– సీఏఏ నిరసనకారుల ఫొటో, పేరు అడ్రస్తో హౌర్డింగ్లు
– ఆస్తులు జప్తుచేస్తామంటూ హెచ్చరిక
లక్నో: లక్నోలో కొత్తరకం హౌరింగ్లు వెలిశాయి. ఉత్తరప్రదేశ్ సర్కార్ స్వయంగా వాటిని ఏర్పాటుచేయించింది. ఇంతకీ ఏమిటా హౌర్డింగ్లు? యూపీ సర్కార్కు ఈ వింత ఆలోచన ఎందుకొచ్చిందో పరిశీలిస్తే.. డిసెంబర్లో లక్నోలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా హింసకు పాల్పడిన నిందితులుగా పేర్కొంటూ కొంతమంది ఫొటో, పేర్లు, చిరునామాలతో యోగి సర్కార్ రాష్ట్ర రాజధాని లక్నోలోని ప్రముఖ కూడళ్లలో వీటిని ఏర్పాటు చేసింది. హింసాకాండలో ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లినందుకుగాను పరిహారం చెల్లించాలని హౌర్డింగ్స్లో పేర్కొన్నారు. త్వరలో నష్టపరిహారం చెల్లించాలనీ, లేదంటే ఆస్తులను జప్తుచేస్తామన్న హెచ్చరిక కూడా అందులో ఉంది. కాగా, చనిపోయిన ఓ వ్యక్తి పేరు కూడా అందులో ఉండటం గమనార్హం. హౌర్డింగ్లలో పేర్లు వున్న చాలా మందికి వారి వ్యక్తిగత ఆస్తులను అటాచ్చేస్తూ ప్రభుత్వం నుంచి ఇప్పటికే నోటీసులు అందాయి. సదాఫ్ జాఫర్, న్యాయవాది మహమ్మద్ షోయబ్, నాటకరంగ ప్రముఖులు దీపక్ కబీర్, ఐపీఎస్ మాజీ అధికారి ఎస్ఆర్ దారాపురి తదితర రాజకీయ, సామాజిక కార్యకర్తల ఫొటోలు ఆ హౌర్డింగ్స్లో వున్నాయి. సీఏఏ నిరసనల సందర్భంగా అరెస్టయిన వీరంతా ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. వారు దోషులుగా పేర్కొనటానికి పోలీసుల వద్ద తగిన సాక్ష్యాలు, ఆధారాలు లేవనీ వీరి బెయిల్ పిటిషన్ సందర్భంగా కోర్టు ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యానించింది.
‘అనైతిక చర్య‘
‘నేను పరారీలో లేను… మమ్మల్ని దోషులుగా చేస్తూ మా పేర్లు, చిరునామాలు, ఫొటోలతో హౌర్డింగ్లు పెట్టటం దారుణం… ఇది అనైతిక చర్య’ అని సదాఫ్ జాఫర్ వ్యాఖ్యానించారు. ‘మమ్మల్ని అరెస్టు చేశారు, దాడి చేశారు, జైలుకు పంపారు, తరువాత బెయిల్ ఇచ్చారు. మాపై ఒత్తిడి తెచ్చే కొత్త వ్యూహం ఇది. జైలులో వుండగానే నాకు రికవరీ నోటీసు వచ్చింది. జైలు సూపరింటెండెంట్ ద్వారా నేను ప్రభుత్వానికి ఒక లేఖ పంపాను. దానికి ఇంత వరకూ సమాధానం రాలేదు’ అని దీపక్ కబీర్ అన్నారు.
‘మా చిరునామాలు ప్రభుత్వానికి తెలుసు, మాకు నోటీసు పంపింది. అప్పుడు ఇది ఏమిటి? ఉద్యమకారుల్లో భయాన్ని సృష్టించటానికే యోగి సర్కార్ ఈ హౌర్డింగ్ లను పెట్టించిందా? అదే నిజమైతే.. ఏ ప్రభుత్వమైన మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది?’ అని కబీర్ ప్రశ్నిం చారు. ఓ వ్యక్తికి జారీచేసిన ఆస్తుల జప్తు నోటీసులను నిలిపివేస్తూ అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరిలో ఆదేశాలు జారీచేసింది. ప్రత్యేక కేసులో ఇటువంటి నోటీసుల ప్రామాణికతను ఇప్పటికే సుప్రీంకోర్టు పరిశీలిస్తున్నదనీ, అందువల్ల ఆ నోటీసులను నిలిపివేస్తున్నట్టు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. యోగి ఆదిత్యనాథ్ సూచనల మేరకు లక్నోలో హౌర్డింగ్లు పెట్టామని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Courtesy Nava telangana