మహిళలతో రక్షణ కమిటీలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • గ్రామాల్లో స్వశక్తి సంఘాల సభ్యులతో ఏర్పాటు
  • పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహణ
  • అసాంఘిక చర్యలపై పోలీసులకు సమాచారం
  • ఆత్మరక్షణపై మహిళలకు యాప్‌ ద్వారా కోర్సు
  • పాఠ్య పుస్తకాలపై డయల్‌-100, 112 ముద్రణ
  • రాష్ట్రమంతటా ‘హాక్‌ ఐ’ యాప్‌ విస్తరణ
  • 4 కీలక శాఖల మంత్రుల భేటీలో నిర్ణయం
  • మెట్రోలో మహిళలకు పెప్పర్‌ స్ర్పే అనుమతి
  • మహిళల మిస్సింగ్‌ కేసుల్లో జీరో ఎఫ్‌ఐఆర్‌
  • తక్షణమే గాలింపులు చేపట్టాలని ఆదేశం

హైదరాబాద్‌, డిసెంబరు 4: గ్రామాల్లో మహిళల రక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు మహిళలతో ప్రత్యేక కమిటీలను వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీలు గ్రామంలో జరిగే సంఘటనలను ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులకు తెలియజేస్తారు. కమిటీలో గ్రామ కార్యదర్శి, ఆయా మహిళా స్వశక్తి సంఘాలకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. మహిళల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై హోంమంత్రి మహమూద్‌ అలీ, విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి,పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహిళా సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్‌ సమావేశమయ్యారు. ఏఏ శాఖ ఏం చేయాలనే దానిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో జరిగే కొన్ని అసాంఘిక ఘటనలు, జులాయిగా తిరిగే పోకిరీల చర్యలు పోలీసుల దృష్టికి రావడం లేదని అభిప్రాయపడ్డారు. గ్రామంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఈ కమిటీ గ్రామాల్లో జరిగే అన్ని విషయాలను ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుందని భావించారు. కమిటీల్లో మహిళా గ్రూపులను భాగస్వాములను చేయడం ద్వారా మహిళలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దనరెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

ఈ-ఎంపవర్‌మెంట్‌’ కోర్సు
అమ్మాయిలు ఆత్మరక్షణకు సంబంధించి పాఠశాల స్థాయిలోనో, కాలేజీ స్థాయిలోనో ఎంతో కొంత నేర్చుకుంటున్నారు. అయితే, వివిధ కారణాల వల్ల చాలామంది అమ్మాయిలు మధ్యలోనే చదువుకు దూరమవుతున్నారు. ఆత్మరక్షణ శిక్షణను విద్యా సంస్థలకే పరిమితం చేయడం వల్ల సమాజంలో ఎక్కువ మంది మహిళలకు వీటిపై అవగాహన లేకుండా పోతోందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మహిళలందరికీ క్లిష్ట సమయాల్లో ఏం చేయాలనే దానిపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. చదువుతో సంబంధం లేకుండా వీరికోసం ప్రత్యేకంగా ‘ఈ-ఎంపవర్‌మెంట్‌’ ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సును ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఈ కోర్సులో మహిళల రక్షణకు సంబంధించి 17-20 ప్రశ్నలు ఉంటాయి. వీటికి సరైన సమాధానం చెబితే సర్టిఫికెట్‌ ఇస్తారు. ఈ కోర్సులో క్లిష్ట సమయంలో ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? పోలీసులకు ఏ విధంగా సమాచారం ఇవ్వాలి? ఇలాంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. ఇది గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని, మహిళలందరూ కోర్సును పూర్తి చేయవచ్చు.

విస్తృత అవగాహన!
మహిళల రక్షణపై విస్తృత అవగాహన చేపట్టాలని, పట్టణాల్లోని అపార్ట్‌మెంట్లు, కాలనీల్లో ప్రచారం చేయాలని నిర్ణయించారు. డయల్‌-100, 112లపై రాష్ట్రమంతటా హోర్డింగ్స్‌, గోడలపై పెయింటింగ్‌ వేయించనున్నారు. విద్యా సంస్థల్లో డ్రగ్స్‌ వాడుతున్నట్లయితే కళాశాలలు రహస్యంగా తమకు నివేదించాలని పోలీసులు సూచించారు. దానిపై రహస్య విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మిస్సింగ్‌ కేసులకు జీరో ఎఫ్‌ఐఆర్‌!
పరిధితో సంబంధం లేకుండా మహిళల అపహరణకు సంబంధించిన కేసులను తక్షణమేరిజిస్టర్‌ చేసి(జీరో ఎఫ్‌ఐఆర్‌), వెంటనే రంగంలోకి దిగాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. షీ టీమ్స్‌ను బలోపేతం చేస్తారు. హాక్‌ ఐ యాప్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. పోలీసు యాప్‌, డయల్‌ 100, 101, 1091, 112పై విస్తృత ప్రచారం చేస్తారు. హైల్ప్‌లైన్‌ నంబర్లు కనిపించే విధంగా విద్యా సంస్థలు, రవాణా వాహనాల్లో నోటీసు బోర్డులు పెడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, బహిరంగ స్థలాల్లో, పాఠ్యపుస్తకాల మీద హెల్ప్‌లైన్‌ నంబర్లు కనిపించే విధంగా ఏర్పాటు చేస్తారు.

పోలీస్‌ రాడార్‌లోకి పోకిరీలు!
ఎలాంటి ఉద్యోగం లేకుండా జులాయిగా తిరిగే వాళ్లు, చిన్నా చితకా ఉద్యోగాలు చేసేవాళ్లపై నిఘా ఉంచాలని పోలీసు శాఖ భావిస్తోంది. కనీస అవసరాల ఖర్చుల కోసం ఇనుము, వాహనాల్లో నుంచి పెట్రోల్‌, డీజిల్‌, ఇళ్లలో రాత్రిపూట వస్తువులు దొంగిలిస్తూ తిరిగే వాళ్లపై ఎక్కువ నిఘా పెట్టనున్నారు. వైట్‌నర్‌కు బానిసలై రైల్వే స్టేషన్లు, డంపింగ్‌ యార్డుల్లో సంచరించే వాళ్లపైనా కన్నేసి ఉంచుతారు.

మెట్రోలో పెప్పర్‌ స్ర్పేకు అనుమతి
మహిళల భద్రత దృష్ట్యా హైదరాబాద్‌ మెట్రో రైళ్లల్లో పెప్పర్‌ స్ర్పే తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. వఇప్పటిదాకా మెట్రో రైళ్లలో వాటిపై నిషేధం ఉండటంతో ఇంటి నుంచి పనిస్థలాలకు పెప్పర్‌ స్ర్పే తీసుకెళ్లాలనుకునే మెట్రో ప్రయాణికులకు ఇబ్బంది ఉండేది. ఇప్పుడా సమస్య తీరిపోయింది. దీనిపై హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ, సాప్ట్‌వేర్‌ ఉద్యోగినుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పెప్పర్‌ స్ర్పేను అనుమతించనున్నామని చెప్పారు.

100, 112పై అవగాహన
అత్యవసర సమయాల్లో పోలీసులను ఆశ్రయించేందుకు కాల్‌ చేయాల్సిన ఫోన్‌ నంబర్లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని మంత్రులు నిర్ణయించారు. డయల్‌-100(అత్యవసరం), డయల్‌-112(వేధింపులు) నంబర్లకు ఫోన్లు చేయడంపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలపై ఈ నంబర్లకు సంబంధించిన ప్రకటనలు ముద్రించాలని నిర్ణయించారు. మహిళల వేధింపుల నివారణపై పుస్తకాల్లో పలు పాఠ్యాంశాలు ఉన్నా యి. వీటికి మార్పులు చేయాలని నిర్ణయించారు.

సీసీ కెమెరా రికార్డులపై నిఘా
నేరగాళ్ల మనస్తత్వం, జీవన విధానాలకు దగ్గరగా ఉన్న వాళ్లపై ఎక్కువ నిఘా ఉంచాలని పోలీసులు భావిస్తున్నారు. వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ప్రవీణ్‌ ఇళ్ల ముందు ఆరేసిన మహిళల దుస్తులను వాసన చూస్తూ పైశాచికానందాన్ని పొందేవాడు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైంది. అలాంటి చర్యలకు పాల్పడే వాళ్లను గుర్తించేందుకు సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలించాలని పోలీసులు భావిస్తున్నారు. లైంగిక వేధింపులు, ఈవ్‌ టీజింగ్‌ కేసులు నమోదై, ఇప్పటికీ వ్యవహార శైలిలో మార్పు రాకుండా వ్యవహరిస్తున్న వాళ్లను క పోలీస్‌ రాడార్‌లో చేర్చాలని పోలీసులు భావిస్తున్నారు.

Courtesy Andhrajyothi…

RELATED ARTICLES

Latest Updates