- కొవిడ్-19 పరీక్షలు, చికిత్సలకు అనుమతి
- హైదరాబాద్, పరిసరాలపై ఫోకస్.. 50 వేల పరీక్షలు
- ‘ప్రైవేటు’కు మార్గదర్శకాలు రూపొందించండి
- సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ లాంటిది. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజూ కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో 50 వేల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రులనే కాకుండా, ప్రైవేటు ల్యాబ్లు, ఆస్పత్రులను కూడా వినియోగించుకోవాలి. హైదరాబాద్ను కాపాడుకోవాలనే ముందుచూపుతో మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్-19 కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రైవేటు ల్యాబ్లు, ఆస్పత్రుల్ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలకు, చికిత్సకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించాలని నిశ్చయించింది. రానున్న వారం, పదిరోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి ముందు కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వెల్లడించారు. ఆదివారం ఆయన కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎంవో ముఖ్యకార్యదర్శి నరసింగరావు, కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, సీనియర్ వైద్యాధికారులు, వైద్య నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రైవేటు ల్యాబ్లు, ఆస్పత్రుల్లో కొవిడ్ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సలకు అవసరమైన మార్గదర్శకాలు, ధరలను నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని అధికారులు సీఎంకు వివరించారు. మరణాల రేటు తక్కువగానూ, కోలుకుంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగానూ నమోదవుతున్నదని చెప్పారు.
అయితే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, ఆ తర్వాతి స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలున్నాయని తెలిపారు. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న ఇతర నాలుగు జిల్లాలపై మరింత ఎక్కువ దృష్టి పెట్టాలని, ఈ ఐదు జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. ‘‘తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ లాంటిది. హైదరాబాద్ ప్రజల ఆరోగ్యం, ప్రగతి, నగరం పేరు ప్రఖ్యాతులను సుస్థిరంగా ఉండేట్లు చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ, హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజూ కేసులు నమోదవుతున్నాయి. దీన్ని పూర్తిస్థాయిలో నివారించాల్సిన అవసరం ఉంది. రానున్న వారం, పదిరోజుల్లో వైరస్ వ్యాప్తి జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లోని ఉప్పల్, ఎల్.బి.నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూర్, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మలక్పేట్, అంబర్పేట్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పుర, బహదూర్పుర, సికింద్రాబాద్, కంటోన్మెంట్, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి.
ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రులనే కాకుండా, ప్రైవేటు ల్యాబ్లు, ఆస్పత్రులను వినియోగించుకోవాలి. ప్రైవేటు హాస్పిటళ్లలో జరిపే పరీక్షలు, చికిత్సకు అవసరమైన మార్గదర్శకాలను, ధరలను అధికారులు నిర్ణయించాలి. పాజిటివ్గా తేలినప్పటికీ వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేనివారికి ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్ను కాపాడుకోవాలనే ముందుచూపుతో మాత్రమే 50 వేల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో, అప్రమత్తతతో ఉందని సీఎం ప్రకటించారు.
Courtesy Andhrajyothi