న్యూఢిల్లీ : ఆర్థికమాంద్యానికి తోడు కరోనా మహమ్మారి దెబ్బకు వర్ధమాన దేశాల ఆర్థికవ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. ముఖ్యంగా అత్యధిక జనాభా గల భారత్లో నిరుద్యోగం విలయతాండవం చేస్తున్నది. భారత్లో ఉపాధి, ఆదాయాన్ని కోల్పోయినవారిలో అత్యధికులు..సాధారణ కార్మికులు, స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్నవారే ఉన్నారని ‘అంతర్జాతీయ కార్మిక సంఘం’ (ఐఎల్ఓ) ఇటీవల ఒక నివేదికలో తెలిపింది. దేశంలో సాధారణ కార్మికులుగా పనిచేస్తున్నవారిలో అత్యధికులు మహిళలే ఉన్నారని, కాబట్టి పురుషులతో పోల్చుకుంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉపాధి కోల్పోయారని ఐఎల్ఓ తెలిపింది. ఉపాధిపై కోవిడ్ సంక్షోభ ప్రభావం…అనే అంశంపై రూపొందించిన నివేదికలో పేర్కొన్న కీలక అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
అత్యధికశాతం…తాత్కాలిక ఉపాధి 2020 జనాభా లెక్కల ప్రకారం భారత్లో 11.8కోట్లమంది సాధారణ కార్మికులుగా పనిచేస్తున్నారు. మొత్తం కార్మికశక్తిలో వీరి వాటా 25శాతం. 24.6కోట్లమంది స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్నారు. ఈ రెండు విభాగాల్లోనూ పురుషుల కన్నా మహిళలే ఎక్కువ సంఖ్యలో పనిచేస్తున్నారు. అయితే ఆర్థికమాంద్యం, లాక్డౌన్, కరోనా మహమ్మారి వీరి జీవితాల్ని తలకిందులు చేసింది. ఉపాధిరంగంలో శాశ్వత ఉపాధిని పురుషులు ఎక్కువ సంఖ్యలో కలిగివుండగా, తాత్కాలిక ఉపాధిని మహిళలు ఎక్కువ సంఖ్యలో కలిగివున్నారు. ఈ సంక్షోభం కారణంగా పురుషుల కన్నా ఎక్కువ సంఖ్యలో మహిళలు ఉపాధిని కోల్పోయారన్నది తమ అధ్యయనంలో తేలిందని ఐఎల్ఓ తెలిపింది.
మహిళల ప్రాతినిథ్యం…సరిపోదు
ప్రపంచబ్యాంకు నివేదిక ప్రకారం, ఆయా దేశాల్లోని కార్మిక శక్తిలో మహిళల ప్రాతినిథ్యం ఈ విధంగా ఉంది. భూటాన్లో 58.3శాతం, నేపాల్లో 81.6శాతం, చైనాలో 60.63శాతం, బంగ్లాదేశ్లో 36.14శాతం, మయన్మార్లో 47.54శాతం, శ్రీలంకలో 34.75శాతం ఉండగా, భారత్లో మాత్రం 23.41శాతానికి (2019) పరిమితమైంది. పాకిస్తాన్లాంటి దేశాల్లో సైతం మహిళా కార్మికశక్తి క్రమంగా పెరుగుతున్నదని నివేదిక తెలిపింది.
లింగ అసమానతలు, మహిళల ఉపాధి సమస్య ఈ స్థాయిలో ఉంటే భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల(సుమారుగా రూ.350లక్షల కోట్లు)కు ఎలా చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టడానికి ప్రధాని మోడీ భారీ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించటం ఒక్కటే సరిపోదని, సమాజంలో మహిళలు, వలసకార్మికులు, అణగారిని వర్గాల సంక్షేమంపై దృష్టిసారించాలని వారు సూచిస్తున్నారు. కరోనా సంక్షోభం నుంచి ఆయా వర్గాల్ని కాపాడాల్సి బాధ్యత ప్రభుత్వాలపై ఉందని వారు అన్నారు. సామాజికరంగంలో బడ్జెట్ వ్యయం పెరగటం ద్వారా మహిళల ఉపాధి మెరుగుపడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
Courtesy Nava telangana