ఇక బాదుడేనా..?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 – రూ.1.83 లక్షల కోట్లతో భారీ బడ్జెట్‌
– అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
– రెవెన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు
– ఆర్థిక లోటు రూ.33,191.25 కోట్లు
– ఆదాయం కోసం రాజీవ్‌ స్వగృహ ఆస్తులను అమ్మాలని నిర్ణయం
– 2019-20 ఫిబ్రవరి నాటికి 6.3 శాతానికి తగ్గిన రెవెన్యూ వృద్ధిరేటు
– మండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

అంచనాలకు భిన్నంగా మరింత భారీ బడ్జెట్‌ను తెలంగాణ సర్కార్‌ ప్రతిపాదించింది. రాష్ట్ర బడ్జెట్‌ సైజు 30 నుంచి 40 వేల కోట్లు తగ్గిస్తారనే ఊహాగాలను తలకిందులు చేస్తూ.. ఏకంగా 1.83లక్షల కోట్లు బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ విషయంలో లీకులు పొక్కకుండా చూడగలిగినందుకు సర్కారు సంతోషపడినట్టయింది. కానీ పాత పద్దతిలోనే అంకెలగారడీతో మభ్యపెట్టి.. వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓవైపు రెవిన్యూఅభివృద్దిరేటు 16 శాతం నుంచి 6.3 శాతానికి దిగజారిందనీ, మరోవైపు కేంద్రం నుంచి నిధులు రావటంలేదనీ.. దేశంలోనే కాదు రాష్ట్రంలోనూ ఆర్థికమాంద్యం ఉన్నదని ప్రభుత్వమే ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో భారీ సైజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంపై సర్వత్రా చర్చ నడుస్తున్నది. ఇంకోవైపు అంతర్గత ఆదాయాలపై దృష్టిపెడతానని మంత్రి హరీశ్‌ అనటంతో.. ఇక బాదుడుకు సర్కారు రెడీ అయిందన్న సంకేతాలిచ్చింది.

ఆర్ధిక మాంద్యంతో ఆదాయం తగ్గిందని చెబుతూనే రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్‌ను ప్రతిపాదించింది. రూ.1,82,914.42 కోట్లతో 2020-21 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు, శాసనమండలిలో శాసనసభా వ్యవహారాలు, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు, ఆర్థిక లోటు రూ.33,191.25 కోట్లుగా చూపెట్టారు. 2018-19లో రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు 16.1 శాతం ఉంటే 2019 ఫిబ్రవరి నాటికి అది 6.3 శాతానికి పడిపోయింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా, బడ్జెట్‌లో వేసుకున్న అంచనాల కంటే 3,731 కోట్లు తగ్గింది. శాసనసభలో హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రవేశపెడుతూ…’కాగితాల మీద వేసుకునే అంకెల వరుస కాదు…సామాజిక విలువలతో కూడినది. పేద ప్రజలే కేంద్రంగా రూపొందించిన ప్రగతిశీల బడ్జెట్‌ ఇది. వార్షికానికేకాదు…నాలుగేండ్ల భవిష్యత్‌ ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని తయారు చేసినది. అన్ని వర్గాల సంక్షేమం,అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యంతో పూర్తి వాస్తవికతో బడ్జెట్‌ ప్రతిపాదనలు చేస్తున్నాం’ అని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఐజీఎస్‌టీలో కానీ, జీఎస్‌టీ పరిహారంలో కానీ నిధులు సకాలంలో రావడం లేదని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ప్రకారం తెలంగాణకు వచ్చే పన్నుల వాటా 2.437 శాతం నుంచి 2.133 శాతానికి తగ్గిందని వివరించారు. 2019-20 బడ్జెట్‌లో అంచనాల మేరకు మార్చి నెలాఖరు వరకు రూ.1,36,000 కోట్ల వరకు జరుగుతుందన్నారు. 2019-20 నాటికి తెలంగాణ తలసరి ఆదాయం 2,28,216 రూపాయలుండగా…దేశ తలసరి ఆదాయం 1,35,050 రూపాయలు మాత్రమేనన్నారు. దేశ తలసరి ఆదాయం రాష్ట్ర తలసరి ఆదాయం 93,166 కోట్లు ఎక్కువగా ఉందని చెప్పారు.

రూ.25 వేల లోపు రైతులకు రుణాలుంటే నెలలోగా మాఫీ
’25వేల రూపాయల లోపు రుణాలున్న రైతులు రాష్ట్రంలో 5,83,916 మంది ఉన్నారు. వారందరి రుణాలను ఈ నెలలోగానే ఒకే దఫా మాఫీ చేస్తాం. దీనికిగానూ రూ.1198 కోట్లు విడుదల చేస్తాం. మాఫీ చెక్కులను రైతులకు ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేస్తాం. రూ.25 వేల నుంచి లక్షలోపు రుణాలున్న రైతులకు నాలుగు విడతల్లో ఇస్తాం. ఈ ఏడాది రైతు రుణమాఫీ కోసం రూ.6,225 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. కొత్తగా పాసు పుస్తకాలు మంజూరు కావడం వల్ల రైతు బంధు లబ్దిదారుల సంఖ్య పెరిగే అవకాశముంది. అందుకే బడ్జెట్‌లో రూ.2వేల కోట్ల అదనంగా ప్రతిపాదిస్తున్నాం. మొత్తంగా రైతు బంధు పథకం కోసం రూ.14 వేల కోట్లు ప్రతిపాదించాం. ఎల్‌ఐసీకి రైతు బీమా కోసం ఈ బడ్జెట్‌లో రూ.1,141 కోట్లు, మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ కోసం వెయ్యికోట్ల రూపాయలు ప్రతిపాదించాం. మైక్రో ఇరిగేషన్‌ కోసం రూ.600 కోట్లు ఇస్తాం. అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటిత శక్తిగా మార్చటం రైతు బంధు సమితుల ప్రధాన లక్ష్యం. ప్రతి ఐదువేల ఎకరాల క్లస్టర్‌కు ఒక రైతు వేదికను నిర్మిస్తాం. ఒక్కో వేదికకు రూ.12 లక్షల చొప్పున ఈ బడ్జెట్‌లో రూ.350 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. పాడిరైతులకు అందించే ప్రోత్సాహానికి రూ.100 కోట్లు, సాగునీటి పారుదల రంగానికి 2020-21 బడ్జెట్‌లో రూ.11,054 కోట్లు, పశుపోషణ-మత్స్యశాఖకు రూ. 1586.38 కోట్ల ఇవ్వాలని ప్రతిపాదనలు రూపొందించాం’ అని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.

రాజీవ్‌ స్వగృహ ఆస్తులను విక్రయిస్తాం…
‘దేశంలో ఆర్థిక మాంద్యం నేపథ్యంలో రాష్ట్ర సొంత రాబడి సగటు వృద్ధి రేటు 21.5 శాతం ఉంటే ఈ ఫిబ్రవరి మాసాంతారానికి 6.3 శాతానికి తగ్గింది. రియల్‌ ఎస్టేట్‌ రంగం ఉనికిలో లేని దశలో ప్రభుత్వం హౌసింగ్‌బోర్డు, రాజీవ్‌ స్వగృహ లాంటి సంస్థలను ఏర్పాటు చేశాం. ఇప్పుడు వాటి అవసరం లేదు. రాజీవ్‌ స్వగృహ తరహాలో నిరర్థకంగా ఉన్న ఆస్తులను పారదర్శకంగా విక్రయించి ఆదాయాన్ని రాబడుతాం. ఇసుక, ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తాం. 2018-19 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం..రూ.1,57,150.80 కోట్లు ఖర్చయింది. రెవెన్యూ మిగులు రూ.4,337.08 కోట్లు, ద్రవ్యలోటు రూ.26,943.87 కోట్లు ఉంది. 2019-20 సంవత్సరానికి మొత్తం అంచనా వ్యయం రూ.1,42,152.28 కోట్లు కాగా..అందులో రెవెన్యూ వ్యయం రూ.1,10,824.77 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం 13,165.72 కోట్ల రూపాయలు, సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ ఖాతాలో మిగులు రూ.103.55 కోట్లు ఉన్నాయి’ అని మంత్రి హరీశ్‌రావు విడమర్చి చెప్పారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం రూ.2,650 కోట్లు
ఈ బడ్జెట్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం రూ.2,650 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.10,421 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ.1,723.27 కోట్ల ప్రతిపాదనలు రూపొందించామని తెలిపారు. సంపూర్ణ అక్షరాస్యతలో భాగంగా ఈచ్‌వన్‌టీచ్‌కు రూ.100 కోట్లు ఇస్తామని తెలిపారు. విద్యుత్‌ శాఖకు రూ.10,416 కోట్లు ప్రతిపాదించారు. ప్రస్తుత బడ్జెట్‌లో పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం 1998 కోట్లు, ఇండిస్టీయల్‌ ఇన్సెంటివ్స్‌ కోసం రూ.1500 కోట్ల ప్రతిపాదించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో వివిధ దశల్లో 2,72,763 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయనీ, వాటి కోసం 11,917 కోట్ల రూపాయలను ప్రతిపాదించామని హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో వాతావరణ సమతుల్యత కోసం, 33 శాతం అడవుల విస్తరణ కోసం పర్యావరణ, అటవీశాఖకు రూ.791 కోట్లు ప్రతిపాదించారు. దేవాలయాల అభివృద్ధికి రూ.500 కోట్లు, ధూపదీప నైవేధ్యాలకు రూ.50 కోట్ల ప్రతిపాదనలు చేశామని వివరించారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధిలో భాగంగా రూ.750 కోట్లు, కలెక్టరేట్లు, డీపీఓలు, పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణాలను పూర్తి చేసేందుకు రూ.500 కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించామని చెప్పారు. మొత్తంగా రవాణా, రోడ్లు భవనాల శాఖకు ఈ బడ్జెట్‌లో 3,494 కోట్ల రూపాయలను, పోలీస్‌శాఖకు రూ.5,852 కోట్లు ప్రతిపాదించారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఒక్కొక్కరికి రూ.3 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. దీనికిగానూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎస్‌డీపీ నిధుల కోసం రూ. 480 కోట్లు ప్రతిపాదించామని చెప్పారు.

పంచాయతీరాజ్‌కు రూ.23,005 కోట్లు… హైదరాబాద్‌కు భారీగా…
గ్రామీణ ముఖచిత్రాలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర గ్రామీణ విధానం అమలు చేస్తున్నదనీ, అందులో భాగంగానే పంచాయతీరాజ్‌ శాఖకు రూ.23,005 కోట్ల ప్రతిపాదనలు రూపొందించినట్టు మంత్రి హరీశ్‌రావు వివరించారు. పల్లెప్రగతి సక్సెస్‌ అయిందన్నారు. మున్సిపల్‌ శాఖకు ఈ బడ్జెట్‌లో 14,809 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. 38 మున్సిపాల్టీలకు 38 మున్సిపాలిటీ లకు గానూ రూ. 800 కోట్ల ప్రతిపాదనలు చేశారు. హైదరాబాద్‌లో జనాభా పెరిగినంతగా సౌకర్యాల కల్పన జరగలేదనీ, రాజధాని నగర అభివృద్ధికి ఐదేండ్లలో రూ.50 వేల కోట్లు అవసరమని తమ ప్రభుత్వం అంచనా వేసిందని చెప్పారు. హైదరాబాద్‌ నగరం, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధితోపాటు మూసీ నదీ ప్రక్షాళన, మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు కోసం ఈ బడ్జెట్‌లో ప్రత్యేకంగా 10 వేల కోట్ల రూపాయలను ప్రతిపాదించినట్టు తెలిపారు.

సంక్షేమానికి పెద్దపీట
ఆసరా పింఛన్‌ లబ్దిదారులకు ఈ బడ్జెట్‌ లో 11, 758 కోట్ల ప్రతిపాదనలు రూపొందించామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 16, 534.97 కోట్లు- ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి కోసం 9,771.27 కోట్లు, మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం రూ. 1518.06 కోట్లను ప్రతిపాదించారు. కళ్యాణలక్ష్మి కోసం రూ.1350 కోట్లు ఇస్తామన్నారు. ఎంబీసీ కార్పొరేషన్‌ కోసం 500 కోట్లు కేటాయింపులు చేశారు. మొత్తంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం 4,356.82 కోట్ల ప్రతిపాదనలు చేశారు. మహిళా స్వయం సహకార సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.12వందల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు రూపొందించారు.

పూర్తి సమతుల్యత : సీఎం కేసీఆర్‌
ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పూర్తి సమతుల్యతో ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఒక ప్రకటనలో అభిప్రాయ పడ్డారు. ఇది సంక్షేమ తెలంగాణ కోసం రూపొందించిన ప్రగతిశీల బడ్జెట్‌ అని తెలిపారు. ఆదాయ వనరులు, ప్రజల అవస రాలకు అనుగుణంగా వాస్తవాల
ప్రాతిపదికన పద్దును రూపొందించారని ప్రశంసించారు. ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులున్నా యని సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొని, రాబడులు తగ్గి, కేంద్ర నిధుల్లో కోతలు పడినప్పటికీ రాష్ట్రాభివృద్ధి కుంటుపడకుండా ఉండేందుకు వీలుగా ప్రతిపాదనలు రూపొందిం చటం అభినందనీయమని పేర్కొన్నారు. మండలిలో పద్దును ప్రవేశపెట్టిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని, బడ్జెట్‌ రూపకల్పనలో పాలుపంచుకున్న ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును, ఇతర ఉన్నతాధికారులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.

హౌంశాఖ ప్రతిపాదనలకు కోత..!

– రూ.5828 కోట్లు కేటాయింపు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ 2020-21 లో హౌంశాఖకు రూ.5828 కోట్లు కేటాయించింది. ఇందులో మూడు నగర పోలీసు కమిషనరేట్లు, ఇంటెలిజెన్స్‌ , జైళ్ల శాఖకు బడ్జెట్‌లో నిధులను పెంచారు. నగర పోలీసు కమిషనరేట్‌కు గత ఏడాది కంటే 40 కోట్ల రూపాయలను పెంచి ..ఈ దఫా రూ. 899.40 కోట్లు కేటాయించారు. అలాగే ఇంటెలిజెన్స్‌ విభాగానికి గతేడాది రూ.113.90 కోట్లను కేటాయించిన సర్కారు ఈఆర్థిక సంవత్సరానికి గాను నిధులను రూ.186 కోట్లకు పెంచింది. జైళ్ల శాఖకు గత సంవత్సరం రూ.83.77 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ ఏడాది దానిని కొంత మేరకు పెంచి రూ.99.40 కోట్లు కేటాయించింది. అలాగే గ్రేహౌండ్స్‌ విభాగానికి ఈ బడ్జెట్‌లో ఆరు కోట్ల రూపాయలను పెంచి రూ.61.03 కోట్లు కేటాయించింది. మరో వైపు సివిల్‌ డిఫెన్స్‌ విభాగానికి మాత్రం ఆరుకోట్ల రూపాయల మేర కోత పెట్టింది. ఇక కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగానికి గతేడాది కంటే నిధులను రెట్టింపు చేసింది. గతేడాది రూ.12 కోట్లున్న కేటాయింపులను ఈ ఏడాది రెండింతలు చేసి రూ.24.03 కోట్లకు పెంచింది. ఇక సైబరాబాద్‌ కమిషనరేట్‌కు గతేడాది కంటే రూ. 75 కోట్లు పెంచి రూ. 275.04 కోట్లు, రాచకొండ కమిషనరేట్‌కు గతేడాది రూ.191 కోట్లు కేటాయిస్తే…ఈ సారి రూ.286 కోట్లు పెంచింది. అగ్నిమాపక శాఖకు సైతం గతేడాది కంటే నిధులను పెంచారు. అయితే పోలీసు శాఖ సర్కారుకు చేసిన ప్రతిపాదనల కంటే ఈ బడ్జెట్‌లో తక్కువగా కేటాయింపులు చేసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.

Courtesy: NT

RELATED ARTICLES

Latest Updates