దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య సంఘం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలో ఏర్పాటు

ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలి
ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటున్నారు
తెలంగాణ హైకోర్టు, ఎన్‌హెచ్‌ఆర్‌సీల్లో విచారణపై స్టే
తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు వేరే విచారణలు వద్దు: సుప్రీం

దిల్లీ : దిశపై హత్యాచారానికి ఒడిగట్టిన నిందితుల ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఎస్‌. సిర్పుర్కర్‌ నేతృత్వంలో బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రేఖా ప్రకాశ్‌, సీబీఐ మాజీ అధిపతి డి.ఆర్‌.కార్తికేయన్‌ సభ్యులుగా న్యాయ విచారణ సంఘాన్ని నియమించింది. ప్రారంభించిన నాటి నుంచి ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని పేర్కొంది. భిన్న వాదనల నేపథ్యంలో ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.  న్యాయవాదులు జి.ఎస్‌. మణి, ప్రదీప్‌కుమార్‌ యాదవ్‌, ఎం.కె. శర్మ, ఎం.ఎల్‌. శర్మ దాఖలు చేసిన మూడు వేర్వేరు పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎస్‌.ఎ. బోబ్డే, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. త్రిసభ్య సంఘానికి సీఆర్‌పీఎఫ్‌తో భద్రత కల్పించాలని ఆదేశించింది. హైదరాబాద్‌ కేంద్రంగా కమిటీ పనిచేస్తుందని, వీరికి కావాల్సిన వసతుల్ని తెలంగాణ ప్రభుత్వం సమకూర్చాలని ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌ మీద కోర్టుల్లో ఉన్న పిటిషన్లపై స్టే విధించింది. కేసు విచారణపై వార్తలు రాకుండా మీడియాను కట్టడి చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. మీడియా నోరు కట్టేయలేమంది. అయితే నియంత్రణ పాటించాలని, అధికారికంగా ఇచ్చిన సమాచారాన్నే మీడియా ప్రసారం చేయాలని ధర్మాసనం పేర్కొంది.

ఎన్‌కౌంటర్‌పై సందేహాలున్నాయంటూ..
తొలుత పిటిషనర్‌, న్యాయవాది జి.ఎస్‌. మణి వాదనలు ప్రారంభిస్తూ.. ఎన్‌కౌంటర్‌పై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన 16 మార్గదర్శకాలను పోలీసులు అనుసరించలేదని ఆరోపించారు. దిశ అత్యాచార ఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఎన్‌కౌంటర్‌ చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. ఎన్‌కౌంటర్‌లో మరణాలపై సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలనే తెలంగాణ సర్కారు అనుసరిస్తోందని, విశ్రాంత న్యాయమూర్తి ద్వారా మళ్లీ విచారణ చేయించాల్సిన అవసరం లేదని చెప్పారు. దిశ వస్తువుల్ని చూపిస్తామని నిందితులు చెప్పడంతో ఘటనాస్థలికి వారిని తీసుకెళ్లారన్నారు. పోలీసుల్ని చంపాలని నిందితులు ప్రయత్నించడంతో ఆత్మరక్షణకు పోలీసులు ఎదురుకాల్పులు జరపగా నిందితులు మృతిచెందారని వివరించారు. పోలీసులు తప్పు చేసినట్లు చెప్పడం లేదని ధర్మాసనం ఈ దశలో వ్యాఖ్యానించింది. ‘‘ఎన్‌కౌంటర్‌పై విచారణ జరగాలి. నిష్పాక్షిక విచారణ జరగనిద్దాం. విచారణలో ప్రభుత్వ వైఖరి తెలుసుకోవాల్సి ఉంది’’ అని సీజేఐ అన్నారు.

పోలీసుల్ని ప్రాసిక్యూట్‌ చేయాలి… విచారణను అడ్డుకోవద్దు
‘‘నిందితులను తీసుకెళ్లే సమయంలో తూటాలతో నిండిన తుపాకులు తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది’’ అని ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. ఘటనపై నిష్పక్షపాతమైన విచారణ జరపడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని, సమాంతరంగా న్యాయ విచారణ జరపడం చట్ట విరుద్ధమని రోహత్గి తెలిపారు. ప్రజలు నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారని సీజేఐ చెప్పారు. విచారణను అడ్డుకోవద్దు అని ఆదేశించారు. న్యాయ విచారణకు ఆదేశిస్తే ఎన్‌హెచ్‌ఆర్‌సీ, హైకోర్టు విచారణలు నిలిపివేయాలని రోహత్గి కోరారు. నలుగురు నిందితుల కుటుంబాలకు రూ.15లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని న్యాయవాది ఎంఎల్‌ శర్మ కోరగా- దిశ విషయంలో నలుగురు నిందితులు ఏం చేశారనే విషయంలో తామేమీ కళ్లు మూసుకోలేదని, వారికి ఎలాంటి అసాధారణ మినహాయింపు లభించదని జస్టిస్‌ బోబ్డే స్పష్టం చేశారు. అయోధ్య వంటి కేసుల్లో తప్ప మీడియాను నియంత్రించాలని తామెప్పుడూ భావించలేదని జస్టిస్‌ బోబ్డే పేర్కొన్నారు.

కమిటీ సభ్యుల గురించి… ఆ నలుగురిపై విచారణ వల్ల ఫలితం లేదు
నలుగురు నిందితులు చనిపోయిన నేపథ్యంలో వారిపై విచారణ వల్ల ఎలాంటి ఫలితం లేదు. వారు ఎలాగూ హాజరు కాలేరు. పోలీసులు మాత్రమే ఆధారాలు ఇవ్వగలరు. మరింత పారదర్శకంగా విచారణ సాగనిద్దాం. మీరు (పోలీసులు) తప్పు చేశారని మేం అనడం లేదు. పారదర్శక విచారణ అవసరం.

– సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య సంఘం

జస్టిస్‌ సిర్పుర్కర్‌

మహారాష్ట్రకు చెందిన జస్టిస్‌ సిర్పుర్కర్‌ 2007 జనవరి 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై, నాలుగున్నరేళ్లపాటు సేవలందించారు. అంతకంటే ముందు బొంబాయి, మద్రాస్‌ హైకోర్టుల్లో న్యాయమూర్తిగా, ఉత్తరాఖండ్‌/ కలకత్తా హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. 2000 సంవత్సరంలో సంచలనం సృష్టించిన ఎర్రకోటపై దాడి కేసులో నిందితుడు మహ్మద్‌ ఆరిఫ్‌ (పాకిస్థాన్‌)కు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చిన ధర్మాసనంలో జస్టిస్‌ సిర్పుర్కర్‌ ఉన్నారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య సంఘం జస్టిస్‌ రేఖా ప్రకాశ్‌ బల్దోటా
కర్ణాటకకు చెందిన జస్టిస్‌ రేఖా ప్రకాశ్‌ ముంబయి యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. 1980లో న్యాయవాదిగా బార్‌కౌన్సిల్‌లో పేరునమోదు చేసుకున్నారు. బొంబయి హైకోర్టు, సివిల్‌ సెషన్స్‌ న్యాయస్థానాల్లో పలు సివిల్‌ కేసులు వాదించారు. క్రిమినల్‌ కేసు విచారణల్లో ఎమికస్‌ క్యూరీగా వ్యవహరించారు. 2008 ఏప్రిల్‌ 16న బొంబయి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య సంఘం డి.ఆర్‌. కార్తికేయన్‌
తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన డీఆర్‌ కార్తికేయన్‌ 1964లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. కర్ణాటక క్యాడర్‌కు నియమితులయ్యారు. అన్నామలై యూనివర్సిటీ నుంచి వ్యవసాయ డిగ్రీ, మద్రాస్‌ లా కళాశాల నుంచి న్యాయశాస్త్ర డిగ్రీ పూర్తిచేశారు. 1998లో సీబీఐ అధిపతిగా విధులు నిర్వర్తించారు. అంతకంటే ముందు బెంగళూరు డీసీపీగా, కర్ణాటక రాష్ట్ర పోలీసు అకాడమీ అధిపతిగా, సీఆర్‌పీఎఫ్‌ ప్రత్యేక ఐజీగా పనిచేశారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఫస్ట్‌ సెక్రటరీగా, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ డైరెక్టర్‌ జనరల్‌గా సేవలందించారు.

Courtesy Eenadu…

RELATED ARTICLES

Latest Updates