తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశం
గతంలో జరిగిన పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ విధానానికి విరుద్ధంగా ఇప్పుడు ఎందుకు చేశారో, మెరిట్ లిస్ట్ను ఎందుకు పబ్లిష్ చేయలేదో చెప్పాలని తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులను హైకోర్టు ఆదేశించింది. కానిస్టేబుల్ పోస్టుల భర్తీ నిమిత్తం ఇచ్చిన నోటిఫికేషన్లోని 18 ఎఫ్ నిబంధన ప్రకారం మెరిట్ లిస్ట్ను ప్రచురించకపోవడం చెల్లదంటూ సంతోషి మరో పది మంది వేసిన రిట్ను ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్రావు విచారించారు. మెరిట్ లిస్ట్ కాకుండా కేవలం ఎంపిక లిస్ట్ ప్రచురించడం చెల్లదని పిటిషనర్ల వాదన. ప్రతివాదులకు నోటీసు ఇచ్చిన హైకోర్టు విచారణను 15కి వాయిదా వేసింది.
1998 డీఎస్సీలో అర్హుత పొందిన వారిని పోస్టుల్లో నియమించండి :
టీచర్ పోస్టుల నియామకం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1998లో నిర్వహించిన డీఎస్సీలో అర్హుత పొందిన వారికి అనుకూలంగా మరోసారి హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆ డీఎస్సీలో అర్హులను ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల్లో నియమించాలన్న ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల్ని అమలు చేయాల్సిందేనని హైకోర్టు నాలుగు జిల్లాల డీఈవోలకు ఆదేశాలిచ్చింది. ఇదే తరహా ఉత్తర్వుల్ని ఇటీవల సింగిల్ జడ్జి ఇస్తే అమలు చేయని ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల డీఈవోలకు 2 మాసాల జైలు, రూ 2 వేలు జరిమానా విధించారు. దీనిపై ఆ నలుగురు డీఈవోలు అప్పీల్ చేసిన వ్యాజ్యాలను హైకోర్టు సీజే జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్రెడ్డిల డివిజన్ బెంచ్ విచారించింది. ట్రిబ్యునల్ 2009 డిసెంబర్లో ఇచ్చిన ఉత్తర్వుల్ని 4 వారాల్లోగా అమలు చేయాల్సిందేనని డివిజన్ బెంచ్ చెప్పింది. అప్పటి వరకూ సింగిల్ జడ్జి విధించిన జైలు శిక్ష తీర్పు అమలును రద్దు చేసింది. విచారణ నెల రోజులకు వాయిదా పడింది.
బాలల సంక్షేమ కమిటీలను ఎందుకు వేయలేదు :
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 23 జిల్లాలకు బాలల సంక్షేమ కమిటీలను వేయాలన్న పిల్పై హైకోర్టు స్పందించింది. ఎందుకు కమిటీలు వేయలేదో, ఎప్పటిలోగా కమిటీల ఏర్పాటు చేస్తారో చెప్పాలని తెలంగాణ సర్కార్కు వ్యాజ్యాలను హైకోర్టు సీజే జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్రెడ్డిల డివిజన్ బెంచ్ నోటీసులిచ్చింది. జువనైల్ జస్టిస్ యాక్ట్ -2015 మేరకు జిల్లాల్లో కమిటీల ఏర్పాటు చేయాలని ప్రజ్వల అనే ఎన్జీవో జనరల్ సెక్రటరీ డాక్టర్ సునీత కృష్ణన్ పిల్ వేశారు. పాత జిల్లాలకు కూడా పూర్వపు కమిటీలనే కొనసాగింపు చెల్లదనీ, కొత్త జిల్లాలకు కమిటీలు వేయాలని ఆమె లాయర్ వాదించారు. విచారణ నెల రోజులకు వాయిదా పడింది.
Courtesy Navatelangana..