గడువు దాటితే చేర్చుకోం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఆ తరువాత మొత్తం ఆర్టీసీని ప్రైవేటీకరిస్తాం

  • మిగతా 5వేల బస్సులకూ పర్మిట్లు ఇచ్చేస్తాం
  • దీనిపై, సమ్మెపై కోర్టు తేల్చేదేమీ ఉండదు
  • తీర్పు మరోలా ఉంటే ‘సుప్రీం’కు వెళతాం
  • అక్కడ జరిగేది ‘అంతం లేని పోరాటమే’
  • దానితో కార్మికులకు ఒరిగేదేమీ ఉండదు
  • సీఎం కేసీఆర్‌ సమీక్షలో ఏకాభిప్రాయం

గడువులోగా విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులను ఆ తరువాత ఎట్టిపరిస్థితుల్లోనూ చేర్చుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. కార్మికులు గడువు (మంగళవారం అర్ధరాత్రి)లోగా విధుల్లో చేరకపోతే మిగిలిన 5వేల బస్సులకు కూడా ప్రైవేటు పర్మిట్లు ఇస్తామని, మొత్తం ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని పేర్కొంది. ప్రస్తుతం కేసును విచారిస్తున్న హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించజాలదని తెలిపింది. ఒకవేళ తీర్పు మరోలా ఉంటే.. ఆర్టీసీగానీ, తాముగానీ సుప్రీంకోర్టుకు వెళతామని హెచ్చరించింది. అదే జరిగితే సాగేది అంతంలేని పోరాటమేనని, అప్పుడు కార్మికులకు ఒరిగేదేమీ ఉండదని పేర్కొంది. విధుల్లో చేరడానికి గడువు ఇవ్వడం ద్వారా మంచి అవకాశం ఇచ్చినట్లయిందని, దానిని ఉపయోగించుకుని ఉద్యోగాలు కాపాడుకోవడమా? వినియోగించుకోకుండా ఉద్యోగాలు కోల్పోయి, కుటుంబాలను ఇబ్బందులపాలు చేయడమా? అనేది కార్మికులే తేల్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన రూట్లలోనూ ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇచ్చాక.. తెలంగాణలో ఇక ఆర్టీసీ ఉండదని స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మె, హైకోర్టులో విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం రాత్రి ప్రగతి భవన్‌లో రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమ్మె విషయంలో, కోర్టు విచారణ సందర్భంగా అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. కార్మిక చట్టాలను, కేంద్ర రవాణా చట్టాన్ని పరిశీలించారు.

ఇదీ ఏకాభిప్రాయం…విధుల్లో చేరాలని గడువు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం కార్మికులకు మంచి అవకాశం కల్పించింది. ఉద్యోగాలను కాపాడుకోవడం పూర్తిగా కార్మికుల చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమైనదని కార్మిక శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించింది. విధుల్లో చేరడానికి మూడు రోజుల గడువు ఇచ్చింది. ఆ అవకాశం వినియోగించుకోకుంటే అర్థం లేదు. కార్మికులు ఎవరినీ బద్నాం చేయలేరు. ఇచ్చిన గడువు ప్రకారం కార్మికులు చేరకపోతే అది వారి ఇష్టం. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏ ఒక్క కార్మికుడినీ విధుల్లో చేర్చుకునే ప్రసక్తే లేదు. ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. దీనిని అమలు చేసే విషయంలో కఠినంగానే ఉంటుంది. గడువులోగా కార్మికులు విధుల్లో చేరకుంటే మిగిలిన 5000 రూట్లలోనూ ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇస్తుంది. ఆ తెల్లారో, మరునాడో ఈ ప్రక్రియను ప్రారంభిస్తుంది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ రహిత రాష్ట్రం అవుతుంది. ఈ పరిస్థితికి ముమ్మాటికీ కార్మికులే కారణమవుతారు’’ అని సమావేశం అభిప్రాయపడింది.

సుప్రీంకోర్టుకు వెళ్లడమే…హైకోర్టులో జరుగుతున్న విచారణను చూపి.. యూనియన్‌ నాయకులు కార్మికులను మభ్య పెడుతున్నారు. కానీ, న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమ్మె విషయంలో ప్రభుత్వానికి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదు. కోర్టు తేల్చగలిగింది కూడా ఏమీ లేదు. హైకోర్టు తీర్పు మరోలా ఉంటే, ఇంతదూరం వచ్చిన తర్వాత ఆర్టీసీగానీ, ప్రభుత్వం గానీ సుప్రీం కోర్టుకు వెళుతుంది. ఒకవేళ కేసు సుప్రీంకోర్టుకు వెళితే, అక్కడ విచారణ మరింత ఆలస్యమవుతుంది. గతానుభవాలను బట్టి చూస్తే సుప్రీంకోర్టులో ఒక్కోసారి ఏళ్ల తరబడి కేసుల విచారణ సాగుతుంది. అది అంతం లేని పోరాటమవుతుంది. కాబట్టి కార్మికులకు ఒరిగేదేమీ ఉండదు అని అభిప్రాయం వ్యక్తమైంది.

Courtesy Andhrajyothi..

 

RELATED ARTICLES

Latest Updates