”నేను ఎందుకు జైల్లో ఉన్నానో నాకే తెలియదు!
నా ఇద్దరు పిల్లలు, భార్య, తల్లి, నా సోదరులు, సోదరి నన్ను ఎప్పుడు చూస్తారో తెలియదు! నేను నా వైద్యవత్తిని ఎప్పుడు తిరిగి చేపట్టగలనో తెలియదు! నా సహౌదరులందరితో కలిసి కరోనాపై పోరాటంలో ఎప్పుడు పాల్గొంటానో తెలియదు! …” ఇంతలా నిరాశ పూరితమైన ఈ వ్యాఖ్యలు డాక్టర్ ఖఫీల్ ఖాన్ జూలై నెలలో జైలు నుంచి రాసిన లేఖలోనివి. ఎందుకు ఇంత నిరాశ పూర్వకంగా రాశాడంటే సాధారణంగా ”ఆలస్యంగా జరిగే న్యాయం అన్యాయంతో సమానం” అనేది అందరికీ తెలిసిందే. ఖఫీల్ ఖాన్కు న్యాయం అందుబాటులోకి రావడం లేదు. వస్తుందన్న నమ్మకం కలగడం లేదు. దానివల్లే ఈ నిరాశ, నిస్పహ. ఇంతకీ ఎవరీ ఖఫీల్ ఖాన్? కరుడు కట్టిన నేరస్తుడా? హంతకుడా? వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి, ప్రజాధనం కొల్లగొట్టి దేశం విడిచి పారిపోబోయిన అవినీతి పరుడా? అంటే అదీకాదు.
అది తెలియాలంటే అని జీవితంలోకి తొంగి చూడాల్సిందే. 2020 జనవరి 29న ముంబై ఎయిర్పోర్ట్లో అకస్మాత్తుగా అరెస్టు చేయబడిన డాక్టర్ ఖఫీల్ ఖాన్ను ఇప్పటివరకు కుటుంబ సభ్యులు కలవలేకపోయారు. కనీసం కండ్లతో చూడలేకపోయారు. ముంబైలో అరెస్టు అనంతరం ఆయన కుటుంబ సభ్యులు బెయిల్కోసం చేయని ప్రయత్నాలు లేవు. కనీసం కలవడానికి చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు. దీనితో ఆందోళన చెందిన ఖఫీల్ ఖాన్ తల్లి, 65ఏండ్ల వద్ధురాలు సుజాత్ పర్వీన్ 2020 ఫిబ్రవరి 28న హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికీ 175రోజుల నుంచి పిటిషన్పై విచారణ సాగుతూనే ఉంది. ”ఆలస్యంగా జరిగే న్యాయం అన్యాయంతో సమానం” కదా! ఖఫీల్ ఖాన్ విషయంలో అదే జరుగుతోంది.
డాక్టర్ ఖఫీల్ ఖాన్ ఉత్తరప్రదేశ్లోని గోరక్పూర్లో మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. మణిపాల్ మెడికల్ కాలేజీ విద్యార్థిగా ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్నాడు. గాంగ్టాక్లో పసిపిల్లల వైద్యునిగా ఎండీ పట్టా పొందాడు. వైద్యశాస్త్రంపై పరిశోధన చేసి రెండు పుస్తకాలు రాసిన మేధావి. 2016లో గోరక్పూర్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బాబా రఘువరదాస్ (బి.డి.ఆర్) మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతలు స్వీకరించాడు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా హాస్పిటల్ కూడా ఉంది.
ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో వైద్య వృత్తిని చేపట్టాడు. భార్య కూడా డెంటల్ డాక్టర్. ఇద్దరు పిల్లలతో సంతోషంగా సాగిపోతున్న పిల్లల డాక్టర్ ఖఫీల్ ఖాన్ జీవితం 2017 ఆగస్టులో పెద్ద కుదుపుకు గురైంది. ఆగస్టు 7నుంచి 13వరకు 7రోజుల వ్యవధిలో బి.డి.ఆర్ పిల్లల దవాఖానాలో 175మంది పసిపిల్లలు చనిపోయారు. దేశవ్యాప్తంగా ఒక సంచలన వార్తగా ముందుకు వచ్చింది. అయితే ఆ పిల్లల మరణాలకి ఆక్సిజన్ అందక పోవడమే కారణం అని బయటపెట్టిన వ్యక్తి డాక్టర్ ఖఫీల్ ఖాన్.
బి.ఆర్.డి హాస్పిటల్కి ఆక్సిజన్ సరఫరా చేసే కాంట్రాక్టర్కు అరవై ఎనిమిది లక్షల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నందున ఆక్సిజన్ సరఫరా నిలిపివేశాడు. ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆక్సిజన్ అందక పసిపిల్లలు చనిపోయారని బయటి ప్రపంచానికి డాక్టర్ ఖఫీల్ఖాన్ ద్వారానే తెలిసింది. తన సొంత డబ్బులతో ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించి పసిపిల్లల జీవితాలను కాపాడటానికి ఖఫీల్ ఖాన్ ప్రయత్నం చేశాడు.
పసిపిల్లల ఆరోగ్యం పట్ల యోగి ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. యోగి ప్రభుత్వం డొల్లతనం బయటపడింది. ఆవులకి అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నామని హడావుడి చేసిన యోగి ప్రభుత్వం కనీసం చిన్న పిల్లలకి ఆక్సిజన్ అందించలేక పోయిందనే విమర్శని తట్టుకోలేకపోయింది. ఖఫీల్ ఖాన్ వల్లనే ఈ సంఘటన బయట పడింది కాబట్టి ఆయనపై ప్రభుత్వం కక్ష పెంచుకున్నది. వేధించడం మొదలుపెట్టారు. డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్నాడని ఆగస్టు 22న ఖఫీల్ ఖాన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆగస్టు 23న అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో కేస్ బుక్ చేశారు, సెప్టెంబరు 2న అరెస్టు చేసి జైల్లో పెట్టారు. విచారణ పేరుతో ఖఫీల్ ఖాన్ పెద్ద సోదరున్ని పదే పదే అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగేలా చేశారు. ఆయన వ్యాపారం దెబ్బ తిన్నది. చిన్న సోదరున్ని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. పసి పిల్లల డాక్టర్గా, పిల్లల తండ్రిగా, మానవత్వం ఉన్న మనిషిగా ఖఫీల్ఖాన్ జరిగిన లోపం గురించి మాట్లాడినందుకు ఉద్యోగం కోల్పోయి, జైలు పాలయ్యాడు. ఆయన తమ్ముడినీ గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు అన్న విచారణ పేరుతో ఆర్థికంగా దెబ్బతిని పోయాడు. మొత్తం కుటుంబం సంక్షోభంలో కూరుకుపోయింది. ”సత్యమేవ జయతే” అనే నినాదమే ప్రధానమైన మన దేశంలో సత్యం మాట్లాడినందుకు ఎన్ని కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది..!
తొమ్మిది నెలల జైలు జీవితం అనంతరం 2018 ఏప్రిల్ 27న ఖఫీల్ ఖాన్కు బెయిల్ దొరికింది. ఖఫీల్ఖాన్ ఉద్యోగంలో నిర్లక్ష్యంగా ఉన్నాడని, అవినీతికి పాల్పడ్డారని చేసిన ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు ప్రభుత్వం కోర్టుకు సమర్పించ లేకపోయింది. దీంతో ఖఫీల్ ఖాన్కి బెయిల్ దొరికింది. ఖఫీల్ ఖాన్పై ఆరోపణలను నిగ్గు తేల్చడం కోసం నియమించిన విచారణ కమిటీ 2019 సెప్టెంబర్ 27న ఖఫీల్ ఖాన్కు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీనిని జీర్ణించుకోలేక పోయింది. మరుసటి రోజే అంటే సెప్టెంబర్ 28న ప్రెస్మీట్ పెట్టి విచారణ కమిటీ రిపోర్టును ఖండించింది. అక్టోబర్ 3న కొత్త ఆరోపణలు చేస్తూ డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీకి ఆదేశం ఇచ్చింది. తన తప్పును అంగీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. పైగా ఖఫీల్ ఖాన్ను వదిలి పెట్టకూడదు అనే ధోరణితో ప్రభుత్వం ఉంది. ఇది జరుగుతున్న క్రమంలోనే మరోవైపు పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా 2019 డిసెంబర్ 19న అలీఘడ్లోని జామియా మిలియా యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళనలో ఖఫీల్ ఖాన్ పాల్గొని మద్దతుగా ప్రసంగించాడు.
యోగి ప్రభుత్వం అప్పటికే ఖఫీల్ ఖాన్ను వెంటాడుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తోడయింది. సీఏఏకు వ్యతిరేక ఆందోళనలో ప్రసంగించడంతో విద్వేషాలు రెచ్చగొట్టి దేశంలో అంతర్గత భద్రతకు ప్రమాదకారిగా తయారయ్యాడని జామియా మిలియా యూనివర్సిటీలో ప్రసంగించిన 45రోజుల తర్వాత జాతీయ భద్రతా చట్టం (ఎన్.ఎస్.ఎ) కింద కేసుపెట్టి అరెస్ట్ చేసింది.
సీఏఏ సందర్భంగా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన కపిల్శర్మ, అనురాగ్ ఠాకూర్, అనంత కుమార్ హెగ్డే, కల్ రాజు మిశ్రా ఇంకా ఎంతోమంది బీజేపీకి చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు విద్వేష ప్రసంగాలు చేసి ఎలాంటి కేసులు లేకుండా యదేచ్ఛగా బయట తిరుగుతున్నారు. కానీ సీఏఏ వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్న వారిని, అందులో మాట్లాడిన వారిని జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి వేధింపులకు పాల్పడడం అనేది కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ, అప్రజాస్వామిక ధోరణికి ఇది నిదర్శనం. ఖఫీల్ ఖాన్ కూడా సీఏఏ వ్యతిరేక ఆందోళనలో పాల్గొనడంతో బీజేపీ ప్రభుత్వాలకి ఒక సాకు దొరికింది. ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రెండూ కూడబలుక్కొని ఖఫీల్ ఖాన్ మెడకు ఉచ్చు బిగించాయి. తమ అభీష్టానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదు అనే పద్ధతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్షగట్టి ఖఫీల్ఖాన్ బయటకి రాకుండా, బెయిల్ దొరకకుండా, కుటుంబాన్ని కలవకుండా చేస్తున్నాయి.
2020 జనవరి 29న అరెస్టయిన ఖఫీల్ ఖాన్కి అలీగడ్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ జస్టిస్ కరుణా సింగ్ ఫిబ్రవరి 10న బెయిల్ మంజూరు చేశారు. అయితే మధుర జైలు అధికారులు విడుదల చేయడానికి నిరాకరించారు. దీంతో కేసు అలీఘడ్ జిల్లా మెజిస్ట్రేట్ జస్టిస్ చంద్ర భూషణ్ సింగ్ వద్దకు వెళ్ళింది. ఆయన కస్టడీని మే 13వరకు పొడిగించారు. ఆ తర్వాత కేసు ఆగస్టు 13కు, ఆగస్టు 13 నుంచి మరల నవంబర్ 13కు వాయిదా పడింది. అంటే మరో మూడు నెలలపాటు జైల్లో ఉండక తప్పదు. దేశంలో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ఆ తరువాత కూడా న్యాయం జరుగుతుందా అనేది ఒక సందేహంగానే ఉంది.
అలహాబాద్ హైకోర్టులో వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా అంతులేని సీరియల్ లాగా సాగుతూ పోతుంది. కనీసం కుటుంబ సభ్యులు ఖఫీల్ ఖాన్ను చూడటానికి కూడా అవకాశం లేకుండా ప్రభుత్వం చేస్తున్నది. ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి సహజ న్యాయ సూత్రాలకి రాజ్యాంగ బద్దమైన హక్కులకి పూర్తి విరుద్ధంగా ఉన్నది. దీనిని కేవలం ఒక ఖఫీల్ ఖాన్ కుటుంబానికి సంబంధించిన సమస్యగా మాత్రమే చూడరాదు. దేశంలోని ప్రజలందరి రాజ్యాంగ బద్దమైన, ప్రజాస్వామిక హక్కులకు సంబంధించిన సమస్యగా చూడాలి. ప్రజాస్వామిక వాదులు ప్రతి ఒక్కరు ఖండించాలి.
మహమ్మద్ అబ్బాస్
సెల్:9490098032