6 నెలలు.. 15 లక్షల కేసులు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా
పది లక్షలమంది రికవరీ

దిల్లీ: దేశంలోకి కరోనా అడుగుపెట్టి గురువారానికి ఆరు నెలలు అయింది. జనవరి 30న  కేరళలో తొలి కేసు వెలుగులోకి వచ్చింది. చైనాలోని వుహాన్‌ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన నాటి నుంచి వైరస్‌ రోజురోజుకు విస్తరిస్తూ పోతోంది. ఒకటితో మొదలైన సంఖ్య ఇప్పుడు 15,83,792కి చేరింది. తొలి 50 వేల కేసులు చేరుకోవడానికి 99 రోజులు పట్టగా, ఇప్పుడు రోజుకు 50వేల కేసులు నమోదయ్యే స్థాయికి పరిస్థితి వచ్చింది. 700 మరణాలు చేరుకోవడానికి 86 రోజులు పట్టగా ఇప్పుడు రోజుకు 700 మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచంలో కేసుల పరంగా మూడో స్థానానికి, మరణాల పరంగా ఆరో స్థానానికి భారత్‌ చేరింది. కేంద్ర వైద్యఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం దేశంలో తొలిసారి ఒక్కరోజులో 50వేలను మించి కేసులు పెరిగిపోయాయి. గరిష్ఠ సంఖ్యలో 775 మంది మరణించారు. టాప్‌-5లో ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకల్లో, దిల్లీల్లో పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడడంలేదు. మరోవైపు దిల్లీలో కొత్తకేసులు రోజూ వెయ్యివరకు పరిమితం అవుతూవస్తున్నాయి. గత పక్షం రోజులుగా దేశరాజధాని కరోనా నియంత్రణలో స్థిరత్వాన్ని కొనసాగిస్తూ వస్తోంది.

* పదిరోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి రోజురోజుకూ మారుతూ వస్తోంది. దేశంలో అత్యధిక కేసుల నమోదుతో మూడో స్థానం చేరడానికి చేరువైంది. ప్రస్తుతం అత్యధిక డబ్లింగ్‌ రేటు ఇక్కడే నమోదవుతోంది. జూన్‌ చివరి వరకు 15వేల కేసులున్న ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు 1.2 లక్షలకు చేరాయి. ఈ నెలలో 725%మేర కేసులు పెరిగాయి. సాధారణంగా రోజువారీ అత్యధిక కేసుల వృద్ధి ఎక్కువ రోజులు ఉండదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. అక్కడ రోజులకుపైగా అత్యధిక రోజువారీ వృద్ధి నమోదవుతూ వస్తోంది. జులైలో ఆ రాష్ట్రంలో 7.55% రోజువారీ వృద్ధి నమోదైంది.

అర లక్షకుపైగా..
గత 24 గంటల్లో దేశంలో తొలిసారిగా రోజువారీ కేసుల సంఖ్య 50వేలు దాటింది. వారం రోజులుగా 48-49వేల మధ్య ఉన్న సంఖ్య 52 వేలకు చేరింది.  కోలుకున్నవారి సంఖ్య తొలిసారి 10లక్షలు  దాటింది. రికవరీ రేటు 64.43%, మరణాల రేటు 2.20%కి చేరింది.

త్వరలో రోజుకు పది లక్షల పరీక్షలు: హర్షవర్ధన్‌
దేశంలో ప్రస్తుతం రోజుకు సుమారు 5 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని, రానున్న  ఒకటి రెండు నెలల్లో ఈ సంఖ్యను పది లక్షలకు చేర్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates