ఎన్నికలకు ముందే సగం గెలుపు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • ఎక్స్‌ అఫీషియో ఓట్లే అధికార పార్టీ బలం
  • మజ్లిస్‌, టీఆర్‌ఎస్‌ కలిసి 31 డివిజన్లు 
  • గెలిస్తే మేయర్‌ పదవి దక్కినట్లే
  • గులాబీ ఖాతాలోని  35 ఎక్స్‌ అఫీషియో ఓట్లు
  • మజ్లిస్‌ ఓట్లనూ కలుపుకొంటే 45 ఓట్లు
  • గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ఆప్షన్‌తో 3 ఓట్లు
  • టీఆర్‌ఎస్‌కు ఎక్స్‌ అఫీషియో ఓట్ల బలం
  • గులాబీ ఖాతాలో 35 ఎక్స్‌ అఫీషియో ఓట్లు
  • 41 డివిజన్లు గెలిస్తే.. మేయర్‌ పదవి దక్కినట్లే

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి మళ్లీ టీఆర్‌ఎస్‌ వశం కానుందా? తక్కువ సంఖ్యలో కార్పొరేటర్లను గెలుచుకున్నా.. పీఠాన్ని దక్కించుకుంటుందా? అంటే.. పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ కేవలం 41 డివిజన్లలో గెలిచినా.. పరోక్ష పద్ధతిలో ఎన్నుకునే మేయర్‌ పదవిని కైవసం చేసుకుంటుందని అంటున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆ పార్టీకి ఉన్న ఎక్స్‌అఫీషియో ఓట్లే మేయర్‌ పీఠం దక్కేలా చేస్తాయని పేర్కొంటున్నారు. అన్నీ సర్దుకుని ఎంఐఎం ఓట్లు కూడా కలిసి వస్తే.. అధికార పార్టీకి ఎదురే ఉండదని అంటున్నారు. అందుకే ఈసారి కూడా బల్దియాపై గులాబీ జెండాను ఎగురవేస్తామంటూ టీఆర్‌ఎస్‌ నేతలు మొదటి నుంచీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎక్స్‌అఫీషియో సభ్యుల ప్రమేయం లేకుండానే సంపూర్ణ మెజారిటీ సాధిస్తామని అంటున్నారు.

2016లో ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున 99 మంది కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. ఇతర పార్టీల నుంచి మరో ముగ్గురు కారెక్కారు. దీంతో టీఆర్‌ఎస్‌ బలం 102 అయింది. ఈసారి కూడా 100కు పైగా డివిజన్లలో గెలుస్తామని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. అయితే అంచనా మేరకు సీట్లు గెలవకపోయినా, ఊహించని పరిణామాలు ఎదురైనా.. ఎక్స్‌అఫీషియో ఓట్లతోనైనా మేయర్‌ పదవిని వశం చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలోని టీఆర్‌ఎ్‌సకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, శాసనసభ, శాసన మండలి సభ్యులు జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకోవడం ఆ పార్టీకి కలిసి వస్తోంది. వీరి సంఖ్య ఏకంగా 35 వరకు ఉంది. రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ ఓటుపై మాత్రమే కొన్ని అనుమానాలున్నాయి. ఆయన గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

మేజిక్‌ ఫిగర్‌ 76కు కావాల్సింది 41 ఓట్లే…
జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉండగా.. మేయర్‌ పదవికి మేజిక్‌ ఫిగర్‌ 76 సీట్లు. అయితే మేయర్‌ ఎన్నికలో ఎక్స్‌అఫీషియో సభ్యులు కూడా ఓటు వేస్తారు. ఇప్పటికే టీఆర్‌ఎ్‌సకు 35 ఎక్స్‌అఫీషియో ఓట్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 41 మంది కార్పొరేటర్లు గెలిస్తే మేజిక్‌ ఫిగర్‌ 76కు చేరుకుంటుంది. అంటే టీఆర్‌ఎస్‌ నుంచి కేవలం 41 మంది కార్పొరేటర్లు గెలిచినా మేయర్‌ పదవి దక్కుతుంది. అన్నీ సర్దుకుని ఎంఐఎం కూడా కలిసి వస్తే… గెలుపు నల్లేరుపై నడకే కానుంది.

ఎంఐఎంకు జీహెచ్‌ఎంసీలో 10 ఎక్స్‌అఫీషియో ఓట్లున్నాయి. వీరు కూడా మేయర్‌ ఎన్నికలో టీఆర్‌ఎ్‌సకు మద్దతిస్తే.. ఎక్స్‌అఫిషియో ఓట్ల సంఖ్య 45కు చేరుతుంది. అప్పుడు టీఆర్‌ఎస్‌ 31 డివిజన్లలో గెలిచినా మేయర్‌ పీఠం దక్కుతుంది. 2016 ఎన్నికల్లో 99 డివిజన్లను గెలుచుకున్న పార్టీకి… ఈ ఎన్నికల్లో 31 సీట్లు గెలుచుకోవడం పెద్ద కష్టం కాదని టీఆర్‌ఎస్‌ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంటే.. పార్టీ ఖాతాలో మేయర్‌ పదవి ఉన్నట్లేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

మరో మూడు సీట్లు పెరిగే అవకాశం…
టీఆర్‌ఎ్‌సకు మరో మూడు ఎక్స్‌అఫీషియో ఓట్లు పెరిగే అవకాశాలున్నాయి. ఇటీవల గవర్నర్‌ ముగ్గురు ఎమ్మెల్సీలను నామినేట్‌ చేశారు. ప్రభుత్వ సిఫారసు మేరకు నామినేట్‌ అయినందున… వీరు ముగ్గురు కూడా టీఆర్‌ఎస్‌ ఖాతాలో ఉన్నట్లే. రేపో మాపో ప్రమాణ స్వీకారం చేసే వీరు కూడా జీహెచ్‌ఎంసీలోనే ఎక్స్‌అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకునే అవకాశాలున్నాయి. దాంతో టీఆర్‌ఎ్‌సకు ఎంఐఎంతో కలిపి ప్రస్తుతమున్న 45 ఎక్స్‌అఫీషియో సభ్యుల బలం 48కి చేరనుంది. అప్పుడు స్వతహాగా కేవలం 28 డివిజన్లలో గెలిచినా.. మేయర్‌ పదవి చేజిక్కినట్లే.

కాగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా 2016 గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. ఇందులో కొంత మంది.. నగర శివార్లలో కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నట్లు సమాచారం. అయితే వీరి సంఖ్య చాలా స్పల్పమేనని అంటున్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఆయా సభ్యులకు లేఖలు రాసి స్పష్టత కోరింది. ఈ వివరాలు అందగానే టీఆర్‌ఎస్‌ ఎక్స్‌అఫీషియో సభ్యుల సంఖ్య స్పష్టమవుతుంది.

రేసులో ప్రముఖుల బంధువులు..
టీఆర్‌ఎస్‌ తరపున మేయర్‌ పదవిని పలువురు ప్రముఖ నేతల బంధువులు ఆశిస్తున్నారు. వీరిలో ప్రధానంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కోడలితోపాటు మాజీ హోంమంత్రి, దివంగత నాయిని నర్సింహారెడ్డి కూతురు, రాంనగర్‌ కార్పొరేటర్‌ వి.శ్రీనివా్‌సరెడ్డి సతీమణి మమతారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. వీరే కాకుండా.. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కూతురు విజయలక్ష్మి, మంత్రి మల్లారెడ్డి కూతురు, డిప్యూటీ స్పీకర్‌ టి.పద్మారావు కోడలు, పి.జనార్దన్‌రెడ్డి కూతురు విజయ, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ భార్య, మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోడలు రేసులో ఉన్నారు.

గత ఎన్నికల్లో బలాబలాలు
టీఆర్‌ఎస్‌ 99
ఎంఐఎం 44
బీజేపీ 4
కాంగ్రెస్‌ 2
టీడీపీ 1

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates