నీతి లేదు… భీతి లేదు… నరజాతికిది రీతి కాదు…

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
Image result for నీతి లేదు... భీతి లేదు... నరజాతికిది రీతి కాదు..."ఆగని హత్యాచారాలు… పలు రాష్ట్రాల్లో సంఘటనలు
తెలుగు రాష్ట్రాల్లోనూ ఘోరాలు
దిల్లీలో నిర్భయ సంఘటనతో దేశం యావత్తూ నివ్వెరపోయింది. నిందితులను ఉరి తీయాలంటూ గొంతెత్తి ఆక్రోశించింది.
కశ్మీరులోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికను కామాంధులు కాలరాస్తే… ఆసేతు హిమాచలం ఆవేదన చెందింది.
…నిన్న గాక మొన్న హైదరాబాద్‌లో పశువైద్యురాలు ‘దిశ’ హత్యాచార సంఘటనపై భరతజాతి సమస్తం ఎలుగెత్తి నినదిస్తోంది. ఎన్నాళ్లీ అకృత్యాలని ముక్తకంఠంతో ప్రశ్నిస్తోంది. పార్లమెంటునూ కదిలించిన సంఘటన ఇది. ‘దిశ’లా మరొకరు బలి కాకుండా చట్టాలను కఠినతరం చేయాలని… నిందితులను కాల్చి చంపేయాలని దేశ ప్రజ గళమెత్తి గర్జిస్తోంది…
సభ్యసమాజం సిగ్గుపడే… ఈ హత్యాచార సంఘటనలు… నేరమనస్కులను కొంచెమైనా ఆలోచింపజేస్తున్నాయా? కాస్తయినా భయం కలిగిస్తున్నాయా? అని ప్రశ్నిస్తే కాదనేదే జవాబు.
ఆడవారిపై హత్యాచారాలు ఆగలేదు… దిల్లీ నుంచి గల్లీ వరకు… ఎక్కడో అక్కడ నమోదవుతూనే ఉన్నాయి. సోమ, మంగళవారాల్లోనూ దేశంలోని పలు ప్రాంతాల్లో దారుణాలు జరిగాయి. కర్ణాటక, బిహార్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆఘాయిత్యాలు చోటు చేసుకున్నాయి.
…ఏమైందీ దేశానికి? ఎటు పోతోందీ జాతి? బతుకునిచ్చే మహిళలను బతకనివ్వదా? ఇంటి దీపాలను ఇలాగే ఆర్పేస్తుందా? లోపం ఎక్కడుంది? మగపిల్లల పెంపకంలోనా? వారికి నీతి రీతి నేర్పని పెద్దల్లోనా? విచ్చలవిడిగా దొరికే మద్యంలోనా? భయం కలిగించలేని చట్టంలోనా?
మనిషికో మాట అంటారు… మాటలతో వినని వారిని మనుషులనగలమా? జాతి ధర్మం తప్పని జంతువులతో పోల్చగలమా?మనుషుల్లో ఈ అమానవీయ ప్రవృత్తికి ముగింపు ఎప్పుడు? ఎక్కడ? ఎలా?
ఓ మనిషీ.. నువ్వెక్కడ?
సిరిసిల్ల నుంచి ఆజంగఢ్‌ వరకు.. కలబురిగి నుంచి బిహార్‌ వరకు దేశవ్యాప్తంగా ఎక్కడా మహిళలు సురక్షితంగా ఉండలేకపోతున్నారు. దిల్లీ నుంచి గల్లీ వరకు.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు.. పలువురిపై సోమ, మంగళవారాల్లో పలు అఘాయిత్యాలు చోటుచేసుకున్నాయి. ఒకడు మాజీ కానిస్టేబుల్‌.. మరొకడు వరుసకు కొడుకు.. ఇంకొకడు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు! వీళ్లంతా అకృత్యాలకు పాల్పడినవారే. గజానికో గాంధారీపుత్రుడున్న ఈ దేశంలోమహిళలకు భద్రత ఎక్కడ?
పూరీలో బాలికపై ఘోరం
మాజీ పోలీసు, స్నేహితుడి సామూహిక అత్యాచారం
భువనేశ్వర్‌ (ఒడిశా), న్యూస్‌టుడే: అతడో వక్రమార్గం పట్టిన పోలీసు. గతంలోనే ఆరోపణల కారణంగా ఉద్యోగం పోయింది. మద్యం తాగి.. బాలికను ఎత్తుకెళ్లి స్నేహితుడితో కలిసి అత్యాచారం చేశాడు. ఒడిశాలోని పూరీ జిల్లా కుంభారిపడ పోలీసుస్టేషను పరిధిలో జరిగిన ఈ ఘటనలో నిందితులిద్దరినీ పోలీసులు మంగళవారం అరెస్టుచేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. పూరీ జిల్లాకు చెందిన బాలిక వ్యక్తిగత పనిమీద సోమవారం భువనేశ్వర్‌ వచ్చి, సాయంత్రం బస్సులో తిరుగు ప్రయాణమైంది. మార్గమధ్యంలో బస్సు నిలిచిపోయింది. ఆమె మరో బస్సు కోసం వేచిచూస్తుండగా.. జితేంద్రకుమార్‌ సెఠి అనే మాజీ కానిస్టేబుల్‌ వచ్చి పోలీసుగా పరిచయం చేసుకుని గుర్తింపుకార్డు చూపించాడు. తాను ఇంటివద్ద దింపుతానని చెప్పి ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. కారులో మరో ముగ్గురున్నారు. తర్వాత ఇద్దరు ఆమెను పోలీసుకాలనీ వసతిగృహంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాలు వారినుంచి తప్పించుకొని రాత్రి 10 గంటలకు కుంభారిపడ పోలీసుస్టేషనులో ఫిర్యాదుచేసింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. ఘటనపై పూరీ, భువనేశ్వర్‌లలో భాజపా, కాంగ్రెస్‌ నాయకులు ఆందోళనకు దిగి, ముఖ్యమంత్రి రాజీనామాకు డిమాండుచేశారు. జితేంద్రసెఠిపై ఆరోపణలు రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడిని డిస్మిస్‌ చేసినట్లు డీఐజీ ఆశిష్‌కుమార్‌సింగ్‌ చెప్పారు. అతడి భార్య కూడా కానిస్టేబులేనని, ఆమెకు కేటాయించిన వసతిగృహంలో ఉంటున్నాడని తెలిపారు.
ప్రేమించలేదని చంపేశాడు
జబల్‌పుర్‌: ప్రేమను నిరాకరించిన పాపానికి 16ఏళ్ల బాలికను యువకుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. 30 సార్లు పొడిచి ప్రాణాలు తీశాడు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌ జిల్లా కుడ్వారీ గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. శివకుమార్‌ (24) అనే యువకుడు గతంలో యువతిని ప్రేమిస్తున్నట్లు చెప్పగా ఆమె నిరాకరించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టుచేసి జైలుకు పంపారు. బెయిలు మీద బయటకు వచ్చిన నిందితుడు మంగళవారం యువతి ఇంట్లోకి వెళ్లి హత్య చేశాడు.
పెద్దమ్మపై అత్యాచారం.. హత్య
60 ఏళ్ల వృద్ధురాలిపై బంధువు దారుణం
ఐ.పోలవరం, న్యూస్‌టుడే: వరుసకు పెద్దమ్మ అయ్యే వృద్ధురాలిపై అత్యాచారానికి తెగబడటంతో పాటు ప్రాణాలు తీసేశాడో కిరాతకుడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని ఐ.పోలవరం మండలంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మండలపరిధిలో ఓ వృద్ధురాలు (60) ఒంటరిగా ఉంటున్నారు. భర్త మరణించడంతో వితంతు పింఛనుతో జీవనం గడిపేవారు. మంగళవారం ఉదయం పొరుగింటి మహిళ వచ్చి పిలిచినా, ఆమె బయటకు రాలేదు. దీంతో గదిలోకి వెళ్లి చూడగా, మంచంపై మరణించి పడి ఉన్నారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. జిల్లా ఎస్పీ నయీం అస్మి ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. క్లూస్‌టీమ్‌ నమూనాలను సేకరించిన తర్వాత పోలీసు జాగిలాన్ని రంగంలోకి దించడంతో.. అది మృతురాలి ఇంటినుంచి సమీపంలో ఉన్న నాగబాబు అనే వ్యక్తి ఇంటికి వెళ్లింది. స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేయగా.. మద్యం మత్తులో తానే ఘాతుకానికి పాల్పడినట్లు అంగీకరించాడు. పోలీసులు అతడిని అరెస్టుచేశారు. ఈ కేసులో గేదెల రాము, వర్రే బాబి అనే మరో ఇద్దరి పాత్ర కూడా ఉన్నట్లు అనుమానం రావడంతో.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
బాలికపై లైంగిక దాడి.. హత్య
బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: కర్ణాటకలోని కలబురగి జిల్లా సులేపేట్లో రెండోతరగతి చదివే బాలిక (8)పై ఓ యువకుడు లైంగికదాడి చేసి.. హతమార్చాడు. బాలిక సోమవారం బడికి వెళ్లలేదు. యల్లప్ప అనే యువకుడు ఆమెను వెంటబెట్టుకుని వెళ్లినట్లు స్థానికులు చెప్పారు. తల్లిదండ్రులు ఆమెకోసం గాలిస్తూ శివార్లలో కనిపించిన యల్లప్పను ప్రశ్నిచంగా, తొలుత తాను పాపను చూడలేదని చెప్పినా.. చివరికి నేరం అంగీకరించారు. నిందితుణ్ని సులేపేట్ ఠాణాలో అప్పగించారు. ఆమెపై తానే లైంగికదాడికి దిగి.. ఎవరికైనా చెబుతుందని హత్యచేశానని అంగీకరించాడు.
అత్యాచారం.. కాల్చివేత.. దహనం
బిహార్‌లో బాలికపై ఘాతుకం
బక్సర్‌: బిహార్‌లోని బక్సర్‌ జిల్లాలో ఓ బాలికపై కామాంధులు సోమవారం రాత్రి అత్యాచారానికి పాల్పడి తుపాకీతో కాల్చిచంపారు. తర్వాత మృతదేహాన్ని దహనం చేశారు. ఇటాఢీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నిర్జన ప్రదేశంలో ఉదయం ఆరు గంటల సమయంలో కాలిపోయిన స్థితిలో ఉన్న బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని బక్సర్‌ డీఎస్పీ సతీశ్‌కుమార్‌ తెలిపారు. బాలిక తలలో ఓ తూటా ఉందని చెప్పారు. బాధితురాలెవరన్న విషయాన్ని ఇంకా గుర్తించలేదు.
మృతదేహంతో శృంగారం
దంపతుల హత్య.. వారి చిన్నారి కుమార్తెపైనా అకృత్యం
వారణాసి, లఖ్‌నవూ: కామపిశాచి ఉన్మాదానికి మూడు నిండుప్రాణాలు బలైపోయాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇబ్రహీంపుర్‌లో గత నెల 24న నసీరుద్దీన్‌(38) అనే కామాంధుడు ఓ ఇంట్లోకి ప్రవేశించి 30ఏళ్ల మహిళను, ఆమె భర్తను, నాలుగు నెలల కుమారుడిని చంపేశాడు. మహిళ మృతదేహంతో మూడు గంటల పాటు శృంగారం చేశాడు. అనంతరం పదేళ్ల కుమార్తెపైనా అత్యాచారానికి పాల్పడ్డాడు. నాలుగేళ్ల కుమారుడిని తీవ్రంగా గాయపరిచాడు. మృతదేహంతో శృంగారం చేసిన సంఘటనను వీడియో తీశాడు. ఆ దృశ్యాలను తన మరదలికి చూపించడంతో ఆమె తీవ్రంగా భయపడింది. ఈ ఉన్మాదిని ఆజంగఢ్‌ పోలీసులు అరెస్టుచేశారు. హరియాణా, దిల్లీ, పశ్చిమ్‌బెంగాల్‌ రాష్ట్రాల్లోనూ నిందితుడు ఇలాగే అకృత్యాలకు పాల్పడినట్లు వెల్లడయింది.
ఉపాధ్యాయుడి వేధింపులు
సిరిసిల్ల పట్టణం, న్యూస్‌టుడే: పదోతరగతి విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు వేధింపులకు పాల్పడటంతో.. పోలీసులు కేసు నమోదుచేశారు. తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కోనరావుపేట మండలం మరిమడ్లకు చెందిన జింక భాస్కర్‌ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పదోతరగతి విద్యార్థినిపై కొన్ని నెలలుగా వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె తండ్రి తెలిపారు. చరవాణిలో ఆమె చిత్రాలను సేకరించి బెదిరిస్తున్నాడని మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటనర్సయ్య తెలిపారు.
బస్సులో విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన
శాయంపేట, న్యూస్‌టుడే: కళాశాలకు వెళ్లి ఆర్టీసీ బస్సులో ఇంటికి తిరిగి వస్తున్న ఇంజినీరింగ్‌ విద్యార్థిని పట్ల ఇద్దరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం వసంతాపూర్‌ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్థులు, ఎస్సై రాజబాబు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని సమీపంలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్నారు. రోజూలానే ఉదయం కళాశాలకు వెళ్లి సాయంత్రం పరకాలలో ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఈ క్రమంలో కొప్పుల గ్రామానికి చెందిన మామిడి రాకేష్‌, కనకం తరుణ్‌ విద్యార్థిని సీటు వద్దకు చేరుకొని అసభ్యంగా ప్రవర్తించారు. అప్రమత్తమైన బాధితురాలు డయల్‌ 100తో పాటు కుటుంబ సభ్యులకు చరవాణిలో సమాచారం అందించారు. బస్సు గ్రామానికి చేరుకోగానే కుటుంబ సభ్యులు ఆకతాయిలను పట్టుకుని తాళ్లతో కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
(Courtesy Eenadu)

RELATED ARTICLES

Latest Updates