ఎటెళుతున్నారు.. ఏమవుతున్నారు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
నగరంలో ఏటా పెరుగుతున్న అదృశ్యాలు

కన్పించకుండా పోయే వారిలో యువతులు, మహిళలే అధికం
వెతికినా ఆచూకీ లేక బంధువుల తీవ్ర ఆవేదన
పోలీస్‌స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు
హైదరాబాద్‌

* పొట్టకూటికి నగరానికి చేరింది ఆ కుటుంబం. ఆ ఇంటికి చెందిన బాలిక(16) చదువుకుంటూనే టీ స్టాల్‌లో తల్లికి సాయపడేది. ఓరోజు రాత్రి తల్లితో కలసి వెళుతూ రెప్పపాటులో మాయమైంది. వెతికినా ప్రయోజనం లేకపోయింది. రాత్రి 11 గంటలకు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిడ్డ కనిపిస్తుందని గంపెడాశతో ఇంటికెళ్లిన ఆ తల్లికి మరుసటి రోజు గుండె పగిలే వార్త తెలిసింది. ఖాళీ స్థలంలో ఓ మృతదేహం ఉందన్నది సమాచారం. అక్కడికెళ్లిన ఆ కన్నతల్లి కుప్పకూలింది. బలమైన గాయాలతో కుమార్తె నిర్జీవంగా పడిఉండడం చూసి బోరుమంది.

ఇటీవల శంషాబాద్‌ వద్ద దిశ అనే యువ వైద్యురాలు దారుణ హత్యాచారానికి గురైంది. రాత్రి 9 గంటల ప్రాంతంలో తానున్న పరిస్థితిని ఆమె తన చెల్లికి ఫోన్‌ ద్వారా వివరించింది. చుట్టూ దెయ్యాలంటి కుర్రాళ్లు ఉన్నారని భయమేస్తోందని తెలిపింది. అంతలోనే ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ కావటంతో కుటుంబ సభ్యులు వరుసగా రెండు పోలీసుస్టేషన్‌లకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అక్కడ జరిగిన ఆలస్యంతో ఆ వైద్యురాలు మరుసటి రోజు నిర్జన ప్రదేశంలో కాలిన దేహంగా కన్పించింది. కన్నకూతురు ఆపదలో  ఉందని కన్నీటితో వేడుకున్నా సాధారణ అదృశ్యం(మిస్సింగ్‌) కేసుగా పరిగణించటం ఆమె నిండు ప్రాణాన్ని బలితీసుకుందనే ఆరోపణలు, విమర్శలు సర్వత్రా వెల్లువెత్తాయి.

ఎటెళుతున్నారు.. ఏమవుతున్నారు!

ఎదురుచూపులు.. ఇంకిన కన్నీళ్లు..

మహానగర పరిధిలోని ఏ పోలీస్‌స్టేషన్లకు వెళ్లినా పదుల సంఖ్యలో కనిపించడం లేదు అంటూ వందలాది చిత్రాలతో గోడప్రతులు కనిపిస్తాయి. కొన్నిచోట్ల అయితే.. ఆచూకీ తెలిపిన వారికి భారీ బహుమానం ఇస్తామంటూ పేర్కొంటారు. మరికొన్ని ఫొటోల కింద బంధువులు పేర్కొనే వ్యాఖ్యలు చదివే వారి హృదయాలను ద్రవింపజేస్తాయి. ఇంతపెద్ద నగరంలో రోజూ పదుల సంఖ్యలో ఇళ్లు వదలి వెళ్లిపోతున్నారు. కొందరు కుటుంబ సమస్యలతో ఇంటికి దూరమవుతున్నారు. మరికొందరు వ్యక్తిగత కారణాలతో కన్పించకుండా పోతున్నారు. నగరంలో నవంబరులో కనిపించకుండా పోయిన 40 మందిలో 11 మంది మైనర్లు, 14 మంది మహిళలు ఉండడం గమనార్హం. వీరంతా ఏమయ్యారు.. ఎక్కడకు వెళ్లారనేది చిక్కు ప్రశ్నగానే మారింది. పోలీసులు మాత్రం తాము వెతుకుతున్నామంటూ చెబుతున్నారు.

పిల్లల కోసం తల్లి.. కూతురు కోసం తండ్రి

‘భర్తతో తాను విడిగా ఉంటున్నా. తనను నమ్మించి పిల్లలను చెన్నైకి తీసుకెళ్లిన భర్త ఇంతవరకు తిరిగి రాలేదు. దీంతో ఓ గృహిణి గతేడాది మే నెలలో జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంతవరకు వారి ఆచూకీ లభించలేదు. మరో మహిళ వివాహేతర సంబంధం నేపథ్యంలో ఇంటి నుంచి మరో వ్యక్తితో వెళ్లిపోయింది. ఆ మహిళ తండ్రి ఫిర్యాదు చేసి నెలలు గడుస్తోంది. ఇంతవరకు ఆచూకీ చిక్కలేదని తండ్రి వాపోయారు.

రాష్ట్రంలో గ్రేటర్‌లోనే ఎక్కువ

ఈ ఏడాది జూన్‌ 1వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య కేవలం పది రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 540 మంది అదృశ్యమవడం కలకలం రేపింది. వీరిలో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోనే 303 మంది ఉండడం గమనార్హం. మహిళలు 276 మంది, బాలికలు 55, బాలురు 26, పురుషులు 183 మంది ఉన్నారు. 222 మంది ఆచూకీ లభించింది. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఒక్క నవంబరులోనే 38-40 మంది అదృశ్యమైనట్లు కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోజూ 60 మంది కనిపించకుండా పోతుంటే.. వారిలో అధికశాతం గ్రేటర్‌ పరిధిలోని వారే కావటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. వీళ్లంతా ఏమవుతున్నారు. ఎక్కడకు చేరుతున్నారు. మానవమృగాల బారినపడి ఎంతమంది విగజీవులుగా మారుతున్నారనేది కన్నవారిని ఆందోళనకు గురిచేసే అంశం. యుక్తవయసు ఆడపిల్లలు మాయమైతే సజీవంగా ఇల్లు చేరేంత వరకూ తల్లిదండ్రులకు కంటి మీద కునుకు ఉండడంలేదు. అదృశ్యం కేసుల్లో అధికశాతం మహిళలు, యువతులే ఉండగా సగం మంది ఆచూకీ మాత్రమే లభిస్తోంది. మిగిలిన వారు వెతుకులాట పోలీసులకు సవాలుగా మారుతోంది. ప్రేమ, పెళ్లి విషయాల్లో మిస్సింగ్‌ కేసులు నమోదు చేస్తున్న పోలీసులు ఆచూకీ గుర్తించిన తరువాత కిడ్నాప్‌ కేసులుగా మార్చుతున్నారు.

తమ్ముడి కోసం నగరమంతా తిరిగాం
– రమణ, కేపీహెచ్‌బీ ఆరో ఫేజ్‌ఎటెళుతున్నారు.. ఏమవుతున్నారు!

నా తమ్ముడు చినబాబు(28) ఈ ఏడాది జూన్‌ 24న అదృశ్యమయ్యాడు. నగరమంతా గాలించాం. గల్లీ గల్లీ వెతికాం. ఇప్పటికీ రాత్రిళ్లు తిరుగుతూనే ఉన్నాం. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ అదృశ్యమవడం ఆందోళనగా ఉంది.

కొడుకు కోసం తిరగని చోటు లేదు
– దుగ్గి బాలస్వామి, కాపలాదారు, కేపీహెచ్‌బీ ఆరోఫేజ్‌ఎటెళుతున్నారు.. ఏమవుతున్నారు!

నాకు నలుగురు మగపిల్లలు. మూడో కొడుకు రాకేశ్‌(17). మాటలు సరిగా రావు. ఈ ఏడాది సెప్టెంబరు 23న ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. ఆచూకీ తెలుసుకునేందుకు తరచూ కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌కి వెళ్తూనే మా ప్రయత్నాలు చేస్తున్నాం. కొడుకు ఎప్పుడొస్తాడోనని నా భార్య ఎదురుచూస్తోంది.

నాన్న ఎటు వెళ్లాడో
– వీఎస్‌ రాజు, కేపీహెచ్‌బీ 4వ ఫేజ్‌ఎటెళుతున్నారు.. ఏమవుతున్నారు!

మా నాన్న బుద్దరాజు సత్యనారాయణరాజు(78)కు మానసిక స్థితి సరిగా లేదు. గతంలో ఒకసారి తప్పిపోతే పోలీసులు పట్టుకొని అప్పజెప్పారు. ఈ ఏడాది జూన్‌ 21న ఇంటి నుంచి వెళ్లి ఇంతవరకు రాలేదు. ఆచూకీ లభిస్తే ఈసారి తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటాం.

రెండున్నరేళ్లుగా తీరని కడగండ్లు

ఎటెళుతున్నారు.. ఏమవుతున్నారు!

ఇంద్రానగర్‌ గుడిసెల్లో నివాసముంటున్న ఎ.గీత(40) 2017 మేలో ఇంటినుంచి వెళ్లింది. కూలీ పని చేసుకునే ఈమె ఆచూకీ రెండున్నరేళ్లయినా దొరకలేదు. ఇప్పటికీ తల్లి జయమ్మ బాలానగర్‌ పోలీసులను తరచూ అభ్యర్థిస్తూనే ఉంది. ఎక్కడికెళ్లిందన్నది అర్థం కావడంలేదని రోజు ఆమె గురించే ఆలోచిస్తున్నామని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రాజు కాలనీకి చెందిన సంజీవరావు(36) మూడు నెలల క్రితం ఇంటినుంచి వెళ్లి తిరిగిరాలేదు. భార్య కరుణశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేయగా అతని ఆచూకీ లభ్యం కావడంలేదు.

మీకు తెలుసా

ఈ ఏడాది జూన్‌ 1వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య కేవలం పది రోజుల వ్యవధిలో గ్రేటర్‌లోని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 303 మంది అదృశ్యమయ్యారు.

లాలాపేట పోలీసుల ఆదర్శం

ఎటెళుతున్నారు.. ఏమవుతున్నారు!

లాలాపేట, న్యూస్‌టుడే: అదృశ్యమైన మహిళలు, యువతుల ఆచూకీ తెలుసుకుని అప్పగించడంలో లాలాగూడ పోలీసులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంట్లో సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయిన వారందరిని తీసుకొచ్చి అప్పగించడంలో వీరు విశేష కృషి చేస్తున్నారు. స్టేషన్‌ పరిధిలోని లాలాపేట, శాంతినగర్‌, చంద్రబాబునగర్‌, సత్యానగర్‌, ఇందిరానగర్‌, లాలాగూడ, మెట్టుగూడ, మీర్జాలగూడ ప్రాంతాలను మూడు సెక్టార్‌ల విభజించి శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. 2016-2019 మధ్య మహిళలు, యువతులు, బాలికలు అదృశ్యమైన కేసులు 69 నమోదు కాగా ఒక్కటి మాత్రమే అపరిష్కృతంగా ఉండిపోయింది. 68 కేసుల్లో  ఆచూకీ గుర్తించి కుటుంబాలకు అప్పగించడం ఆ ఠాణా పోలీసులకు ప్రశంసలు అందేలా చేసింది.

ఎటెళుతున్నారు.. ఏమవుతున్నారు!

వ్యక్తిగత ఇష్టాలతోనే గడప దాటుతున్నారు..

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో వ్యక్తిగత ఇష్టాలతో ఇంటి నుంచి వెళ్లిపోతున్న కేసులు అధికంగా నమోదవుతున్నాయి. యువతులు, వివాహిత మహిళలు ఎక్కువగా ఉంటున్నారు. కొందరు యువతులు లేఖలు రాసి వెళుతున్నారు. యువ వైద్యురాలు హత్య వెలుగు చూసిన తరవాత, శుక్రవారం.. ఇటీవల అదృశ్యమైన యువతి కుటుంబసభ్యులు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఠాణా పరిధిలో 2017లో 191 అదృశ్య కేసులు నమోదు కాగా 180 మంది ఇళ్లకు చేరారు.

అన్నీ కేసులనూ ఛేదిస్తాం: లక్ష్మీనారాయణ, కేపీహెచ్‌బీ సీఐ

అదృశ్యమై ఆచూకీ లభించని వారి కోసం ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నాం. గడిచిన ఐదేళ్లల్లో ఈ తరహా కేసుల్లో మంచి పురోగతి సాధించాం. మిగిలిన కేసులనూ ఛేదిస్తాం.

నమ్మి మోసపోతున్నారు..

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: యువతుల అదృశ్యం కేసుల్లో చాలా వరకు 18 ఏళ్లు నిండే వరకు వేచి చూసి నచ్చిన వారితో వెళ్లిపోతున్న ఘటనలు అధికంగా ఉంటున్నాయి. వెళ్లిపోయి పెళ్లి చేసుకొని తిరిగొచ్చేవారు కొందరైతే.. వెంట తీసుకెళ్లిన యువకుడు మోసగించాడని మరికొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మైనార్టీ తీరిన తరవాత ఇళ్ల నుంచి వెళ్లిపోయి పెళ్లిళ్లు చేసుకొని వచ్చే జంటలకు, వారి కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోతే చట్టం ప్రకారం ఆయా జంటలకు రక్షణ కల్పిస్తున్నారు. బాలికలను మభ్యపుచ్చి తీసుకెళ్లి మోసగించిన వారిపై కేసులు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నారు.

వృద్ధ, అనాథాశ్రమాల నుంచే ఎక్కువ: సతీష్‌, సీఐ, హయత్‌నగర్‌

ఠాణా పరిధిలో ఆచూకీ దొరకని వారిలో వృద్ధులు, అనాథాశ్రమాల నుంచి పరారైన వారు ఎక్కువగా ఉంటున్నారు. వృద్ధుల్లో వినికిడి లోపాలు ఉండడం, చిరునామా చెప్పలేకపోవడం వల్ల పట్టుకోవడం ఒకింత కష్టసాధ్యమవుతోంది. రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండులలో భిక్షాటన చేసే బాల, బాలికలను నగర శివారులో స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న వసతిగృహాలలో చేర్పిస్తున్నాం. వారు కొద్దిరోజులు ఉండి తరవాత పారిపోతున్నారు. అలాంటి వారి ఆచూకీ కనుక్కోవడం కష్టంగా మారుతోంది.

20 శాతం యువతులే

ఎటెళుతున్నారు.. ఏమవుతున్నారు!

మల్కాజిగిరి, న్యూస్‌టుడే: మల్కాజిగిరి ఠాణా పరిధిలో 2019లో ఇప్పటి వరకూ 134 అదృశ్యం కేసులు నమోదయ్యాయి. వీరిలో 64 మంది మహిళలు ఉండగా, 20 శాతం మంది యువతులే కావడం గమనార్హం. 95 మంది తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. వీరిలో 64 మంది మహిళలు ఉన్నారు.

ఆ 17 మంది ఏమయ్యారు?

బాలానగర్‌, న్యూస్‌టుడే: బాలానగర్‌ ఠాణా పరిధిలో 2014 నుంచి ఇప్పటివరకు 303 అదృశ్యం కేసులు నమోదయ్యాయి. 286 కేసులను ఛేదించాం. మరో 17 కేసుల్లో పురోగతి లేదు. వీరిలో ఒక బాలుడు ఉండగా.. ఏడుగురు పురుషులు, మహిళలు 9 మంది ఉన్నారు. ఠాణా పరిధిలో ఏటా 40 నుంచి 70 వరకు అదృశ్యం కేసులు నమోదవుతున్నాయి. కొన్నింటిని సత్వరమే గుర్తిస్తున్నాం. కొన్నింటికి నెలలు.. ఏళ్లు కూడా పడుతోంది.

సత్వరం స్పందిస్తున్నాం
– వహీదుద్దీన్‌, సీఐ, బాలానగర్‌అదృశ్యం కేసులను స్వయంగా పరిశీలిస్తాను. ఫిర్యాదీదారులు ఇచ్చే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అత్యవసర సందర్భాల్లో సత్వరం స్పందిస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి వెళ్లారు? దాని వెనుక కారణాలను బేరీజు వేసుకొని దర్యాప్తు చేపడతాం. కన్పించకుండా పోయే వ్యక్తుల కేసులకు సంబంధించి నిర్లక్ష్యం వహించే అవకాశం ఉండదు.
ఆమెకే.. ఎందుకీ కష్టం

ఎటెళుతున్నారు.. ఏమవుతున్నారు!

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: పశ్చిమ మండలంలో కీలకమైన జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మిస్సింగ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వీరిలో మహిళలు, యువతుల సంఖ్యే ఎక్కువగా ఉంది. జూబ్లీహిల్స్‌ పరిధిలో గత నాలుగేళ్ల కేసులను పరిశీలిస్తే అదృశ్యాలు తగ్గుతూ వస్తున్నాయి. కేసుల్లో 90 శాతానికి పైగా ఆచూకీని గుర్తిస్తున్నారు. నాలుగేళ్లలో దాదాపు 546 కేసులు నమోదవగా 20 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. ఇందులో భార్యాభర్తలు తగాదాల నేపథ్యంలో పిల్లలను ఒకరు తీసుకెళ్లిపోవడం, వివాహేతర సంబంధాల నేపథ్యంలో వెళ్లిపోవడం తదితర ఘటనలు ఇక్కడ చోటుచేసుకున్నాయి. ఎక్కువ శాతం కేసులను సాంకేతిక పరిజ్ఞానంతోనూ, స్థానికులను విచారించడం ద్వారా ఛేదిస్తున్నామని జూబ్లీహిల్స్‌ సీఐ పి.బలవంతయ్య తెలిపారు.
* బంజారాహిల్స్‌ పరిధిలో ఏటా అదృశ్యం కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన నాలుగేళ్లలో దాదాపు 735 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో అక్టోబరు నెలాఖరు వరకు 200 మంది కన్పించకుండాపోయారు. 90 శాతానికి పైగా గుర్తిస్తున్నట్లు ఠాణా గణాంకాలు చెబుతున్నాయి. సాంకేతికంగా అన్ని అవకాశాలను వినియోగించుకొని ముందడుగు వేస్తున్నారు.

రెండేళ్లలో 194 కేసులు

బాచుపల్లి(నిజాంపేట), న్యూస్‌టుడే: కొత్తగా ఆవిర్భవించిన బాచుపల్లి ఠాణాలో రెండేళ్ల వ్యవధిలోనే మొత్తం 194 మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. పిల్లల సంఖ్య తక్కువగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. 2018లో మొత్తం 96 మంది అదృశ్యమవగా.. మహిళలు 51 మంది, పురుషులు 31, బాలురు ఇద్దరు, బాలికలు 12 మంది ఉన్నారు. కేవలం 8 మంది ఆచూకీ మాత్రమే పోలీసులు ఇప్పటి వరకూ కనుక్కోలేకపోయారు. వీరిలో ఇద్దరు బాలికలు ఉండడం గమనార్హం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పురుషులు 54 మంది, మహిళలు 39, నలుగురు బాలురు, ఓ బాలిక అదృశ్యమయ్యారు. మొత్తం 98 మందిలో 81 మంది మిస్సింగ్‌ కేసులను పోలీసులు ఛేదించగలిగారు. నిజాంపేట ఇందిరమ్మకాలనీలోని బాలిక(17) ఆచూకీ నేటికీ లభించలేదు. వీరిలో ఎక్కువగా కావాలని ఇళ్ల నుంచి వెళ్లిపోయిన వారే ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.

మిస్టరీగా మారిన 38 మంది ఆచూకీ

ఎటెళుతున్నారు.. ఏమవుతున్నారు!

దుండిగల్‌, న్యూస్‌టుడే: కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని దుండిగల్‌ ఠాణా పరిధిలో నాలుగేళ్లలో మొత్తం 576 మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. 78 మంది ఆచూకీ లభించలేదు. వీరిలో ముగ్గురు బాలికలతో సహా 32 మహిళలున్నారు. కేసుల దర్యాప్తు విషయంలో గత సంవత్సరం నుంచి పోలీసుల తీరులో కొంత మార్పు వచ్చింది. 2018 నుంచి బాలికలు అదృశ్యమైన సంఘటనల్లో తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కిడ్నాప్‌ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ రెండేళ్లలో 19 అపహరణ కేసులు నమోదు చేశారు. ఇందులో ముగ్గురు బాలికల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు.

గతంలో ఏడాది దాటితే కేసు మూసేసేవాళ్లం: శేఖర్‌రెడ్డి, దుండిగల్‌ ఎస్సై

గతంలో కేసు నమోదు చేసిన నాటి నుంచి సంవత్సరం వరకు వ్యక్తి ఆచూకీ లభించకుంటే ఉన్నతాధికారుల అనుమతితో కేసు మూసివేసే వాళ్లం. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా 2018 నుంచి బాలికలు, బాలుర మిస్సింగ్‌లకు సంబంధించి ఫిర్యాదు అందితే కిడ్నాప్‌ కేసు నమోదు చేస్తున్నాం. ఈ సంవత్సరం 14 మంది మహిళలు అదృశ్యమయ్యారు. ముగ్గురిని గుర్తించాం. మిగతావారి ఆచూకీకి అన్వేషిస్తున్నాం.

భర్త ఆచూకీ తెలపరూ: భార్య

ఎటెళుతున్నారు.. ఏమవుతున్నారు!

కేశవగిరి, న్యూస్‌టుడే: వరంగల్‌ జిల్లా మేడారం జాతర బందోబస్తుకని 2016 ఫిబ్రవరి 13వ తేదీన వెళ్లిన హోంగార్డు మహ్మద్‌ ఇబ్రహీం(45) ఆచూకీ నేటికీ తెలియలేదు. మూడేళ్లుగా జాడ లేకపోవడంతో అతని కుటుంబం కుంగిపోయింది. అదే ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన భార్య సలీమా బేగం ఫిర్యాదుతో చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషనులో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 20న రాత్రి 10 గంటలకు తన భర్త ఫోన్‌ చేసి విధులు ముగిశాయని, 21న ఇంటికి వస్తానని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తరువాత ఫోన్‌ చేస్తే చరవాణి ఆపేసి ఉందని తెలిపారు. ఎలాగైనా తన భర్తను వెతికిపెట్టాలని వేడుకున్నారు. చాంద్రాయణగుట్ట పోలీసులు వరంగల్‌ వెళ్లి అక్కడి పోలీసులతో కలిసి దర్యాప్తు చేపట్టారు. అన్ని చోట్లా వెతికినా నేటికీ ఆచూకీ లభించలేదు.

Courtesy Eenadu …

RELATED ARTICLES

Latest Updates