దక్షత కొరియా వైరస్‌పై పోరులో ప్రపంచ దేశాలకే ఆదర్శం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

సామాజిక బాధ్యతతో ప్రజా విజయం

కరోనాపై పోరులో దక్షిణ కొరియా పైచేయి సాధిస్తోంది. మహమ్మారిని కట్టడి చేయడం ప్రభుత్వం పని మాత్రమే అని అనుకోలేదిక్కడి ప్రజలు.. పౌరుల ఆరోగ్య బాధ్యతలను ప్రభుత్వం ఏమాత్రమూ విస్మరించలేదు. ఇటు ప్రభుత్వం.. అటు ప్రజలు కలిసికట్టుగా పోరాడుతుండటంతో దక్షిణ కొరియా ప్రపంచానికే దారి చూపిస్తోంది.

అమెరికా, దక్షిణ కొరియా.. ఈ రెండు దేశాల్లోనూ ఒకే రోజున(జనవరి 21) కొవిడ్‌-19 కేసులు బయటపడ్డాయి. దాదాపు 3 నెలల తర్వాత అగ్రరాజ్యంలో మొత్తం కేసులు 7 లక్షల పైమాటే. ద.కొరియాలో కేవలం 10,635 కేసులే నమోదయ్యాయి. అమెరికాలో 37 వేల మందికి పైగా చనిపోతే దక్షిణ కొరియా మరణాలను 230కే పరిమితం చేయగలిగింది.. ఇక్కడ కేసుల సంఖ్య ఈనెల 3న 10 వేలు దాటగా.. గత రెండు వారాల్లో నమోదైన కొత్త కేసులు 573 మాత్రమే. అంటే సగటున రోజుకు నమోదవుతున్న కొత్త కేసులు 41 లోపే. ఇంతలా కరోనా మహమ్మారి కొమ్ములు వంచడంలో సఫలీకృతమైన ఈ దేశం పోరాడుతున్న తీరు ఆదర్శనీయం.

ఒక్క నెలలో ఎంత మార్పు
నెల రోజుల క్రితం(మార్చి 17 నాటికి) దక్షిణ కొరియాలో 8 వేలకు పైగా కేసులు.. ప్రపంచంలో ఆరో స్థానం. ఇటలీ, ఇరాన్‌, చైనా, స్పెయిన్‌, జర్మనీ తప్ప మరే దేశంలోనూ దక్షిణ కొరియాలో నమోదైనన్ని కేసుల్లేవు. అప్పటికి అమెరికాలో 6,346 కేసులే నమోదయ్యాయి. సరిగ్గా నెల రోజుల తర్వాత(అంటే ఏప్రిల్‌ 17 నాటికి) – ద.కొరియాలో 2,315 కేసులే పెరిగాయి. ఈ దేశం 23వ స్థానానికి తగ్గింది. మొత్తం 7,829 మంది రోగులు కోలుకున్నారు. అగ్రరాజ్యంలో మాత్రం ఏకంగా 7 లక్షల కేసులు పెరిగాయి. కరోనాను దక్షిణ కొరియా ఎంతగా కట్టడి చేస్తోందో ఈ గణాంకాలే చెబుతున్నాయి.

నాలుగు ‘టీ’లు
వేగంగా స్పందించడం దక్షిణ కొరియా విజయాల్లో ఒకటి. ఇక్కడి ప్రభుత్వం 4 ‘టీ’లతో ముందుకెళుతోంది. అవి.. ముందుగానే పరీక్షలు జరపడం(టెస్టింగ్‌), సరైన దిశ(ట్రాకింగ్‌), కేసులు గుర్తించడం(ట్రేసింగ్‌), చికిత్సలు అందించడం(ట్రీటింగ్‌). జనవరి 27 నాటికి కేసుల సంఖ్య 4కి చేరగా.. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం త్వరితగతిన టెస్ట్‌కిట్లను తయారు చేయడానికి 20 కంపెనీలను రంగంలోకి దించింది. దాదాపు 3వారాల్లోనే 46,127 మందికి పరీక్షలు నిర్వహించారు. అప్పటికి అమెరికాలో కేవలం 426 మందికే పరీక్షలు జరపడం గమనార్హం. అగ్రరాజ్యంలో అప్పటికి 68 కేసులే ఉండగా దక్షిణ కొరియాలో 3,150 కేసులు బయటపడ్డాయి.

కొవిడ్‌ పరీక్షలు కీలకం..
దాదాపు 5.16 కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియాలో ఇంతవరకు 5.46 లక్షల మందికి పైగా పరీక్షలు చేశారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 633 కేంద్రాలను తెరిచారు. రోజుకు 20,000 మందికి పరీక్షలు జరిపేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 6 గంటల్లోనే ఫలితాలు వచ్చేస్తాయి. ఇక్కడ పరీక్షలు చేయించుకోవడం ఎంత సులువంటే – దేశ రాజధాని సియోల్‌లోని ఓ వ్యక్తి తనకు కొద్దిగా జ్వరంగా అనిపిస్తే వెంటనే ఇంటి నుంచి బయల్దేరి పరీక్షలు జరిపే కేంద్రానికి వెళ్లి, నమూనాలను ఇచ్చి తిరిగి 2 గంటల్లోనే ఇంటికి చేరుకోవచ్చు.

సరిహద్దుల నియంత్రణ
కొత్త కేసుల్లో సగం విదేశాల నుంచి వచ్చినవాళ్లే ఉంటున్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. ఇలా వచ్చిన వారందరికీ పరీక్షలు, క్వారంటైన్‌ తప్పనిసరి చేసింది. వారంతా ప్రభుత్వ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దీనిద్వారా వారు ఎక్కడకు వెళ్లినా తెలిసిపోతుంది. విదేశాల నుంచి వచ్చినవారు కొరియన్లు అయినా, వారికి నెగెటివ్‌ వచ్చినా సరే 2వారాలపాటు స్వీయ ఏకాంతంలో ఉండాల్సిందే. ఉల్లంఘిస్తే వెంటనే యాప్‌ ద్వారా తెలిసిపోతుంది.

రోగుల వర్గీకరణ
రోగులను – లక్షణాలు కనిపించని; స్వల్ప లక్షణాలున్న; తీవ్ర/విషమ పరిస్థితుల్లో ఉన్నవారు అనే 3 వర్గాలుగా విభజించారు. అత్యంత ముప్పున్న రోగులను, వృద్ధులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. స్వల్ప లక్షణాలున్న; లక్షణాలు కనిపించని రోగులను, యువతను డార్మెటరీలకు పంపిస్తున్నారు. దీంతో మరణాల రేటు కేవలం 2.16 శాతానికి పరిమితం చేయగలిగారు. అదే అమెరికాలో మరణాల రేటు 5.23 శాతం కావడం గమనార్హం.

జల్లెడ పట్టి… సమాచారం పంచి
దక్షిణ కొరియాలో అనుమానం వచ్చిన ప్రతిఒక్కరినీ వెతికి పట్టుకుని మరీ పరీక్షలు చేస్తున్నారు. ఒక వ్యక్తికి పాజిటివ్‌ అని తేలితే.. ఆ వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగాడో, ఎవరెవరిని కలిశాడో మొత్తం చరిత్రను తీసి అందరికీ పరీక్షలు జరిపారు. ఇందుకు స్థానిక సంస్థల సహకారం తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించారు. స్మార్‌్ాఫోన్‌లను ట్రాక్‌ చేశారు. సంబంధిత వ్యక్తులు వాడిన క్రెడిట్‌/డెబిట్‌ ఇతర కార్డుల ఆధారంగా ఆ వ్యక్తి ఏ నిమిషానికి ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని సంబంధిత వ్యక్తులందరికీ పరీక్షలు చేశారు. రోగులు, అనుమానితుల కదలికలను జీపీఎస్‌ ఆధారిత యాప్‌ల ద్వారా కనిపెడుతున్నారు. క్వారంటైన్‌లో ఉన్నవారికి ఎలక్ట్రానిక్‌ బ్రేస్‌లెట్‌లను తొడిగిస్తున్నారు. ఉల్లంఘించినవారికి జరిమానాలు విధిస్తున్నారు. అలాగే కరోనా రోగి 100 మీటర్ల పరిధిలో ఉంటే తెలియజేసేలా ‘కరోనా 100ఎం’ అనే యాప్‌ కీలకంగా పనిచేస్తోంది.

సామాజిక బాధ్యత… ‘ప్రజా’ విజయం
దక్షిణ కొరియాలో కొవిడ్‌ను నియంత్రించడం వెనుక ప్రభుత్వ ఘనత ఎంత ఉందో.. అదే స్థాయిలో ప్రజా సహకారమూ, చైతన్యమూ ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించక ముందే భౌతిక దూరం పాటించడంలో ప్రజలు ఆదర్శంగా నిలిచారు. స్వచ్ఛందంగా మాస్కులు ధరించారు. ఇళ్లలోనే ఉండిపోయారు. గుమిగూడటం మానేశారు. దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఈ నిబంధనలను పక్కాగా పాటించారు. వైరస్‌ హాట్‌స్పాట్‌గా నిలిచిన డెగూలో రెస్టారెంట్లు, దుకాణాలు, సినిమా థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. ప్రార్థన మందిరాల్లో అన్ని రకాల కార్యక్రమాలను నిలిపివేశారు. అత్యంత కట్టుదిట్టమైన లాక్‌డౌన్‌లు, రోడ్‌బ్లాక్‌లు, ప్రయాణాలపై నిషేధాల అవసరం లేకుండానే ప్రజలు స్వచ్ఛందంగా, పూర్తిగా ప్రభుత్వానికి సహకరించారు.

కలిసొచ్చిన అనుభవం
గతంలో సార్స్‌, మెర్స్‌లను అదుపుచేసిన అనుభవమూ ద.కొరియాకు కలిసొచ్చింది. ఇక్కడ చాలామేర ప్రైవేటు ఆసుపత్రులే ఉన్నప్పటికీ, 97% కొరియన్లకు నిర్బంధ జాతీయ ఆరోగ్య బీమా పథకం వర్తిస్తుంది. వైద్యానికి అదనంగా కేటాయించిన దాదాపు రూ.850 కోట్లను కరోనా కట్టడికి ఖర్చుచేశారు.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates