– అందులోనూ 90 శాతం మంది కానిస్టేబుళ్లే
– తెలంగాణలో ఐదు శాతానికంటే తక్కువ
– ఫైళ్ల నిర్వహణ, ఎఫ్ఐఆర్ల నమోదుకే పరిమితం..
– ఆడ పోలీసుల లేమితో.. లైంగికదాడులను వెల్లడించలేకపోతున్న బాధితులు
న్యూఢిల్లీ : ఆకాశంలో సగమని కీర్తిస్తున్న మహిళలు.. ఉద్యోగాలు, రాజకీయాలు, ఇతర రంగాల్లో మాత్రం తీవ్ర వివక్షకు గురవుతున్నారు. దేశ పౌరుల భద్రతకు సంబంధించి కీలక విభాగంగా ఉన్న పోలీసు డిపార్ట్మెంట్లో అయితే ఇది మరీ తీవ్రంగా ఉన్నది. దేశవ్యాప్తంగా మహిళా పోలీసులు కేవలం ఏడు శాతం మాత్రమే ఉన్నారు. దీంతో సామాన్య మహిళలు తమ బాధలు చెప్పుకోవడానికి పోలీస్స్టేషన్లకు వెళ్లినా వారికి అక్కడా న్యాయం అందడం లేదు. ఒక్క తమిళనాడులో మినహా (15 శాతానికి పైగా) మిగిలిన రాష్ట్రాలన్నింటిలోనూ మహిళా పోలీసులు పదిశాతం కంటే తక్కువగా ఉన్నారని ‘స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా రిపోర్టు 2019’ వెల్లడించింది. తెలంగాణలో ఇది ఐదు శాతాని కంటే తక్కువగా ఉండటం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
నివేదిక ప్రకారం.. దేశంలో కేవలం 7.28 శాతం మంది మాత్రమే మహిళా పోలీసులున్నారు. వీరిలో 90 శాతం మంది కానిస్టేబుళ్లుగానే ఉండగా.. ఒక్క శాతం మంది మాత్రమే అత్యున్నత స్థాయిలో సేవలందిస్తున్నారు. మహిళా పోలీసుల నియామకంలో రిజర్వేషన్లు ఉన్నా.. 20 రాష్ట్రాలు మాత్రం ఈ నిబంధనలను పాటించడం లేదు. కాగా, పోలీసులుగా ఎంపికైన మహిళలను స్టేషన్లకే పరిమితం చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ల నమోదు, ఫైళ్ల నిర్వహణ, స్టేషన్కు వచ్చే ప్రజలతో మాట్లాడటం వంటివే తప్ప బందోబస్తు, కేసుల దర్యాప్తు, విచారణ, పెట్రోలింగ్ చేయడానికి వారికి ఆస్కారం కల్పించడం లేదు. అంతేగాక ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న మహిళలు కూడా స్టేషన్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పని ప్రదేశంలో వారికి సరైన సదుపాయాలు, లైంగిక వేధింపులకు గురైతే ఫిర్యాదు చేసుకునే ప్రత్యేక సెల్ వంటివి కూడా అందుబాటులో లేవు.
మహిళా పోలీసులెందుకు..?
గతంతో పోలిస్తే దేశవ్యాప్తంగా మహిళలపై లైంగికదాడులు నానాటికీ పెరిగిపోతున్నాయి. వీటితో పాటు గృహహింస, విద్యార్థినులపై ఈవ్టీజింగ్, పని ప్రదేశాలలో మహిళలపై వేధింపుల కేసులూ అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చినప్పుడు సైతం అక్కడా తామెదుర్కొన్న వేధింపులను నిర్భయంగా చెప్పలేకపోతున్నారు. మగ పోలీసులుండటంతో వారికి తమ బాధలు చెప్పుకోలేక ఎక్కువ మంది మహళలు పోలీస్స్టేషన్ల వైపు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. లైంగికదాడుల గురించి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితులపై పోలీసులే అఘాయిత్యానికి పాల్పడుతున్న ఘటనలతో వారు మరింత భయాందోళనకు గురువుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2018 నివేదిక ప్రకారం.. మహిళలపై జరుగుతున్న 99 శాతం లైంగికదాడులు, వేధింపుల కేసులు నమోదుకావడం లేదు. అదే మహిళా పోలీసులుంటే బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. అభివృద్ధి చెందిన 39 దేశాల్లోని డేటాను విశ్లేషించినప్పుడు ఈ విషయం తేటతెల్లమైంది. అక్కడ మహిళా పోలీసులను ఎక్కువమందిని నియమించడంతో లైంగికదాడులు, స్త్రీలపై వేధింపులు వంటి కేసుల్లో పురోగతి కనిపిస్తున్నదని యునైటైడ్ నేషన్స్ (యూఎన్) ‘ప్రోగ్రెస్ ఆఫ్ ది వరల్డ్స్ ఉమెన్ : ఇన్ పర్స్యూట్ ఆఫ్ జస్టిస్’ నివేదిక గతంలో వెల్లడించింది.
చేరకపోవడానికి కారణాలు..!
‘పోలీసు వ్యవస్థ అంటేనే మగవాళ్ల ఆధిపత్యం అని ఓ వాదన. మహిళలు ఈ వృత్తిలో నెగ్గుకురాలేరు. అంతేగాక దేహదారుడ్యం, కుటంబపరమైన ఒత్తిళ్లు కూడా వారిని ఈ రంగంవైపునకు రాకుండా అడ్డంకిగా ఉన్నాయని’ పోలీసులపై ప్రజల ధోరణి అనే పేరు మీద గతేడాది నిర్వహించిన ఓ నివేదిక వెలువరించింది. అయితే ముఖ్యంగా డ్యూటీ టైమ్ విషయంలోనే మహిళలు వెనుకడుగు వేస్తున్నారని ఎక్కువ మంది అభిప్రాయంగా ఉన్నది. సాధారణంగా పోలీస్ డ్యూటీ అంటేనే 24 గంటలు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ, రాత్రి వేళల్లో స్టేషన్లలో ఉండటానికి మహిళలు ఆసక్తి చూపడం లేదు. ఇలా డ్యూటీ చేసే మహిళలు పలు సందర్భాల్లో లైంగికదాడులకు గురైన ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి. దీంతోపాటు పైస్థాయి అధికారుల నుంచి వేధింపులు, లింగ వివక్ష కూడా ఓ కారణమని వారు చెబుతున్నారు. అయితే, కొంతకాలంగా ఈ పరిస్థితిలో కొంత మార్పు కనబడుతున్నది. గతంతో పోలిస్తే పోలీసు ఉద్యోగాల్లో చేరడానికి మహిళలు ఆసక్తి చూపుతుండటం శుభ పరిణామం.
పోలీస్స్టేషన్లలో ఎక్కువ మంది ఆడ పోలీసులుంటేనే అక్కడకు వచ్చే మహిళలకు సత్వర న్యాయం జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళా పోలీసులను ఎక్కువమందిని నియమిస్తే సమన్యాయానికి ఆస్కారముంటుందని వారు చెబుతున్నారు. ఇది పోలీసు వ్యవస్థకూ మంచిదని వారు సూచిస్తున్నారు.
Courtesy Nava telangana..