ఆస్తి కోసం ఆరు హత్యలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • భర్త, అత్తమామలు సహా ఆరుగురిని సైనేడ్‌ పెట్టి చంపేసిన నరహంతకి
  • 2002 నుంచి 2016 దాకా మర్డర్లు
  • కేరళలో సంచలనం సృష్టించిన కేసు

కొచ్చిన్‌: ఆస్తికోసం క్రూరమైన ప్లాన్లు వేసి అయినవాళ్లను చంపించే అత్తగార్లు, కోడళ్లు టీవీ సీరియళ్లలోనే ఉంటారనుకుంటే పొరపాటే! అంతకుమించిన విలనిజం ఆమెది!! ఆస్తి కోసం అత్తమామల్ని, చెడు స్నేహాలు మానాలని మందలించినందుకు భర్త ను.. వారిని తానే చంపినట్లు అనుమానించినందుకు అత్తగారి సోదరుణ్ని చంపేసింది. భర్త సోదరుడిపై వ్యామోహం పెంచుకుని అతడి భార్యను, ఆ దంపతుల రెండేళ్ల కూతుర్ని పొట్టనబెట్టుకుంది! ఆ తర్వాత ఏడాదికే భర్త సోదరుణ్ని వివాహం చేసుకుని అనుకున్నది సాధించింది!! సైనేడ్‌తో ప్రాణాలు తీయడం.. ఆపై ఏమీ ఎరగనట్టు శోకాలుపెడుతూ అందరి సానుభూతి పొందడం.. ఇదీ ఆమె స్టయిల్‌. 2002 నుంచి 2016 దాకా.. 14 ఏళ్లలో ఒకరి తర్వాత మరొకరుగా ఆరుగురి ప్రాణాలు తీసిన ఆ నరహంతకి చివరికి పోలీసుల చేతికి చిక్కింది. కేరళలో సంచలనం సృష్టించిన కేసులో ఆరుగురిని చంపిన మహిళ పేరు జాలీ జోసెఫ్‌(47). ఆస్తి కోసం ఆమె హత్యాకాండ 2002లో తన అత్తగారిని చంపడంతో మొదలైంది.

2002, ఆగస్టు 22: ఇంటి పెత్తనం కోసం అత్తగారు అన్నమ్మకు మటన్‌ సూప్‌లో సైనేడ్‌ కలిపి ఇచ్చింది. ఆ సూప్‌ తాగిన అన్నమ్మ కుప్పకూలిపోయింది.

2008, ఆగస్టు 26: జాలీ మామగారైన టామ్‌థామస్‌ రెండున్నర ఎకరాల పొలాన్ని అమ్మి ఆ డబ్బు ను ఆమె చేతికిచ్చాడు. ఇకపై ఆస్తిలో వాటా రాదనడంతో అన్నంలో సైనేడ్‌ కలిపి మామగారికి పెట్టింది. ఆయనా నురగలు కక్కుకుని చనిపోయాడు. నకిలీ వీలునామాతో ఆస్తిని కాజేసింది.

2011, సెప్టెంబరు 30: చెడు స్నేహాలు మానుకోవాలన్నందుకు భర్త రాయ్‌థామస్‌ చావుకు ముహూర్తం పెట్టింది. అన్నం, శనగల కూరలో సైనేడ్‌ పెట్టి అతణ్నీ చంపేసింది. అయితే, పోస్టుమార్టంలో రాయ్‌థామస్‌ శరీరంలో సైనేడ్‌ ఆనవాళ్లు దొరికాయి.

2014, ఫిబ్రవరి 24: జాలీభర్త రాయ్‌థామస్‌కు పోస్ట్‌మార్టం చేయాలని పట్టుబట్టిన అతడి మేనమామ మాథ్యూ పైనా పగబట్టింది. మూడేళ్లు ఓపిక పట్టి.. చివరికి 2014 ఫిబ్రవరి 24న అతడి ఇంటికి వెళ్లి మరీ కాఫీలో సైనేడ్‌ కలిపి ఇచ్చి చంపేసింది.

2016, జనవరి 11: రాయ్‌ థామస్‌ బాబాయి కొడుకైన షాజుపై జాలీ వ్యామోహం పెంచుకుంది. అతని భార్య సిలీ చాలా అదృష్టవంతురాలని ఎప్పుడూ అంటుండేది. అతణ్ని పెళ్లి చేసుకోవాలనే దుర్బుద్ధితో తొలుత షాజు, సిలీ దంపతుల కుమార్తె అయిన రెండేళ్ల అల్ఫైన్‌కు బ్రెడ్‌లో సైనేడ్‌ కలిపి తినిపించి చంపేసింది. తర్వాత కొద్దిరోజులకే సిలీని కూడా ఒక దంతవైద్యశాలలో చికిత్సకు వెళ్లినప్పుడు సైనేడ్‌ పెట్టి చంపేసింది. ఆ తర్వాత ఏడాది తిరగకముందే షాజును మనువాడింది.

కానీ..అమెరికాలోఉంటున్న రాయ్‌ సొంత సోదరుడు రోజో ఈ మరణాలపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తీగలాగితే డొంకంతా కదిలింది. ఆ ఆరుగురినీ సైనేడ్‌ పెట్టి తానే చంపేశానని జాలీ ఒప్పుకొంది. పోలీసులు శనివారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలు చేయడానికి బంగారం దుకాణం యజమాని ప్రాజు కుమార్‌, జాలీ దగ్గరి బంధువు ఎం.ఎస్‌. మాథ్యూ సహకరించారు. ఆభరణాల తయారీలో వాడేందుకు తెచ్చిన సైనేడ్‌ను జాలీకి మాథ్యూ ఇచ్చేవాడు.

తప్పించుకున్న మరదలు?
జాలీ తన భర్త సోదరి అయిన రెజీని కూడా చంపేందుకు కుట్ర పన్నింది. ఆయుర్వేద టానిక్‌ తాగినప్పుడు రేజీ తీవ్ర అనారోగ్యానికి గురైంది. అయితే నీళ్లు ఎక్కువగా తాగడంతో పరిస్థితి మెరుగైందని రేజీ చెప్పారు.

Courtesy Andhra Jyothy

RELATED ARTICLES

Latest Updates