అటు హామీల ఉల్లంఘన.. ఇటు విద్వేష తపన !

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
– ఎన్‌. వేణుగోపాల్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పాలకవర్గ ఎన్నికల రణరంగం సాగుతున్నది. గత ఎన్నికల్లో 99వార్డులు సాధించి అధికారానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా, ఈసారి 149వార్డులకు పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తుందా అని ఊహాగానాలు సాగుతున్నాయి. ఎవరు గెల్చినా, ఎవరు ఓడినా ప్రజాజీవనం వైపు నుంచి చూసినప్పుడు మాత్రం గణనీయమైన మెరుగుదల ఉంటుందనే ఆశ లేదు. దొందూ దొందే, పళ్లూడగొట్టు కోవడానికి ఏ రాయైతే ఏమిటి అనే సాంప్రదాయిక వివేకపు సామెతలు నిజమయ్యే పరిస్థితే కనబడుతున్నది. ఆ జనసామాన్యపు వివేకమే ‘రాజు తలచు కుంటే దెబ్బలకు కొదవా’ అన్నది గాని రాజు తలచు కుంటే కానుకలకు కొదవా అనలేదు. అంటే ఇస్తామని వాగ్దానం చేస్తున్న కానుకలు అబద్ధమూ, దెబ్బలే నిజమూ అన్నమాట.

ఎన్నికల గెలుపు ఓటముల రాజకీయాలు అలా ఉంచి, ఈ ఎన్నికలలో ఇమిడి ఉన్న, ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తేలబోయే రాజకీయార్థిక అంశాలు చర్చించుకోవడం అవసరం. హైదరాబాద్‌ ఆర్థిక వ్యవస్థ (కొనుగోలు శక్తిని బట్టి అంచనా వేసిన నగర స్థూల ఉత్పత్తి) 40బిలియన్‌ డాలర్ల (మూడు లక్షల కోట్ల రూపాయలు) నుంచి 74బిలియన్‌ డాలర్ల (ఐదున్నర లక్షల కోట్ల రూపాయలు) వరకు ఉండవచ్చునని, ఆ రకంగా దేశంలోని అతి ఎక్కువ ఉత్పాదకత ఉన్న నగరాల్లో ఐదో స్థానంలో, లేదా ఆరో స్థానంలో ఉన్నదని ఒక అంచనా. ఈ అంచనా 2015 నాటిదైనప్పటికీ, లభిస్తున్న తాజా గణాంకం అదే. అలాగే తలసరి ఆదాయం గురించి లభిస్తున్న తాజా గణాంకాల ప్రకారం హైదరాబాద్‌ తలసరి ఆదాయం 2017 నాటికి రూ.2,99,000గా ఉంది. అయితే ఇవి సగటు అంకెలు గనుక ఇవి చెప్పే నిజాల కన్నా చెప్పని అబద్ధాలు ఎక్కువ. సగటు వార్షికాదాయం మూడు లక్షల రూపాయలు అని ఈ అంకెలు చెపుతున్నప్పటికీ, సగటు వార్షికాదాయం వందల కోట్ల రూపాయలు ఉన్న కొన్ని వందల మంది, ఆ సగటులో ఆరో వంతు కూడ లేని ప్రజలు కొన్ని లక్షల మంది ఉన్న నగరం ఇది. కనుక మొత్తంగా మాట్లాడే ఈ భారీ అంకెల నుంచి కాస్త పక్కకు జరిగి, అట్టడుగు ప్రజల వైపు నుంచి, పౌర సౌకర్యాల వైపు నుంచి ఆలోచించవలసి ఉంది.

నగరమంటే అంకెలు కాదు, నగరమంటే ప్రజలు. ఆ ప్రజలకు నగరంలో జీవించడానికి, ఉత్పత్తి చేయడానికి, ఉత్పత్తిని పంపిణీ చేయడానికి, వినిమయం చేయడానికి, వినియోగించడానికి అనివార్యంగా కొన్ని సాధనాలు కావాలి. ఆ ఉత్పత్తి, పంపిణీ, వినిమయం, వినియోగం కార్యక్రమాలలో పాల్గొంటున్న ప్రజలకు కొన్ని కనీస సౌకర్యాలు కావాలి. ఏ నగరంలోనైనా ఆ సౌకర్యాలు కల్పించడం, నిర్వహించడం, ప్రజలకు అందుబాటులో ఉంచడం నగరపాలక సంస్థ బాధ్యత. సాధారణంగానైతే ఆ సౌకర్యాల కల్పన, నిర్వహణ బాధ్యత అధికార యంత్రాంగమే చూసుకుంటుంది గాని, ఆ అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసే, నాయకత్వం వహించే బాధ్యతను ప్రజా ప్రతినిధులతో ఏర్పడిన ప్రజాస్వామిక వ్యవస్థ చూసుకుంటుంది. అటువంటి ప్రజాస్వామిక, ప్రజా ప్రాతినిధ్య వ్యవస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌. అది తనను తాను నిర్వహించు కోవడానికి, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించి, నిర్వహించడానికి ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల ఆదాయం మీదనే ప్రధానంగా ఆధారపడుతుంది. అందువల్లనే ఏ రాయైతేనేమి పళ్లూడగొట్టడానికి అనేది స్వల్పంగా మారి, గద్దె మీద ఉన్నది ఏ పార్టీ అయితేనేమి, పన్ను వసూలు చేయడానికి అని మార్చుకోవలసి వస్తుంది.

జీహెచ్‌ఎంసీ వెబ్‌ సైట్‌ మీద అందుబాటులో ఉన్న తాజా బడ్జెట్‌ ప్రకారం వారు 2017-18 సంవత్సరానికి గాను ప్రజల నుంచి రూ.1392.66 కోట్లు పన్ను వసూలు చేశారు. మునిసిపల్‌ ఆస్తుల మీద అద్దెల ద్వారా రూ.8.84 కోట్లు సంపాదించారు. ఫీజులు, యూజర్‌ చార్జీల రూపంలో రూ.860.53 కోట్లు సంపాదించారు. మొత్తంగా ఆ సంవత్సరానికి రూ.2570.38 కోట్ల ఆదాయం సంపాదించారు. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో ఈ అంకెలు రూ.1472.02 కోట్లు పన్నులుగా, రూ.8.45 కోట్ల అద్దెలుగా, రూ.1009.29 కోట్ల యూజర్‌ చార్జీలుగా, రూ.2879.94 కోట్ల మొత్తం ఆదాయంగా మారాయి. ఆ తర్వాతి ఆర్థిక సంవ త్సరం కూడ గడిచిపోయింది గాని ఎందువల్లనో జీహెచ్‌ఎంసీ ఆ కొత్త గణాంకాలను వెబ్‌ సైట్‌ మీద ఇంకా పెట్టలేదు.

ఇక్కడ అందుబాటులో ఉన్న రెండు సంవత్సరాల గణాంకాలను కాస్త జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంది. ఒక్క సంవత్సరంలో జీహెచ్‌ఎంసీకి రూ.309.56 కోట్ల ఆదాయం పెరిగింది. కాగా, పన్ను ఆదాయంలో రూ.79.36 కోట్లు, యూజర్‌ చార్జీల ఆదాయంలో రూ.148.76 కోట్లు పెరుగుదల ఉండగా, అద్దెల మీద ఆదాయం రూ.39 లక్షలు తగ్గింది. అంటే ఆ రెండు సంవత్సరాల మధ్యనే ప్రజల మీద పన్నుల భారం కన్న యూజర్‌ చార్జీల భారం పెరిగిందని అర్థం. అంతకన్న విచిత్రంగా, ఎక్కడైనా అద్దెల ఆదాయం పెరుగుతుండగా, మునిసిపల్‌ ఆస్తుల మీద అద్దెల ఆదాయంలో తరుగుదల ఎలా జరిగిందో తెలియదు.

జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ పత్రాలను నిశితంగా పరిశీలిస్తే మరెన్నో ఆశ్చర్యాలు కనబడతాయి. పన్ను ఆదాయంలో ఆస్తి పన్ను, నీటి పన్ను, పారిశుధ్య పన్ను, సంరక్షణ పన్ను, వీధి దీపాల పన్ను, విద్యా పన్ను, వాహన పన్ను, జంతువులపై పన్ను, ప్రకటనలపై పన్ను, యాత్రలపై పన్ను, దారి సుంకాలు, సెస్‌ వంటి అనేక పద్దులుండగా, ఈ బడ్జెట్‌ పత్రాలు కేవలం ఆస్తిపన్ను, పారిశుధ్య పన్ను, సంరక్షణ పన్ను, వీధి దీపాల పన్ను అనే నాలుగు పద్దులలోనే ఆదాయం చూపుతూ మిగిలిన పద్దులన్నీ సున్నాగా చూపుతున్నారు. ఇక ఫీజులు, యూజర్‌ చార్జీలు అనే విభాగంలో ఎంపానెల్‌ మెంట్‌ రిజిస్ట్రేషన్‌ చార్జీలు, లైసెన్సింగ్‌ ఫీజు, పర్మిట్లు ఇచ్చినందుకు ఫీజు, సర్టిఫికెట్లు ఇచ్చినందుకు పన్ను, డెవలప్‌మెంట్‌ చార్జీలు, రెగ్యులరైజేషన్‌ ఫీజు, యూజర్‌ చార్జీలు, సర్వీస్‌ చార్జీలు వంటి పన్నెండు రకాల పద్దులుండగా, ఒక్క రెగ్యులరైజేషన్‌ ఫీజు మినహా అన్ని పద్దుల కింద ఆదాయాలున్నాయి. యూజర్‌ చార్జీలైతే ఒక్క సంవత్సరంలో నాలుగు రెట్లు పెరిగాయి. పర్మిట్లు ఇచ్చినందుకు ఫీజు రెండు రెట్లు పెరిగాయి.

ఈ పన్నులు, యూజర్‌ చార్జీలు ఏ వర్గాల ప్రజలనుంచి వసూలు చేస్తున్నారో విభజించి చూస్తే ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు బైటపడవచ్చు. కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న, జీహెచ్‌ఎంసీ వనరులను విరివిగా వాడుకుంటున్న సంపన్నవర్గాలు అతి తక్కువ పన్నులతో బైటపడుతున్నట్టు, కొన్ని వందల్లో, వేలల్లో మాత్రం సంపాదిస్తున్న పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు వేరువేరు రూపాలలో కోట్లాది రూపాయల పన్నులు, యూజర్‌ చార్జీలు చెల్లిస్తున్నట్టు నిరూపించవచ్చు. నగరం నిజానికి పేద, మధ్య తరగతి ప్రజల మూపుల మీద స్వారీ చేస్తున్న సంపన్నులకే సకల వసతులూ సమకూరుస్తున్నదని రుజువు చేయవచ్చు. అంత వివరమైన గణాంకాలు ప్రస్తుతానికైతే అందుబాటులో లేవు.

దొరుకుతున్న గణాంకాలను బట్టి అర్థమయ్యే ప్రధాన అంశమేమంటే నగర పాలక సంస్థ నగర ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంలో, ఏడాదికేడాదికీ వాటిని పెంచుతూ పోవడంలో చాల సమర్థంగా పనిచేస్తున్నదని. ఆ సమర్థతను ప్రశంసించాలంటే, అంతే స్థాయిలో ప్రజావసరాలను తీర్చే పౌరసౌకర్యాలను కల్పించడంలో, అభివృద్ధి సాధించడంలో కూడా శ్రద్ధాసక్తులు చూపెట్టవలసి ఉంటుంది. అది ప్రజా ప్రతినిధుల బాధ్యత. ప్రజల నుంచి నానాటికీ హెచ్చు పన్నులు వసూలు చేయాలనే నిర్ణయాలకు తాము బాధ్యత వహిస్తున్నప్పుడు, ఆ ప్రజలకు ఆ మేరకు సౌకర్యాలు కల్పించాలని ఆలోచించడం ప్రజా ప్రతినిధులుగా వారి బాధ్యత. పౌరజీవనం మెరుగు పడేందుకు, జీవన ప్రమాణాలలో అభివృద్ధి సాధించేందుకు అవసరమైన సౌకర్యాలను కల్పించడం వారి బాధ్యత.

రహదారులు, రవాణా సౌకర్యాలు, తాగునీటి సౌకర్యాలు, పారిశుధ్య వసతులు, ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన పరిసరాలు, ఉద్యానవనాలు, క్రీడాసౌకర్యాలు, విద్య, వైద్య ఆరోగ్య సౌకర్యాలు, ఉద్యోగకల్పన, నగరంలో నానాటికీ పెరిగిపోతున్న జనాభా అవసరాలకు తగినట్టుగా వసతులు పెంచడం వంటి ఎన్నెన్నో బాధ్యతలను జీహెచ్‌ఎంసీ చేపట్టవలసి ఉంటుంది. కాని గత నాలుగు సంవత్సరాలలో వీటిలో ఏ ఒక్క రంగం తీసుకున్నా సౌకర్యాల క్షీణత, విధ్వంసమే కనబడుతుంది. ప్రధాన రహదారుల్లో ఒక వరుస మీద మరొక వరుస తారో, సిమెంటో, వైట్‌ టాపో చేశారేమో గాని, ఎక్కడ ప్రధాన రహదారి దిగి పక్క రోడ్డులోకి, వీథిలోకి మళ్లినా ఎగుడుదిగుళ్ల, గుంతల రోడ్లు తప్ప మరొకటి లేదు. చివరికి ప్రధాన రహదారుల మరమ్మతులు కూడ మొన్నటి వరదల తర్వాత కాంట్రాక్టర్ల అవినీతికి నిదర్శనాలను ప్రదర్శిస్తున్నాయి.

రవాణా రంగంలో ప్రభుత్వం, ఆర్టీసీ క్రమక్రమంగా తమ సేవలను తగ్గిస్తూ, ప్రయివేటు, సొంత రవాణాలను ప్రోత్సహిస్తున్నాయి. మెట్రో గురించి చెప్పిన గొప్పలన్నీ వాస్తవంలో వెలాతెలా పోతున్నాయి. తాగునీటి సౌకర్యాల గురించి చేసిన వాగ్దానాలేవీ అమల్లోకి రాలేదు. పారిశుధ్యవసతుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్న పరిస్థితి ఉంది. మొన్నటి వరదల్లో నగరంలోని ఎక్కడెక్కడి మురికి ఎట్లా కొట్టుకు వచ్చిందో ప్రచార సాధనాల్లో విస్తృతంగా కనబడింది. ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన పరిసరాలు, ఉద్యానవనాలు, క్రీడా సౌకర్యాలు కల్పించడం తమ విధి అనే మౌలిక బాధ్యత జీహెచ్‌ఎంసీకి గుర్తున్నదా అని ప్రశ్నించవలసిన స్థితి ఉంది. విద్యా, వైద్య, ఆరోగ్య సౌకర్యాల గురించి పాలకులు చేసిన వాగ్దానాలకూ జరిగిన అభివృద్ధికీ హస్తిమశకాంతరం ఉంది. నగరంలో ఉద్యోగం కోసం, ఉపాధి కోసం ప్రతి రోజూ కొన్ని వేల మంది ప్రవేశిస్తుండగా, ఉద్యోగ కల్పనా సామర్థ్యం నెలకు వంద మందికి కూడ ఉపాధి కల్పించడం లేదు.

పురపాలక సంస్థ ఒకవైపు పన్ను విధింపులో, పన్ను వసూళ్లలో ఎక్కడలేని సామర్థ్యాన్ని, ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ, మరొకవైపు ప్రజావసరాలను తీర్చడంలో అంతులేని నిర్లక్ష్యాన్ని చూపుతున్నప్పుడు, ఆ పురపాలక సంస్థ పగ్గాలు ఎవరి చేతుల్లో ఉంటేనేమి? ఒకరు నాలుగు సంవత్సరాలుగా ఆ పగ్గాలు చేత పట్టుకుని ఏమీ సాధించని వారు, మరొకరు ఈ గంగా తెహ్జీబ్‌ సహజీవన సంస్కృతి నగరాన్ని విషవిద్వేష రాజకీయాలతో నింపబూనుకున్నవారు. ఇద్దరికీ పౌరసౌకర్యాల గురించి, నగర జనజీవనం గురించి శ్రద్ధాసక్తులు లేవు. ఇద్దరికీ తమ రాజకీయాలు, వ్యక్తిగత ఎజెండాలు, స్వార్థాలు తప్ప ప్రజల గురించి ఆలోచన లేదు. దొందూ దొందే. ఏ రాయైతేనేమి పళ్లూడగొట్టుకునేందుకు, పన్నుల బారిన పడేందుకు. అయితే మతోన్నాదులు మహాప్రమాదం. ఏం జరుగుతుందో వేచిచూడాలి.

Courtesy Nava Telangana

RELATED ARTICLES

Latest Updates