దక్షిణాదికి గట్టి దెబ్బ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

బాగా నష్టపోతున్న తొలి రెండు రాష్ట్రాలు కర్ణాటక, కేరళ
తదుపరి స్థానాల్లో తెలంగాణ, ఏపీ

15వ ఆర్థిక సంఘం కొలమానాలలో మార్పు ఫలితం ఇది
మొత్తమ్మీద 20 రాష్ట్రాలకు లాభం… 8 రాష్ట్రాలకు నష్టం
రాష్ట్రాలకు కేంద్రం పంచే పన్నుల వాటా 42% నుంచి 41%కి తగ్గింపు

దిల్లీ : ఊహించినట్లుగానే జరిగింది. కేంద్ర పన్నుల్లో వాటా పంపిణీకి 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని తొలి నుంచి అనుమానించినట్లుగానే కోత పడింది. 15వ ఆర్థిక సంఘం తీసుకున్న విభిన్న కొలమానాల కారణంగా మొత్తం 8 రాష్ట్రాల వెయిటేజీ తగ్గిపోగా, 20 రాష్ట్రాలకు పెరిగింది. వెయిటేజీ తగ్గిపోయిన ఏడింటిలో నాలుగు దక్షిణాది రాష్ట్రాలే. ఉత్తరాది రాష్ట్రాల్లో అసోం, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌లకు వెయిటేజీ తగ్గినా వాటికి పెద్దగా పన్ను నష్టం జరగలేదు. కొత్త కొలమానాల వల్ల 8 రాష్ట్రాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 18,389 కోట్లు నష్టపోతుండగా, అందులో నాలుగు దక్షిణాది రాష్ట్రాల వాటానే రూ.16,640.29 కోట్లు. కొత్త విధానంతో కర్ణాటక అత్యధికంగా రూ.8,367.21 కోట్లు కోల్పోతోంది. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నవి కేరళ (రూ.4,367.88కోట్లు), తెలంగాణ (రూ.2,383.90కోట్లు). దక్షిణాదిలో తమిళనాడు ఒక్కటే లబ్ధిపొందిన రాష్ట్రం. అలాగే అత్యధికంగా మహారాష్ట్ర రూ.4,814 కోట్లు, రాజస్థాన్‌ 3,795.43 కోట్లు, బిహార్‌ రూ.3,105 కోట్ల మేర లాభపడ్డాయి. 15వ ఆర్థికసంఘం కొలమానాల్లో వచ్చిన తేడాలవల్ల 20 రాష్ట్రాలు రూ.32,923.65 కోట్లు లాభ పడుతున్నాయి.

14వ ఆర్థిక సంఘం 29 రాష్ట్రాలకు పన్నుల్లో వాటాను పంచగా, ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో ఆ రాష్ట్రానికి 1% వాటాను పక్కనపెట్టి, మిగిలిన 41%ని  28 రాష్ట్రాలకు పంచాలని 15వ ఆర్థికసంఘం సిఫార్సు చేసింది. ఆ ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకూ కలిపి 7,84,180.87 కోట్లు పంచుతున్నారు.

జనాభా స్థిరీకరణతో ఎక్కువ నష్టం
కుటుంబ నియంత్రణ పాటించడంతో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా స్థిరీకరణ జరిగింది. ఈ కారణంగా అవి ఎక్కువగా నష్టపోవాల్సి వచ్చింది. జనాభా నియంత్రణకు తీసుకున్న చర్యలను పరిగణనలోకి తీసుకున్నా దానివల్ల పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. 2011 జనాభా లెక్కల వల్ల నష్టపోతామని దక్షిణాది రాష్ట్రాలు కూటమిగా ఏర్పడి నిరసన వ్యక్తంచేశాయి. ఆర్థిక సంఘం విధివిధానాలు మార్చాలని ఎలుగెత్తాయి. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం వాటితో గొంతు కలపలేదు. తమకేమీ పెద్దగా నష్టం జరగదని భావించింది. చివరకు చూస్తే దక్షిణాదిలో ఎక్కువ నష్టపోయిన మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
 గత ఏడాదితో పోలిస్తే 2020-21లో తెలంగాణకు వచ్చే కేంద్ర పన్నుల్లో వాటా నికరంగా రూ.809కోట్లు పెరిగినప్పటికీ  కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాను 2.437% నుంచి 2.133%కి తగ్గించడం వల్ల రాష్ట్రం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.2,383.90 కోట్లమేర నష్టపోనుంది.
 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.15,987.59 కోట్లు రాగా, ఈసారి అది రూ.16,726.58 కోట్లకు పెరగనుంది. 14వ ఆర్థికసంఘం సిఫార్సుల ప్రకారం అయితే ఇది రూ.19,110.48 కోట్ల మేర ఉండేది.
 వచ్చే ఆర్థికసంవత్సరంలో తెలంగాణకు కార్పొరేట్‌ ట్యాక్స్‌ కింద రూ.5,145.05 కోట్లు, సెంట్రల్‌ జీఎస్‌టీ కింద రూ.5,062.70 కోట్లు, ఆదాయపన్ను కింద రూ.4,783.97 కోట్లు, కస్టమ్స్‌ కింద రూ.1,044 కోట్లు, యూనియన్‌ ఎక్సైజ్‌ కింద రూ.682.11 కోట్లు, సేవా పన్ను కింద రూ.8.92 కోట్లు లభించనున్నాయి.
 ఏపీకి కార్పొరేట్‌ టాక్స్‌ 9,916.22 కోట్లు, సెంట్రల్‌ జీఎస్‌టీ 9,757.50 కోట్లు, ఆదాయపన్ను 9,220.31 కోట్లు, కస్టమ్స్‌ 2,012.13 కోట్లు, యూనియన్‌ ఎక్సైజ్‌ 1,314.66 కోట్లు, సేవా పన్ను 17.19 కోట్లు లభించనున్నాయి.

తెలంగాణకు రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంట్‌
దిల్లీ: తెలంగాణకు 15వ ఆర్థికసంఘం 2020-21 సంవత్సరానికి ప్రత్యేక గ్రాంట్‌ కింద రూ.723 కోట్లు కేటాయించింది. మొత్తం మూడు రాష్ట్రాలకు కలిపి రూ.6,764 కోట్లు ఈ గ్రాంట్‌ కింద ఇవ్వగా, అందులో అత్యధికంగా కర్ణాటకకు రూ.5,495 కోట్లు, మిజోరాం రాష్ట్రానికి రూ.546 కోట్లు సిఫార్సు చేసింది. ఈ ఏడాది 15వ ఆర్థికసంఘం సిఫార్సుల కారణంగా గత ఏడాదికంటే తక్కువ ఆదాయం పొందుతున్నందుకు ఈ రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంటు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణకు 2019-20లో పన్నులవాటా, రెవెన్యూలోటు కింద రూ.18,964 కోట్లు వెళ్తే ఈసారి అది రూ.18,241 కోట్లకు పరిమితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని, అందుకే ప్రత్యేక గ్రాంటు కింద రూ.723 కోట్లు ఇవ్వాలని ఆర్థికసంఘం సిఫార్సు చేసింది.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates