డిసెంబరు 3 వరకు గడువు
70,000-80,000 మంది ఎంచుకోవచ్చని అంచనా
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్).. తన ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్ఎస్) ప్రకటించింది. ఈ నెల 4న ప్రారంభమైన వీఆర్ఎస్ పథకం.. డిసెంబరు 3 వరకు అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ తెలిపారు. గడువు చివరి తేదీలోగా ఈ పథకాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. వీఆర్ఎస్ పథకంపై ఇప్పటికే క్షేత్రస్థాయి యూనిట్లన్నింటికీ సమాచారం పంపడం జరిగిందని పుర్వార్ వెల్లడించారు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్లో 1.5 లక్షల మందికి పైగా ఉద్యోగులున్నారు. అందులో ఈ పథకానికి దాదాపు లక్ష మంది అర్హులని సంస్థ అంటోంది. 70,000-80,000 మంది ఈ పథకాన్ని ఎంచుకోవచ్చని భావిస్తోంది.
త్వరలో బీఎస్ఎన్ఎల్లో విలీనం కాబోతున్న మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) కూడా తన ఉద్యోగుల కోసం వీఆర్ఎస్ను ప్రకటించింది. ఈ స్కీమ్ను ఎంచుకునేందుకు డిసెంబరు 3 వరకు గడువు ఇచ్చింది. 2020 జనవరి 31 నాటికి 50 ఏళ్లు, ఆపైబడిన రెగ్యులర్, పర్మినెంట్ ఉద్యోగులంతా ఈ పథకాన్ని ఎంచుకునేందుకు అర్హులని ఎంటీఎన్ఎల్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎంటీఎన్ఎల్లో 22,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దాదాపు 15,000 మందికి ఈ పథకాన్ని ఎం చుకునే అర్హత లభించవచ్చని ఎంటీఎన్ఎల్ చైర్మన్, ఎండీ సునీల్ కుమార్ తెలిపారు. వీఆ ర్ఎస్ ఎంచుకున్న వారికి దాదాపు 46 నెలల జీతాన్ని పరిహారంగా చెల్లించే అవకాశం ఉంది.
రూ.69,000 కోట్ల ప్యాకేజీ
నష్టాల్లో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునరుద్ధరణ కోసం రూ.69,000 కోట్ల ప్యాకేజీ ఇచ్చేందుకు గత నెలలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా బీఎస్ఎన్ఎల్తో ఎంటీఎన్ఎల్ను విలీనం చేయడంతో పాటు కంపెనీ భూములను విక్రయించనున్నారు. ఇరు కంపెనీల వీఆర్ఎస్లు సైతం ప్రణాళికలో భాగంగా ఉన్నాయి.
ఎక్స్గ్రేషియా ఎంత?
గడిచిన పదవీకాలానికి ప్రతి సంవత్సరంలో ఆర్జించిన 35 రోజుల వేతన మొత్తం + మిగిలిన పదవీకాలానికి ప్రతి సంవత్సరంలో ఆర్జించబోయే 25 రోజుల జీతం మొత్తం
ఎవరు అర్హులు?
50 ఏళ్లు, అంతకు పైబడిన వారంతా అర్హులే
రెగ్యులర్, పర్మినెంట్ ఉద్యోగులు. ఇతర సంస్థల్లో డిప్యూటేషన్పై పనిచేస్తున్న వారు సైతం
రూ.7,000 కోట్లు
వీఆర్ఎస్ ద్వారా ఉద్యోగుల సంఖ్య అంచనాల మేరకు తగ్గితే కంపెనీపై తగ్గనున్న వేతన వ్యయ భారం
రూ. 37,500 కోట్లు వచ్చే 3 ఏళ్లలో రెండు కంపెనీలు విక్రయించనున్న స్థిరాస్తులు
గడిచిన 10 ఏళ్లలో.. 9 సంవత్సరాలు ఎంటీఎన్ఎల్కు నష్టాలే
2010 నుంచి.. బీఎస్ఎన్ఎల్దీ నష్టాల బాటే
రూ. 40,000 కోట్లు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్పై మొత్తం రుణ భారం.
Courtesy Andhrajyothi.