీ చెప్పారు.
మెరూన్ హిజాబ్ ధరించిన ఐషా రెన్నా, బూడిదరంగు హిజాబ్ లో ఉన్న లదీదా సఖ్లూన్ షహీన్ అబ్దుల్లాని పోలీసుల నుంచి కాపాడటానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు కొన్ని కెమెరాలకి చిక్కాయి.
ఆదివారం రోజు జరిగిన నిరసనల్లో మేం చివరలో నిల్చున్నాం. హఠాత్తుగా మా ముందున్న కొంతమంది విద్యార్థులు వెనక్కి పరుగెత్తుకుంటూ వస్తుండడం గమనించాం. కాసేపు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఐతే టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న పోలీసులు కనబడగానే మేమూ తప్పించుకోవడానికి ప్రయత్నించాం.
ఒక చెట్టు వెనకాల దాక్కోవడానికి మేం ప్రయత్నించాం కానీ అప్పటికే ఆస్తమాతో బాధపడుతున్న లదీదాకి ఊపిరి తీసుకోవడం కష్టం ఔతుండడంతో దగ్గర్లోనే ఉన్న ఓ ఇంట్లో తలదాచుకోవాలనుకున్నాం అని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేస్తున్న మళప్పురం వాసి ఐషా రెన్నా చెప్పింది. మహిళా పోలీసులెవరూ లేకపోవడంతో ఎవరూ తమపై దాడి చేసేంత సాహసం చేయకపోవచ్చని వారు భావించారు.
ఆస్తమాతో బాధపడుతున్న నన్ను టియర్ గ్యాస్ ఉక్కిరిబిక్కిరి చేసింది. అప్పటికే మాతో పాటూ ఉన్న ఓ సహ విద్యార్థినికి గాయాలవ్వడంతో తనకి ఫస్ట్ ఎయిడ్ అందించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇంట్లోకి వెళ్తే ఐనా తప్పించుకోవచ్చనుకుంటే అక్కడా వెంబడించడంతో మేం స్లోగన్స్ రైజ్ చేసాము. మహిళలం అని కూడా చూడకుండా మాపై చాలా దౌర్జన్యంగా ప్రవర్తించారు అని మరో విద్యార్థిని కన్నూర్ వాసి లదీదా గుర్తు తెచ్చుకుని విలపించారు.
షహీన్ మేము ఎక్కడ ఉన్నామో అని కంగారుపడుతూ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు. అలా వచ్చినప్పుడే పోలీసులు అతనిపై దాడి చేసారు.
షహీన్,ఐషా కోజికోడ్ లోని ఫరూక్ కాలేజీలో చదువుకున్నప్పట్నుంచీ మంచి స్నేహితులు. షహీన్ ఒక యువ జర్నలిస్టుగా పనిచేస్తూ జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. తాను జర్నలిస్టునని చెబుతున్నా వినిపించుకోకుండా తనపై విరుచుకుపడ్డారని వాపోయారు.
కొద్దిసేపటికి అక్కడ్నుంచి ఎలాగోలా తప్పించుకుని వారంతా హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ కి చేరుకున్నారు. వారి స్నేహితులూ,బంధువులంతా ముక్తకంఠంతో ఒకే మాట చెప్తున్నారు మీడియా,ఫోటోలు తీస్తున్న వ్యక్తులే గనక చుట్టూ లేకపోతే తమ పిల్లలకీ,స్నేహితులకీ మరింత హాని జరిగుండేదని.
ఐషా భర్త అసల్ రహ్మాన్ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తారు,రెండ్రోజుల క్రితం ఇదే క్యాబ్ చట్టానికి సంబంధించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు గానూ పోలీసుల చేత దెబ్బలు తిన్నారు. “ఆదివారం ఆయన నాతో లేరు ఐతే ఆయన నుంచీ,మా పేరెంట్స్ నుంచీ మా నిరసనకి పూర్తి మద్దతు ఉంది. మా హక్కుల్ని కాలరాసే రాజ్యాంగ విరుద్ధమైన క్యాబ్ చట్టాన్ని ఖచ్చితంగా మేం వ్యతిరేకించే తీరతాం” అని ఐషా,లదీదా ఇద్దరూ స్పష్టం చేసారు.
కొన్నిరోజుల క్రితమే చందా యాదవ్ అనే మరో మహిళతో కలిసి ఈ ఇద్దరూ కలిసి నిరసనలు ముందుండి నడిపించడం,గోడపై నిల్చొని తమ తోటి నిరసనకారులని ఉత్తేజపరిచేలా ప్రసంగించడమూ యువతని చాలా ప్రభావితం చేసింది.
మేం ఖచ్చితంగా మా గొంతు వినిపిస్తాం,భయపడే సమస్యే లేదు. ఇప్పుడు మాట్లాడకపోతే తర్వాత మాట్లాడడానికి మేమూ మిగలకపోవచ్చేమో,మరి ఎందుకు భయపడాలి? అని ఎదురు ప్రశ్నించారు.