– భారత్లో అసంఘటితరంగ కార్మికుల బతుకులు మరింత దుర్భరం
– ప్రపంచవ్యాప్తంగా 270 కోట్ల మందిపై పెను ప్రభావం..
– దిగువ, మధ్య తరగతి ఆదాయ దేశాల్లో ప్రమాద ఘంటికలు
– పటిష్టమైన చర్యలు చేపట్టకపోతే అంతే..!
– తీవ్రంగా హెచ్చరించిన ప్రపంచ కార్మిక సంస్థ
జెనీవా : కరోనా మహమ్మారి దెబ్బకు కోలుకోలేక భారత్లో లాక్డౌన్ను పొడిగించా ల్సిందేనని చర్చలు సాగుతున్న నేప థ్యంలో.. ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్వో) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంక్షోభ సమ యంలో దేశంలో అసంఘటితరంగంలో పనిచేస్తున్న సుమారు 40కోట్ల మంది ప్రజలు మునుపెన్నడూ ఎదు ర్కోని తీవ్రమైన పేదరికంలోకి వెళ్లే ప్రమాదము న్నదని హెచ్చరించింది. కరోనా మహమ్మారి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి దుర్బర పరిస్థితులు తీసుకొచ్చిందని పేర్కొంది. పాక్షిక, పూర్తి లాక్డౌన్ లతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి పనులక్కడే నిలిచిపోవడంతో కార్మికులందరూ దిక్కుతో చనివారయ్యరనీ, ఈ పరిస్థితిని అధిగ మించడానికి ప్రపంచదేశాలన్ని కలిసి పటిష్ట చర్యలు చేపట్టకుంటే అది తీవ్ర పరిణామాలకు దారి తీసే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ మేరకు ‘ఐఎల్వో మానిటర్ సెకండ్ ఎడిషన్ కోవిడ్ అండ్ వరల్డ్ ఆఫ్ వర్క్’ అనే నివేదికలో పలు అంశాలను వెలువరించింది. నివేదికలో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. ‘భారత ఆర్థిక వ్యవస్థలో అసంఘటితరంగానిది కీలక పాత్ర. ఇప్పటికే కోవిడ్-19 ఈ రంగంలో ఉన్న పదిలక్షల మంది కార్మికులపై ప్రభావం చూపించింది. ఇవే పరిస్థితులు కొనసాగితే అది పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న 40 కోట్ల మంది ప్రజలు మరింత దుర్బర స్థితిలోకి నెట్టివేయబడే ప్రమాదం పొంచి ఉన్నది. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపైనా పడే ప్రమాదమున్నది. ముఖ్యంగా చిల్లర వర్తకం, ఆహార సేవలు, తయారీ, నిర్మాణరంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నద’ని ఐఎల్వో వివరించింది.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో దాదాపు 81 శాతం మంది కార్మికులు లాక్డౌన్తో పనుల్లేకుండా ఖాళీగా ఉంటున్నారు. ఇది మహా విపత్తు అని ఐఎలోవో అభిప్రాయపడింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం దీన్ని కట్టడి చేయలేక బలవుతున్నాయనీ, ఇక పేద, మధ్య తరగతి దేశాల పరస్థితి మరింత అధ్వానంగా ఉందని తెలిపింది. పాక్షిక, పూర్తి లాక్డౌన్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న సుమారు 270 కోట్ల మందిపై పడనుందని హెచ్చరించింది. ముఖ్యంగా దిగువ, మధ్య తరగతి ఆదాయం ఉన్న దేశాల్లో దీని ప్రభావం అధికంగా ఉండనుందని పేర్కొంది.
ఉద్యోగాల కోతతో పాటు పనిగంటలు తగ్గించడం కూడా ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపనుందని ఐఎల్వో తెలిపింది. 2020 రెండో త్రైమాసికంలో 6.7 శాతం పనిగంటల క్షీణత ఉంటుందనీ, తద్వారా 1.95 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నది.
ఇదే విషయమై ఐఎల్వో డైరెక్టర్ జనరల్ గై రైడర్ స్పందిస్తూ… ‘అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో కార్మికులు, వ్యాపారాలు విపత్తును ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచమంతటికీ పరీక్షా సమయం. దీనిపై మేమంతా కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. అవి కోట్లాది ప్రజల జీవితాలకు సంబంధించినవిగా ఉండాలి. ఒక్క దేశం తప్పుడు నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం అన్నింటి మీదా పడుతుంది. అందుకే పకడ్బందీ చర్యలతో దీన్ని ఎదుర్కోవాలి’ అని తెలిపారు. లేకుంటే రాబోయే ఆర్థిక పరిస్థితులను మనం ఊహించలేని విధంగా ఉంటాయనీ, ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని ఐఎల్వో తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసింది.
Courtesy: NT