ప్రపంచవ్యాప్తంగా మూతపడిన పాఠశాలలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-191 దేశాల్లో 150కోట్లమంది విద్యార్థులపై ప్రభావం
– డిజిటల్‌ ఎడ్యుకేషన్‌…సమస్యకు పరిష్కారం కాదు : నిపుణులు

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కడా తగ్గటం లేదు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దాదాపు 191 దేశాల్లో పాఠశాలలు మూతపడ్డాయి. తరగతిగది బయట దిక్కుతోచని స్థితిలో 150కోట్లమంది విద్యార్థులు, 6.3కోట్లమంది టీచర్లు ఉన్నారు. ఇదిలాఉండగా…భారత్‌లో ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూల్స్‌ ‘డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌’ ‘ఆన్‌లైన్‌ క్లాసులు’ మొదలెట్టేశాయి. ఇదెంతమాత్రమూ సరైంది కాదని, ఇలాంటి విధానాల్ని ప్రోత్సహిస్తే కోట్లాదిమంది విద్యార్ధుల విద్యావకాశాలు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విద్యారంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మనదేశంలో పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారు? లాక్‌డౌన్‌ తర్వాత ఎలా ఉండబోతున్నాయి?అన్నవాటిపై విధానపరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తరగతి బోధనా? సిలబస్‌ తగ్గిస్తారా? విద్యార్థులను రెండు బ్యాచ్‌లుగా విడగొట్టడమా?…ఏ విధానం బాగుంటుందన్న చర్చ అనేకదేశాల్లో జరుగుతున్నది. వివిధ దేశాలు ఇదమిత్తంగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాయి. కానీ మనదేశంలో ‘డిజిటల్‌ ఎడ్యుకేషన్‌’ను ప్రోత్సహిస్తూ, అందుకు అనుమతిస్తూ మోడీ సర్కార్‌ సంకేతాలు ఇచ్చేసింది. ఈనేపథ్యంలో ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూల్స్‌ ‘ఆన్‌లైన్‌ క్లాసులు’ ప్రారంభించాయి. విద్యా సంవత్సరం ప్రారంభం గురించి జులైలో ప్రకటిస్తామని కేంద్ర మంత్రులు ఒకవైపు చెబుతూ ఉన్నారు.
ఇదంతా గమనించాక విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒక గందరగోళం నెలకొంది. ప్రయివేటులో ప్రారంభమై, ప్రభుత్వ రంగంలో తరగతులు మొదలుగాకపోతే ఎలా అన్నది వారిని వేధిస్తున్నది. ఇదిలాగే కొనసాగితే…డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ వల్ల కోట్లాదిమంది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బకొడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ బారిన పడకుండా విద్యాసంవత్సరం ఎలా మొదలుపెట్టాలనేదానిపై కాకుండా ‘డిజిటల్‌ ఎడ్యుకేషన్‌’ పొందండి…అంటూ కేంద్రం చేతులు దులుపేసుకోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పరిష్కారం..ఎలా?

కరోనా మహమ్మారిని అడ్డుకోవటమే దీనికి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోకుండా విద్యారంగ సమస్యలు పరిష్కరించలేమని వారు చెబుతున్నారు. మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో డిజిటల్‌ సేవలు పొందేవారికి, పొందలేనివారికి మధ్య చాలా అంతరం ఉంది. ‘డిజిటల్‌ ఎడ్యుకేషన్‌’ కోట్లాదిమంది విద్యా అవకాశాల్ని కాలరాస్తుందనటంలో సందేహం లేదు. తద్వారా సమాజంలో, దేశంలో…పెద్ద ఎత్తున విభజనరేఖను తీసుకొస్తుందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

– భారత్‌, ఆఫ్రికా ఖండంలోని వివిధదేశాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సేవలు లేని కుటుంబాలు 82శాతం. కంప్యూటర్‌ లేని కుటుంబాలు 90శాతం.
– డిజిటల్‌ విద్యను ప్రోత్సహిస్తే…ఇంటర్నెట్‌ వసతి, డిజిటల్‌ సేవలు..అందుకోలేని పిల్లలు విద్యా సంవత్సరాన్ని కోల్పోతారు. ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ డాటా కోసం పేద, మధ్య తరగతి కుటుంబాలు ఖర్చు చేయలేవు.
– ప్రపంచవ్యాప్తంగా 83కోట్లమంది విద్యార్థులకు కంప్యూటర్‌ లేదు. 40కోట్లమంది పిల్లలకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అందుబాటులో లేదని ‘యునెస్కో’ అధ్యయనం ఒకటి తెలిపింది.
– ఇంటర్నెట్‌, ఆన్‌లైన్‌ సేవలు విస్తారంగా అందుబాటులో ఉనప్పటికీ ఆన్‌లైన్‌ క్లాసులు…తరగతి గది బోధనకు సాటిరావని, విద్యా లక్ష్యాలు నెరవేరవని నిపుణులు చెబుతున్నారు.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates