కరోనా బారిన పడి.. ఆ సంక్షోభాన్ని భరించి బయటపడ్డ వారి అనుభవాలను మీ ముందుకు తెస్తోంది.. విజేత
కరోనా ఉందనగానే భయపడ్డా..
బాధ్యతలు గుర్తించి, జాగ్రత్తలు పాటించాలి
కరోనాను జయించిన మహిళ మనోగతం
హైదరాబాద్ సిటీ: కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసిన మరుక్షణం కాళ్ల కింద భూమి లేదన్నట్లు అనిపించింది. అసలే పేద కుటుంబం, నలుగురు పిల్లలు. ఎన్నో బాధ్యతలు ఉన్న నాకు కరోనా సోకిందనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయా’ అన్నారు కరోనాను జయించిన 48 ఏళ్ల మహిళ. ‘14 రోజులు ఆస్పత్రిలో ఉన్న రోజులన్నీ ఓ యుగంగా గడిచాయి. కోలుకుంటానా లేదా అనే అనుమానంతో నిద్రలేని రాత్రులు గడిపాను. ఎలాగోలా అల్లాహ్ దయతో కోలుకుని, పిల్లల వద్దకు చేరుకున్నాను. ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండటంతో పాటు పిల్లలను కాపాడుకుంటున్నా’ అన్నారు. కరోనా సృష్టించిన కల్లోలాన్ని అనుభవించిన తాను పలువురికి అవగాహన కల్పిస్తున్నానని అంటున్నారు. అయినా, కొందరు అనర్థాన్ని అర్థం చేసుకోవడం లేదని, జాగ్రత్తలు పాటించకుండా తిరుగుతుండటం బాధగా ఉంది అన్నారు. బహదూర్ పురాకు చెందిన ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో తన అనుభవాలను పంచుకున్నారు.
ఆరోగ్య సమస్యలతో..
వయస్సుతోపాటు వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా యి. ఏటా రంజాన్ మాసానికి ముందు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటాను. ఈ ఏడాది మార్చి చివరివారంలో కాస్త అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లాలనుకున్నాను. లాక్డౌన్ కారణంగా కుమారుడితో కలిసి బైక్పై రెండు రోజులు బయటకు వచ్చినా, పోలీసులు వెళ్లనివ్వలేదు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినా వినలేదు. మూడో రోజు జ్వరం, దగ్గు ప్రారంభమైంది. మా అబ్బాయికి అనుమానం వచ్చి.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసులను ప్రాధేయపడుతూ మలక్పేట లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆస్పత్రి వర్గాలు అనుమా నం వ్యక్తం చేయగా, నేరుగా కింగ్ కోఠి ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ అడ్మిట్ చేసుకున్నారు. కళ్ల నిండా నీళ్లతో నా కుమారుడు ఆస్పత్రిలో వదిలి వెళ్లాల్సి వచ్చింది. అతడికి ధైర్యం చెప్పినా, నా మనస్సులో ఏదో బాధ.. వెలితి, ఆందోళన. ఆస్పత్రిలో చేరిన విషయం తెలియగానే నగరంలో, ఇతర దేశాల్లో ఉన్న సోదరులు, చెల్లెళ్లు, బంధువులు ఫోన్ చేయసాగారు. ప్రతి ఫోన్లో ఏడుపు ఆగడం లేదు. పరీక్షల్లో పాజిటివ్గా తేలింది. దీంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.
జాగ్రత్తలు తీసుకోవాలి
ఆస్పత్రి నుంచి క్షేమంగా ఇంటికి వచ్చినా.. ఇంటి నుంచి దూరంగా, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో కాలం గడపడం నరకం లాంటిదే. అలాంటి దుస్థితి రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు పాటించడమే ఉత్తమం. చిన్న పిల్లల తల్లులు, బాధ్యతలున్న పెద్దలు పడుతున్న వేదన చూశాను. ఇప్పటికీ అవకాశమున్నందున జాగ్రత్తలు పాటించి కరోనాను తరిమేయడంపై అందరూ దృష్టి సారించాలి.
Courtesy Andhrajyothi