ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలను ఢిల్లీ రాష్ర్టానికి చెందిన రోగులకే రిజర్వు చేయాలంటూ కేజ్రీవాల్ మంత్రివర్గం నిర్ణయించడం తీవ్ర అభ్యంత రకరం. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్.జీ.బాయిజల్ ఈ ఉత్తర్వును ఆమో దించకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల వారికి కష్టాలు తప్పాయి. ఢిల్లీ క్యాబి నెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం రోగులు దవాఖానలో చేరే ముందు నివాస ధ్రువీకరణ పత్రాలు చూపించవలసి ఉంటుంది. దీనివల్ల ఇతర రాష్ర్టాలకు చెందిన కరోనా రోగులు ఢిల్లీ నగరంలో చికిత్స పొందడం సాధ్యం కాదు. ఢిల్లీ నగరం చుట్టూరా ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన ప్రాంతాలుంటాయి. ఈ రెండే కాకుండా దూరంగా ఉన్న రాష్ర్టాల వారు కూడా బతుకుదెరువు కోసం ఢిల్లీ నగరానికి వస్తుంటారు. దేశ రాజ ధాని అయినందుకు మరింత బాధ్యతగా వ్యవహరించవలసింది పోయి ప్రజలను ఇబ్బంది పెట్టే సంకుచిత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందనేవిధంగా కేజ్రీవాల్ వ్యాఖ్యానించడం ఏ మాత్రం సమర్థనీయంగా లేదు.
ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. కొవిడ్-19 వ్యాధిగ్రస్థుల సంఖ్యలో- మహారాష్ట్ర, తమిళనాడు తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉన్నది. దాదాపు ముప్ఫై వేల మందికి కరోనా సోకగా ఎనిమిది వందల మందికిపైగా మరణించారు. ఇప్పటికీ 17 వేలకు పైగా యాక్టివ్ కేసులు న్నాయి. కొన్ని ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఢిల్లీ రాష్ట్రం కూడా కరోనా రోగు లకు చికిత్స అందించడంలో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. తనకు ఇబ్బందులు ఉంటే కేంద్ర సహాయం కోరాలి. కేంద్రం సహకరించకపోతే సభ్య ప్రపంచం తప్పు పడుతుంది. కేంద్రం తమ రాష్ట్ర ప్రభుత్వ అధికారా లను కబళిస్తున్నదని కేజ్రీవాల్ ఆరోపణలు చేసినప్పుడు, ఆయనకు దేశ వ్యాప్తంగా రాజనీతి కోవిదులు మద్దతు తెలిపారు. ప్రజలు భారీ మెజా రిటీతో గెలిపించారు. కరోనా రోగుల చికిత్స విషయంలో కూడా కేంద్ర సహాయం కోసం ఒత్తిడి తేవాల్సింది. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఇతర రాష్ట్రాల సహకారం పొందాల్సింది. వాస్తవాన్ని ప్రజల ముందు పెడితే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుంది. అంతే కానీ రోగుల పట్ల స్వపర భేదం చూపడాన్ని ఎవరూ హర్షించరు.
1999 కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్థాన్ తమ సైనికుల మృతదేహాలను తీసుకోవడానికి నిరాకరించింది. ప్రపంచం దృష్టిలో తాము దాడి జరిపి నట్టు తెలుస్తుందనే కారణంగా, వారు తమ సైనికులు కాదని చెప్పింది. ఆ పరిస్థితుల్లో మన దేశంలోనే ఆ మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి. మన సైన్యం ఒక మత పెద్దను పిలిపించి, వారి మత విశ్వాసాలకు అనుగుణంగా గౌరవంగా అంత్యక్రియలు జరిపించింది. శత్రు సైనికులు అయినప్పటికీ మానవీయంగా వ్యవహరించడం ఆధునిక సమాజ లక్షణం. ఢిల్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి పాలన పట్ల ప్రజలు విసుగెత్తినప్పుడు, విలువల పరిరక్షణ కోసం సాగిన ఉద్యమ పర్యవసానంగా కేజ్రీవాల్ అధికారానికి వచ్చారు. అటువంటి ఉన్నత నేపథ్యం ఉండి కూడా, పొరుగు రాష్ర్టాల వారనే కారణంగా చికిత్స నిరాకరించడం మానవీయత అనిపించుకోదు.
Courtesy Namasthe Telangana