పాపం.. పసిబాలలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అమ్మానాన్నలతో కలిసి.. పనుల్లోకి పేద పిల్లలు
అత్యధికమంది వ్యవసాయ పనుల వైపు..
కుట్టుమిషన్‌ వైపు బాలికలు
చదువుకోవాలనే భావనలో ఎక్కువమంది విద్యార్థులు

కంటికి కనిపించని శత్రువు భావిభారత పౌరులను బడికి దూరం చేస్తోంది. చదువుకోవాలనే వారి ఆశల్ని చిదిమేస్తూ రోజు కూలీలుగా మార్చేసింది. నాలుగు నెలల పాటు ఇంటిల్లిపాది ఆదాయం కోల్పోయిన ప్రభావంతో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిదండ్రుల వెంట పేద, మధ్య తరగతి పిల్లలు.. వ్యవసాయ పనుల్లో కూలీలుగా, నిర్మాణ పనుల్లో కార్మికులుగా, దుకాణాల్లో క్లీనర్లుగా దర్శనమిస్తున్నారు. బాలికలు సైతం సాయంత్రం పూట కుట్టుమిషన్‌ నేర్చుకుంటున్నారు. ఏజెన్సీల్లోనూ చెట్టూ చేమల్లో పిల్లలు కనిపిస్తుండగా.. పాలల్లో నీళ్లలాగా తమవెంట తీసుకుపోతున్నామని కన్నవాళ్లు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ప్రస్తుతం పనుల్లోకి వెళ్తున్న విద్యార్థుల్లో అత్యధిక మంది అట్టడుగు వర్గాలకు చెందినవారే ఉండటం ఆ కుటుంబాల స్థోమతకు అద్దం పడుతున్నది.

తల్లిదండ్రులకు పిల్లలు అదనపు భారంలా మారడంతో వారినీ కూలి పనులకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని ఏజెన్సీలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పాఠశాలలున్న సమయంలో ఉచితంగా మధ్యాహ్న భోజనం, ప్రభుత్వ హాస్టల్స్‌ల్లో భోజనం అందించేవారు. దాంతో తల్లిదండ్రులు తిన్నాతినకపోయినా చదువుపేరుతో పిల్లల కడుపయినా నిండేది. వారానికి మూడు సార్లు గుడ్డుతో పాటు పప్పు, కూరలు, సాంబార్‌, సన్నబియ్యంతో భోజనం పెట్టేవారని విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తుచేస్తున్నారు.

బడున్నప్పుడు మధ్యాహ్న భోజనం ఉండేది..ఇప్పుడు
ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో ఒకటి నుంచి 10 తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 200 మంది ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన వీరంతా లాక్‌డౌన్‌ మూడునెలల కాలంలో తల్లిదండ్రులకు పనులు లేక ఆర్థికంగా చితికిపోయారు. ఇప్పుడు కొద్దిగా పనులు దొరుకుతుండటంతో పిల్లలనూ తమవెంట పనులకు తీసుకెళ్తున్నామని ఓ తల్లి తెలిపింది. బడున్నప్పుడు మధ్యాహ్నం భోజనం పెట్టేవారు. ఇప్పుడు లేకపోవడంతో ఇంట్లో ఇబ్బంది అవుతుందని అన్నారు. మరికొంత మంది తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులు చేస్తున్నారు. వీరిలో ఎక్కువగా మంది బాలికలు ఉండడం గమనార్హం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన, కోయ సామాజిక వర్గానికి చెందిన పిల్లలెక్కువగా పనులకు వెళుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా తాడూరు మండలం గుంతకోడురు గ్రామంలోని 120మంది విద్యార్థులు, బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో 125మంది విద్యార్థులు.. వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సహాయపడుతున్న వారు కొందరయితే, కూలి పనులకు వెళుతున్నవారు మరికొందరు. కూలీలను పెట్టుకునే ఆర్థిక స్థోమత లేని వారు విత్తనాలు, ఎరువులు చల్లడం వంటి పనులను తమ పిల్లలతో చేయిస్తున్నారు. అలాగే, టీ కొట్లు, బట్టల దుకాణాల్లో వ్యాపారాలకు పిల్లలను పంపుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పిల్లలను అటవీ ఫలాలు సేకరణకు తీసుకెళ్తున్నారు.

రోజు కూలి రూ.200
వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం గుండెపల్లి గ్రామంలో విద్యార్థులు మొక్కలు నాటాడానికి వెళ్తున్నారు. దోమ, కుల్కచర్ల మండలాల్లో విద్యార్థులు కంది, మక్క చేలల్లో కనిపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, మాడ్గుల మండల్లాలో పత్తి పంట పనులకు వెళ్తున్నారు. వారికి రోజుకు రూ. 200 కూలి వస్తుంది. ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్నత పాఠశాల, ఇంటర్‌, డిగ్రీ చదువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులు వానాకాలం పంటల సాగులో తల్లిదండ్రులకు సహకరిస్తుండగా, పట్టణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తమ తల్లిదండ్రులు చేసే వ్యాపారాలు, ఇతరత్రా పనులతో పాటు తమ వ్యాపకాలపై దృష్టి సారిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మేస్త్రి పనులతో పాటు నారు, కలుపు లాంటి వ్యవసాయ పనులకూ వెళుతున్నారు. బోయినపల్లి మండలంలో రోడ్ల వెంట మొక్కజొన్న కంకులు అమ్ముతూ, గొర్ల కాపరిగానూ పనిచేస్తున్నారు.

మాకు స్మార్ట్‌ఫోన్లు లేవు
కరోనాతో స్కూల్‌ ఎప్పుడు తెరుస్తారో చెప్పడం లేదు. అందుకే అమ్మానాన్నలతో కలిసి అప్పుడప్పుడు కూలి పనులకు వెళ్తున్నా. పుస్తకాలు లేవు. ఆన్‌లైన్‌ క్లాసులన్నారు. కానీ మాకు స్మార్ట్‌ఫోన్‌ లేదు కదా. బడి ఉన్నప్పుడే బాగుండేది.
ఎన్‌. వెంకట్‌, సత్తుపల్లి

కుట్టు మిషన్‌ నేర్చుకుంటున్నా
కరోనా వల్ల పాఠశాలలకు మార్చి నుంచి సెలవులు వచ్చాయి. ఇంట్లో ఖాళీగా ఉండలేక కుట్టు మిషన్‌ నేర్చుకుంటున్నా. సాయంత్రం పూట కొంత సేపు చదువుకుంటున్నా. పాఠశాలలు తెరిస్తే వెళ్లి చదువుకోవాలని ఉంది.
సాత్విక, పదవ తరగతి, బయ్యారం, భద్రాద్రి కొత్తగూడెం

గొర్లు కాయడానికి వెళ్తున్నా
జిల్లా పరిషత్‌ పాఠశాలలో 9వ తరగతి పూర్తిచేసి, నాలుగు నెల్ల నుంచి ఇంటి దగ్గరే ఉంటున్న. కరోనాతో స్కూళ్లు తెరవకపోవడంతో తల్లిదండ్రులకు చేదోడుగా గొర్లు మేపుతున్న. నాన్న పొలం పనులకు వెళ్తున్నడు.
సతీశ్‌, టేక్రియాల్‌, కామారెడ్డి జిల్లా

”నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని స్థానిక మోడల్‌ పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేసిన సామల దీపక్‌ (15) చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి లక్ష్మి బీడీ కార్ఖానాలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. కరోనాతో తల్లికి పనిలేకపోవడంతో దీపక్‌ ఉదయం వేళ పేపర్‌ బారుగా, అనంతరం స్థానిక మెడికల్‌ షాపులో పనిచేస్తూ కుటుంబానికి ఆసరా అవుతున్నాడు.” ఒక్క దీపక్‌ పరిస్థితే కాదు, రాష్ట్రవ్యాప్తంగా పేద విద్యార్థుల పరిస్థితి ఇదే. కరోనా విపత్కర పరిస్థితుల్లో పాఠశాలలు మూతపడటంతో విద్యార్థుల భవిష్యత్తే ఆగమ్యగోచరంగా మారిన ఈ పరిస్థితుల్లో వారూ ఏదో ఒక పనికి పోతూ తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటున్నారు. కనీసం పాఠశాలలు తెరిస్తేనన్నా పిల్లలకు కొంతయినా పౌష్టికాహారం దొరుకుతుందని తల్లిదండ్రులంటున్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates