సంపూర్ణ ఆరోగ్య భారతం కావాలి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

దేశ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన కొలమానం ఆరోగ్యం. భారత రాజ్యాంగం పౌరులకు ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కు ప్రసాదించింది. జీవించడం అంటే కేవలం బతకడం మాత్రమే కాదు. ఆరోగ్యంగా బతకడమని అర్థం. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. నరేంద్ర మోడీ అధికారం లోకి వచ్చిన తర్వాత ‘2002 జాతీయ ఆరోగ్య పథకా’న్ని 2017లో కొంత మార్పులు చేర్పులు చేసి మళ్ళీ ‘జాతీయ ఆరోగ్య విధానం-2017’గా ప్రకటించారు. ఆ పథకాన్ని 2018లో ‘ఆయుష్మాన్‌ భారత్‌ పథకం’గా మార్చి ప్రకటించారు. ఇలా ఆరోగ్య పథకాలు మాత్రం అనేక రూపాంతరాలు చెంది చివరికి ‘ఆరోగ్య బీమా పథకం’ కింద మారిపోయింది. కానీ భారత ప్రజల ఆరోగ్య సూచికలు నానాటికీ దిగజారిపోతున్నాయి తప్ప మెరుగుపడలేదు. బడ్జెట్‌ కేటాయింపులు భారత్‌లో వైద్య రంగానికి కేటాయిస్తున్న బడ్జెట్‌ జిడిపిలో కేవలం 1.15 శాతం మాత్రమే. 2002 జాతీయ ఆరోగ్య విధానం ప్రకారం 2020 నాటికి ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు బడ్జెట్‌ కేటాయింపు పెంచుతామన్నారు. కానీ గత 15 సంవత్సరాల్లో ఆరోగ్య బడ్జెట్‌ మొత్తం జీడీపీలో 1.1 శాతానికి మించి కేటాయించలేదు. అంతర్జాతీయ సగటు కేటాయింపులు చూస్తే 4.9 శాతంగా ఉంది. మళ్లీ ఇప్పుడు జాతీయ విధానం 2017 ప్రకారం ప్రస్తుతం 1.15 శాతంగా ఉన్న ఆరోగ్య బడ్జెట్‌ను 2025 నాటికి 2.25 శాతానికి పెంచుతామని ప్రభుత్వం పేర్కొంది. కానీ గత ప్రభుత్వాలు 3 శాతం పెంచుతామని పేర్కొన్న దానికంటే ప్రస్తుత ప్రభుత్వం తక్కువ ప్రతిపాదించింది. అంతర్జాతీయంగా ఉన్న కేటాయింపులు 5 శాతంతో పోల్చి చూస్తే ఈ కేటాయింపుల పెంపుదల సగం కంటే తక్కువగా ఉండటం బాధాకరం.

మందుల కంపెనీల మాయాజాలం
సాధారణంగా బ్రాండెడ్‌ ఔషధాలను తయారు చేసే కంపెనీలే జనరిక్‌ మందులను కూడా ఉత్పత్తి చేసి మార్కెట్‌ చేస్తుంటాయి. కాబట్టి బ్రాండెడ్‌ మందుకి జనరిక్‌ మందుకి వాటి నాణ్యతా ప్రమాణాలలో, పని తీరులో ఎటువంటి తేడా ఉండదు. కానీ ధరలలో 300 శాతం నుంచి 1000 శాతం వరకు భారీగా తేడా ఉంటుంది. జనరిక్‌ మందు ఖరీదు రూ.2 ఉంటే మందులు కంపెనీలు బ్రాండెడ్‌ మందు ధరలను రూ. 40 నుండి రూ. 50 గా నిర్ణయిస్తాయి. అంతేకాకుండా జనరిక్‌ మందులపై అత్యంత దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తాయి. అలా మందులు కంపెనీలు జనరిక్‌ మందులను తొక్కేస్తూ బ్రాండెడ్‌ మందుల ద్వారా భారీ స్థాయిలో దోపిడీ చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను తట్టుకునేందుకు వాడుతున్న మందులు, మాస్కులను కూడా నకిలీవి తయారు చేసి ఇబ్బడి ముబ్బడిగా అమ్మేస్తూ ప్రజలను దోచేస్తున్నాయి.

వైద్య సిబ్బంది కొరత
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం డాక్టర్‌ జనాభా నిష్పత్తి కనీసం 1:1000 ఉండాలి. మన దేశంలో 2019 మార్చి 31 నాటికి ఎంసీఐ చట్టం ప్రకారం రాష్ట్రాల వైద్య మండళ్ల వద్ద నమోదు చేసుకున్న మొత్తం అల్లోపతి డాక్టర్ల సంఖ్య 11 లక్షల 59 వేల 309. ఆనాటికి అంచనా వేయబడిన భారత దేశ జనాభా 130 కోట్లు. అంటే డాక్టర్లు, జనాభా నిష్పత్తి 0.14 : 1000. అంతర్జాతీయ గణాంకాలను పరిశీలిస్తే క్యూబా 6.72 : 1000, ఆస్ట్రేలియా 3.374 : 1000, బ్రెజిల్‌ 1.9 : 1000, రష్యా 4.5 : 1000, స్పెయిన్‌ 4.9 : 1000, చైనా 1.5 : 1000. మన దేశంలో నేటికీ ఆరు లక్షల మంది డాక్టర్లు 20 లక్షల మంది నర్సుల కొరత ఉంది. దీనికితోడు టెక్నీషియన్ల కొరత 15 లక్షల వరకు ఉంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య ఆరోగ్య సిబ్బందిని మినహాయిస్తే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో 30 నుంచి 40 శాతం తక్కువగా ఉన్నారు. ఇలా సిబ్బంది కొరతతో ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందించడం కష్టంతో కూడుకున్నది.

కార్పొరేట్‌, ప్రైవేటు దోపిడీ

మన దేశంలో ప్రస్తుతం ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు 75 శాతం కార్పొరేట్‌ ప్రైవేట్‌ వైద్య వ్యవస్థలే ఆధారంగా మారిపోయాయి. అనేక కార్పొరేట్‌ సంస్థలు వైద్య రంగంలో ప్రవేశించి వైద్యాన్ని వ్యాపారంగా మార్చేశాయి. ఎందుకంటే అవసరం ఉన్నా లేకున్నా వైద్య పరీక్షలు అన్నింటినీ రాసి ఖర్చును తడిసి మోపెడు చేయడం మందుల రేట్లు 300 శాతం నుంచి 1000 శాతం వరకు అదనంగా వేసి దోచుకోవడం, డాక్టర్ల ఫీజులు కింద లక్షలాది రూపాయలు వసూలు చేయడం మొదలైన చర్యలతో మానవ విలువలు తుంగలో తొక్కి పేషెంట్లను దోపిడీ చేస్తూ ప్రజారోగ్యాన్ని ఓ పెద్ద వ్యాపారంగా మార్చేశారు. అందువల్ల మిగిలి ఉన్న ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలు ప్రభుత్వ విధానాల పర్యవసానంగా రోజురోజుకు దిగజారిపోతూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయి.
ప్రయి’వేటు’ బీమాలు
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రజారోగ్య రంగం లోకి అమెరికా తరహా ఆరోగ్య బీమాలు దేశం నిండా వచ్చిపడ్డాయి. ఐఆర్‌డిఏ చట్టం తెచ్చి భారతదేశం లోకి విదేశీ ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు తలుపులు బార్లా తెరిచారు. భారతదేశంలో కూడా కొత్త కొత్త ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వం ఇలాంటి చట్టాలను తెచ్చి ప్రభుత్వ ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అవకాశం కల్పించింది. వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం ప్రజారోగ్యం ప్రభుత్వాల బాధ్యత. ప్రజల హక్కు. కానీ ప్రభుత్వాలు రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కి ప్రజారోగ్య బాధ్యత నుంచి తప్పుకోవాలని ఆరోగ్య పథకాలు ప్రకటించడం సిగ్గుచేటు. కేవలం అత్యవసర వైద్య అవసరాల కోసం ఒక్క శాతానికి ఉపయోగపడే ఇటువంటి పథకాలను ప్రవేశ పెడుతూ భారత ప్రజలందరి పేరుతో ప్రజా ధనాన్ని ప్రైవేట్‌ కంపెనీలకు, కార్పొరేట్‌ ప్రైవేటు ఆసుపత్రులకు ధారాదత్తం చేయడం మన దేశ దౌర్భాగ్యం. ప్రభుత్వాలు ఇన్సూరెన్సు కంపెనీలకు చెల్లించే మొత్తం బడ్జెట్‌ను ప్రభుత్వ వైద్య ఆరోగ్య సంస్థల మీద ఖర్చు పెడితే అంతకు పది రెట్లు నాణ్యమైన వైద్యాన్ని ప్రభుత్వ రంగంలోనే అందించే అవకాశం ఉంది.

ప్రభుత్వాలు ఏం చేయాలి?

గత వందేళ్ల భారత ఆరోగ్య రంగాన్ని పరిశీలిస్తే మానవ మనుగడకే ప్రమాదకరంగా పరిణమించిన ఎన్నో తీవ్రమైన వ్యాధులు, ఆరోగ్య విపత్తుల సమయంలో కేవలం ప్రభుత్వ వైద్య ఆరోగ్య వ్యవస్థలు మాత్రమే భారత ప్రజల ప్రాణాలు రక్షించేందుకు కృషి చేశాయి. నేడు మన దేశాన్ని గానీ, యావత్‌ ప్రపంచాన్ని గానీ గడగడలాడిస్తున్న కరోనా (కోవిడ్‌-19) పై యుద్ధం చేస్తున్నది కూడా 99.9 శాతం ప్రభుత్వ వ్యవస్థలే.
కాబట్టి 1. వైద్య ఆరోగ్య రంగాన్ని జాతీయీకరణ చేయాలి. అందులో భాగంగా భారత ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఒక హక్కుగా చట్టబద్ధత కల్పించాలి. 2. కార్పొరేట్‌ ప్రైవేట్‌ ఆసుపత్రుల నియంత్రణ చట్టాన్ని తీసుకు రావాలి. ఆ ఆసుపత్రులలో కూడా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ, అలాగే తెల్ల రేషన్‌ కార్డు ఉన్న పేదలకు ఉచిత వైద్యాన్ని అందించేలా నిబంధనలు విధించాలి. డాక్టర్ల ఫీజులు, వైద్య పరీక్షల ధరలు, మందుల ధరలను కూడా ప్రభుత్వమే నిర్ణయించాలి. అతిక్రమించిన ఆసుపత్రుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. 3. అందరికీ సమానమైన నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించాలి. 4. ప్రభుత్వ రంగంలోని వైద్య ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అలాగే సర్‌ జోసెఫ్‌ విలియం భోర్‌ కమిటీ, డా|| శ్రీనాథ్‌ రెడ్డి కమిటీలు సూచించినట్లు ఆరోగ్య బడ్జెట్‌ను దేశ జిడిపిలో కనీసం 6 శాతం కేటాయించాలి. 5. ప్రభుత్వ రంగంలోని వైద్య ఆరోగ్య వ్యవస్థలన్నింటిలో డాక్టర్లు, నర్సులు, సాంకేతిక నిపుణులను, పారిశుధ్య సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలి. వారికి గౌరవ ప్రదమైన వేతనాలతో పాటు ఉద్యోగ భద్రతను కల్పించాలి. తద్వారా ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేసి భారతదేశం ఆరోగ్య భరితంగా వెలగాలి.

– డా|| యం.వి. రమణయ్య
( వ్యాసకర్త ప్రజారోగ్య వేదిక (ఆంధ్రప్రదేశ్‌)
రాష్ట్ర అధ్యక్షుడు,
సెల్‌: 9490300431 )

 

RELATED ARTICLES

Latest Updates