ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

నవ వధువు అనుమానాస్పద మృతి
సింహాచలంలో గత నెల 22నే పెళ్లి చేసుకున్న ప్రేమికులు
మెట్టినింట్లోనే ఊపిరి వదిలిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని
పోలీసుల అదుపులో భర్త, అతడి తల్లిదండ్రులు

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: ఓ యువతి తన తండ్రి వద్ద పనిచేసే యువకుడి ప్రేమలో పడింది. పెద్దలు వద్దన్నా..దూరం చేసే ప్రయత్నం చేసినా అతనే లోకంగా బతికింది. ఆయన ఉంటే చాలు లోకంలో ఎవరూ అక్కర్లేదనేంత బలంగా అతనితో బంధాన్ని పెనవేసుకుంది. ఆ ప్రేమను బతికించుకునేందుకు కన్నవాళ్లనూ ఎదిరించింది. ఏం జరిగిందో ఏమో! పెళ్లయిన పన్నెండు రోజుల్లోనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు అత్తారింట్లో అనుమానాస్పద స్థితిలో ఉరి తాడుకు వేలాడింది. తనే ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు చెబుతుండగా..కాదు వాళ్లే హత్య చేశారని యువతి తరఫు వారు ఆరోపిస్తున్నారు. ఎస్సార్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం పెసరమిల్లి గ్రామానికి చెందిన ఎ.ప్రసాద్‌ కుటుంబం ప్రస్తుతం మోతీనగర్‌ సమీపంలోని పాండురంగారావునగర్‌లో నివాసం ఉంటోంది. బాలానగర్‌లో ప్రసాద్‌ ఓ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె పూర్ణిమ అన్నపూర్ణ(25) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు. తండ్రి నడిపే కంపెనీలో పనిచేస్తున్న, బోరబండ రామారావునగర్‌కు చెందిన దాసరి కార్తిక్‌(28)తో ఆమెకు పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. విషయం తన దాకా రావడంతో యువతి తండ్రి కార్తిక్‌ను పనిలోనుంచి తొలగించాడు. అయినా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతూ వచ్చింది. తమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించరని భావించిన ప్రేమికులు గత నెల 22వ తేదీన సింహాచలంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం సనత్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరు వర్గాల కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడారు. కుమార్తెకు నచ్చజెప్పేందుకు తల్లిదండ్రులు శతథా ప్రయత్నించారు. కార్తిక్‌తోనే ఉంటానని ఆమె తేల్చిచెప్పడంతో మిన్నకుండిపోయారు. అప్పట్నుంచి యువతి అత్తింట్లోనే ఉంటోంది.

పుట్టిన రోజు వేడుకలో ఏమైంది?
సోమవారం కార్తిక్‌ పుట్టిన రోజు. వేడుకలను ఇంట్లో జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా మద్యం తాగిన అతడు భార్యతో ఘర్షణ పడినట్లు సమాచారం. ‘‘పూర్ణిమ తన చరవాణికి వచ్చిన ఓ సందేశాన్ని డిలీట్‌ చేయడం ఇద్దరి మధ్య గొడవకు కారణమైందని’’ పోలీసులు అనుమానిస్తున్నారు. తర్వాత ఏం జరిగిందో ఏమో! మంగళవారం మధ్యాహ్నం ఆమె ఇంట్లోనే ఫ్యాను కొక్కేనికి వేలాడింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తలపై గాయాలు ఉన్నట్టు గుర్తించారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ‘ఇంట్లోని యువతి డైరీలో సూసైడ్‌ నోట్‌ లభించింది. యువతే  రాసిందా? మరెవరైనా రాసి అక్కడ పెట్టారా? అనే విషయం తేల్చేందుకు దాన్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపనున్నాం. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాం. ఫోరెన్సిక్‌, పోస్టుమార్టం నివేదికలు వచ్చిన తర్వాత దర్యాప్తు ముమ్మరం చేస్తాం’’ అని పోలీసులు పేర్కొన్నారు. బుధవారం మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కార్తీక్‌, అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు.

హత్య చేసి..ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు
తమ కుమార్తెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మృతురాలి తండ్రి ప్రసాద్‌ ఆరోపించారు. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మరణవార్త తెలిసిందని, ఇంటికి వెళ్లి చూడగా అప్పటికీ కార్తిక్‌ మద్యం తాగి ఉన్నాడని ఆరోపించారు. తమను ఎదిరించి పెళ్లి చేసుకున్నప్పటికీ కుమార్తెతో తరచూ మాట్లాడేవాళ్లమని, ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని భావించామని, ఇంతలోనే మరణవార్త వినాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు.

Courtesy Eenadu…

RELATED ARTICLES

Latest Updates