న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు శుక్రవారం ఉరి శిక్ష అమలు చేశారు. ఈ కేసులో దోషులుగా తేలిన ముకేష్ సింగ్(32), అక్షయ్ సింగ్(31), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26)లను తిహార్ జైలులో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఉరి తీశారు. జిల్లా మేజిస్ట్రేట్, జైలు అధికారుల సమక్షంలో మరణశిక్ష అమలు జరిపారు. ఉరి శిక్ష అమలు సమయంలో 17 మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్టు సమాచారం. ఉరి తీయడంతో నలుగురు దోషులు మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. కాగా, ఉరిశిక్షను తప్పించుకునేందుకు దోషులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఎట్టకేలకు మరణదండన అమలు చేశారు.
తమ కుమార్తెను దారుణంగా హతమార్చిన దోషులకు ఉరిశిక్ష అమలు చేయడంతో నిర్భయ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తమ కుమార్తెకు న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ వాసులు తిహార్ జైలు వెలుపల సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుని హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తప్పు చేసినవాళ్లకు శిక్ష తప్పదని పలువురు వ్యాఖ్యానించారు.