ఎ. కృష్ణరావు
తండ్రి అడుగుజాడల్లో ఆమె జర్నలిస్ట్ అయ్యారు…రచయిత్రిగా రైతులూ, పేదల బతుకులకు అద్దం పట్టారు…చిత్రకారిణిగా, ఛాయాగ్రాహకురాలిగా గ్రామీణ ప్రాంతాల దుస్థితిని కళ్ళకు కట్టారు…వ్యవసాయ కుటుంబాల్లో మహిళల తరఫున గొంతు వినిపిస్తున్నారు…దేశ విదేశాల్లో ప్రదర్శనలు పెట్టి, వారికి సాయం అందిస్తున్నారు… ఢిల్లీలో స్థిరపడిన తెలుగు మహిళ కోట నీలిమది తెలుసుకోవాల్సిన పయనం…
మన దేశంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే అందరూ అతని గురించే మాట్లాడతారు కానీ ఆ రైతు భార్య గురించి మాట్లాడరు. ఒక రైతు మరణిస్తే ఆమెపై ఆ ప్రభావం ఎలా ఉంటుంది? ఈ పితృస్వామ్య సమాజంలో ఆమె ఎలా మనుగడ సాగిస్తుంది? భర్త ఉన్నా, లేకపోయినా రైతు కూలీగా పనిచేయక తప్పనప్పుడు ఆమె పిల్లల పరిస్థితి ఏమిటి? ముఖ్యంగా చనిపోయిన రైతు కుటుంబంలోని ఆడపిల్లలు సమాజంలో ఎటువంటి కష్టాల్ని ఎదుర్కొంటారు? అసలు మన దేశంలో గ్రామీణ స్త్రీల గురించి ఆలోచించి విధానాలు ఎందుకు రూపొందించడం లేదు? రైతన్నల గురించే కానీ రైతక్కల గురించి మాట్లాడరా? ఇవన్నీ నాలో కదిలిన ప్రశ్నలు. సమాజానికి నేను వేస్తున్న ప్రశ్నలు.
వాస్తవాలు తెలిసేసరికి….నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో! మా నాన్నగారు కోట వెంకట సుబ్బరామశర్మ. ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికకు సంపాదకుడుగా ఉండేవారు. ఆయన కృష్ణాజిల్లా నుంచి కొన్ని దశాబ్దాల క్రితమే ఢిల్లీ వచ్చారు. తెలుగు భాష అంటే ఆయనకు ఎంతో ప్రేమ. అందుకే మాకు తెలుగు నేర్పించారు. కానీ నేను ఢిల్లీ వాసిగానే మిగిలిపోయాను. చిన్నప్పటి నుంచీ నాకు సాహిత్యం, కళల మీద ఇష్టం కలిగించింది మా నాన్నగారే. చదువు పూర్తయిన. తరువాత ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’, సండే గార్డియన్’ పత్రికల్లో పొలిటికల్ ఎడిటర్గా పని చేశాను. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, ముఖ్యంగా పేద మహిళల దుఃస్థితి గురించి తెలుస్తున్న వాస్తవాలు నన్ను కుదిపేశాయి.
సామాజిక బాధ్యతగా…మనకు స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. 1995 నుంచి 2016 వరకు మన దేశంలో మూడు లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క మహారాష్ట్రలోనే 69,642 మంది రైతులు నేలకొరిగారు. వారిలో అత్యధికులు మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాలవారు. మనకు ఈ రైతుల గురించే తెలుసు. కానీ ఈ రైతుల కుటుంబాలు, ముఖ్యంగా వారి జీవిత భాగస్వామి గురించి ఏమైనా తెలుసా? ఒక రైతు మరణిస్తే ఆ కుటుంబం భారాన్ని మోయాల్సిన అతని భార్య, ఆ ఇంట్లోని అమ్మాయిలు ఈ పితృస్వామ్య వ్యవస్థలో ఎదుర్కొనే దుర్భర పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నామా? అందుకే నేను అటువైపు దృష్టి సారించాలనుకున్నాను. ఒక జర్నలిస్టుగా, రచయితగా, కళాకారిణిగా దీన్ని నా సామాజిక బాధ్యతగా స్వీకరించాను.
అప్పులు తీర్చలేక…రైతాంగ సంక్షోభం ఉన్నట్టు నా దృష్టికి వచ్చిన చోటికల్లా వెళ్లాను. మహారాష్ట్ర తర్వాత ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నది తెలంగాణలో! నల్గొండ జిల్లాలోని వింజమూరులో భర్త చనిపోయిన నాలుగేళ్లకు, 2017లో యాదమ్మ అనే మహిళ అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంది. తనకున్న నాలుగు ఎకరాల్లో పత్తి పండించిన ఆమె గిట్టుబాటు ధర లభించకపోవడంతో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూరం గ్రామానికి చెందిన జోగు సర్వమ్మ కూడా ఇవే పరిస్థితుల్లో బలవన్మరణానికి పాల్పడింది. ‘రైతు బంధు’ వంటి పథకాలు ఉన్నా… అవి వారికి చేరవు. గ్రామాల్లో స్త్రీలు చదువుకున్నా తగిన ఉద్యోగాలు లేవు. ఈ పరిస్థితులను వివరిస్తూ వివిధ ఆంగ్ల పత్రికల్లో వ్యాసాలు రాశాను. తెలంగాణ గ్రామీణ సంక్షోభంపై ఏకంగా ఒక నివేదిక రూపొందించాను.
రైతులే నా రచనా వస్తువు…నా పుస్తకాలన్నీ రైతుల జీవితాల చుట్టూనే తిరుగుతాయి. విదర్భలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల భార్యల జీవితాలపై ‘విడోస్ ఆఫ్ విదర్భ’ అనే పుస్తకం రాశాను. అక్కడ 26 ఏళ్ల నుంచి 63 ఏళ్ళ మధ్య వయసున్న వితంతువుల జీవితాలను మూడునెలలు పరిశీలించి చేసిన రచన ఇది. రైతాంగ సంక్షోభం గురించీ, ఆత్మహత్యలను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ విధానాల పైనా రాసిన నవల ‘రివర్ స్టోన్స్’, అలాగే ‘డెత్ ఆఫ్ మనీ లెండర్’, షూస్ ఆఫ్ ది డెడ్’, ది హానెస్ట్ సీజన్’ నవలలు పార్లమెంటరీ వ్యవస్థ, రైతు సమస్యలు, పేదరికం గురించి రాసినవే. అన్ని పుస్తకాలకూ మంచి ఆదరణ లభించింది. ఈ రచనల ద్వారా సమాజంలో, విధాన నిర్ణేతల్లో కొద్దిగానైనా మార్పు తీసుకురాగలిగితే నా ప్రయత్నం సఫలమైనట్టే!’’
బహుముఖ ప్రజ్ఞ…సీనియర్ జర్నలిస్టు, రచయిత్రి, చిత్రకారిణి, ఫోటోగ్రాఫర్… ఇలా ఎన్నో పాత్రల్లో కనిపించే బహుముఖ ప్రజ్ఞాశాలి కోట నీలిమ. ఆమె ఢిల్లీలోని జేఎన్యూలో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాస్టర్స్ డిగ్రీ, ఢిల్లీ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో పీహెచ్డీ, వాషింగ్టన్ డీసీలో అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అక్కడి స్థితిగతులను అధ్యయనం చేశారు. అద్భుతమైన చిత్రాలు గీసి, ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రదర్శనల ద్వారా వచ్చే డబ్బును పేద మహిళా రైతులకు అందజేస్తున్నారు. చక్కటి తెలుగులో మాట్లాడే నీలిమ రైతుల జీవితాలపై ఇంగ్లీషులో అయిదు పుస్తకాలు, వివిధ పత్రికల్లో వందలాది వ్యాసాలు రాశారు. ‘తిరుపతి: ది గైడ్ టు లైఫ్’, తిరుమల: సేక్రెడ్ ఫుడ్స్ ఆఫ్ గాడ్’ (ఎ.వి.రమణ దీక్షితులుతో కలిసి) లాంటి ఆధ్యాత్మిక రచనలు కూడా చేశారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోఆత్మహత్య చేసుకున్న రైతుల భార్యల జీవితాలను ప్రతిఫలించే ఛాయా చిత్రాలతో ఇటీవల ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించారు. రాజకీయ విశ్లేషకుడు పవన్ ఖేరా నీలిమ సహచరుడు.
ఆమె శ్రమ ఎవరికీ పట్టదు!…రైతు మరణించిన తరువాత కూడా అతని భార్యకు ఆమె జీవితంపై సొంత నియంత్రణ ఉండదు. చట్టాలు ఎన్ని ఉన్నా ఒక వితంతువుకు భూమి మీదా, ఇంటి మీదా హక్కు ఉండదు. ఆత్మహత్యల ప్రభావం మొత్తం కుటుంబంపై పడుతుందనేది నిజమే. కానీ మహిళలూ, ఆడపిల్లల పరిస్థితి చాలా దుర్భరం. నేను వెళ్లిన ఒక గ్రామంలోని ఒక కుటుంబం విషయానికి వస్తే… తండ్రి చనిపోయాడు. ఇంట్లో కుమార్తె ఒక్కతే ఉంది. బయటకు వెళ్లి పనిచేయడానికి ఆమె భయపడే పరిస్థితులున్నాయి. గ్రామీణ భారతంలో ఉచితంగా చదువు నేర్పించినా పిల్లల్ని స్కూళ్లకు పంపించరు. ఎందుకంటే దాని వల్ల వారికి పూట గడవదు. ఇక బాలికల చదువుకు మద్దతు అసలుండదు. రైతుల ఆత్మహత్య వల్ల వారి పిల్లలు ఒక్క రాత్రిలోనే విద్యార్థుల నుంచి వేతన కూలీలుగా మారతారు. ఆ పిల్లల్లో పదో తరగతికి మించి చదివిన వారు, నైపుణ్యాలను ఆర్జించిన వారు చాలా తక్కువ.’’