ప్రధానిపై వ్యాఖ్యల పర్యవసానం.. అరెస్టుపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ : కరోనా మరణాలు, ఉగ్రవాద దాడులపై ప్రధాని మోదీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారని సీనియర్ జర్నలిస్టు వినోద్ దువా యూ ట్యూబ్ వీడియోలో వ్యాఖ్యానించారు. దీనిపై హిమాచల్ ప్రదేశ్ బీజేపీ నేత అజయ్ శ్యామ్ మే 6న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వినోద్పై పబ్లిక్ న్యూసెన్స్, దేశద్రోహం, ఉన్నత పదవుల్లో ఉన్నవారిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం వంటి నేరాలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వినోద్ను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, తన వ్యాఖ్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛ కిందకు వస్తాయని, తన అరెస్టుపై స్టే ఇచ్చి విచారణను నిలిపివేయాలని, ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరుతూ వినోద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను ఆదివారం వీడియో కాన్ఫరెన్స్లో అత్యవసరంగా విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ లలిత్, జస్టిస్ శాంతనగౌడర్, జస్టిస్ వినీత్ శరణ్ల ధర్మాసనం జూలై 6 వరకు అరెస్టుపై స్టే విధించింది. అయితే, విచారణ కొనసాగుతుందని, వినోద్ సహకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్రం, హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వాలకూ నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణకు విచారణాధికారి కోర్టుకు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. కాగా, పిటిషనర్పై నమోదైన ఎఫ్ఐఆర్ ప్రాధమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని వినోద్ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ అన్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న జర్నలిస్టులను వేధించేందుకే ఈ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కోర్టుకు ఆదివారం సెలవు అయినా వినోద్పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడం విశేషం.
Courtesy Andhrajyothi