‘ఆర్ధిక మాంద్యం’ అంటే, సరుకుల అమ్మకాలు తగ్గిపోవడమే. దీని వల్ల పరిశ్రమాధిపతులకు జరిగే నష్టం ఏమీ ఉండదు. అసలైన కష్టాలూ, నష్టాలూ భరించాల్సింది శ్రామిక జనాలే. 2018వ సంవత్సరంలో, భారత దేశంలోనే 1 కోటీ, 10 లక్షల మందికి ఉద్యోగాలు పోయాయి. మామూలుగా జీతాలు అందుతూ ఉన్న రోజుల్లోనే, కార్మిక కుటుంబాలు సమస్యల్లో కూరుకుపోయి ఉంటాయి కదా? అటువంటప్పుడు, ఆ కుటుంబాలకు జీతాలే ఆగిపోతే, అన్నిటికీ కష్టమే! శ్రామిక జనాలు క్షీణించి పోకుండా ఉండాలంటే, ఆర్ధిక సంక్షోభాలకు కారణలనూ, పరిష్కారాన్నీ వివరించే సిద్ధాంతాన్ని వారు తెలుసుకోవాలి.
గత రెండు మూడు నెలలుగా వార్తా పత్రికల్లోనూ, టీవీ చానళ్లలోనూ తరుచుగా కనిపిస్తున్న, వినిపిస్తున్న మాటలు ‘ఆర్ధిక మాంద్యం, ఆర్ధిక మాంద్యం, ఆర్ధిక మాంద్యం!’ ఈ మాంద్యాన్ని వర్ణిస్తున్న కొన్ని మాటలు చూడండి!
‘ప్రపంచ వ్యాప్తంగా 90 శాతం మందగమనం’. ‘మాంద్యం వాత, ఖర్చులో కోత’. ‘అంతర్జాతీయంగా తగ్గిన కొనుగోలు శక్తి’. ‘వ్యాపార వర్గాల్లో ఆందోళన’. ‘దివాళా స్థితికి వ్యాపారం’. ‘వృద్ధి రేటు నేల చూపులు’. ‘సిమెంటుకు గిరాకీ కరువు’. ‘మార్కెట్లకు ఆటో దెబ్బ’. ‘రియల్ఎస్టేట్ రంగంలో కొనసాగుతున్న సంక్షోభం’. ‘రెండు లక్షల కోట్లకు పెరిగిపోయిన బ్యాంకుల మొండి బకాయిలు! వచ్చే రెండేళ్ల వరకూ పరిస్తితి ఇంతే!’–ఇదీ దేశంలో ఆర్ధిక పరిస్తితి!
ఈ ఆర్ధిక మాంద్యం గురించి, ముఖ్యంగా పరిశ్రమల అధిపతులూ, ఆర్ధిక వేత్తలూ మాట్లాడుతున్నారు. అసలు, ‘ఆర్ధిక మాంద్యం’ అంటే ఏమిటి? అది ఎందుకు, ఎప్పుడెప్పుడు వస్తుంది? దానివల్ల జరిగే హాని ఏమిటి? ఎవరికి?– ఈ విషయాల గురించి, శ్రామిక జనాలు తెలుసుకుని తీరాలి. ‘శ్రామిక జనాలు’ అంటే, ఏయే సెక్షన్ల వాళ్ళు? జీతాల మీద బ్రతికే వాళ్ళూ, స్వతంత్ర శ్రామికులుగా బ్రతికే పేద రైతులూ, చేతి వృత్తుల వాళ్ళూ, చిన్న దుకాణదారులూ; కౌలు రైతులూ– ఈ రకపు సెక్షన్ల వారే శ్రామిక జనాలు!
‘ఆర్ధిక మాంద్యం’ అంటే, సరుకుల అమ్మకాలు తగ్గిపోవడమే. దీన్ని గురించి, ఇదేదో ‘ఆర్ధిక వేత్తలు మాత్రమే గ్రహించగలిగిన పెద్ద వ్యవహారం’ అని, ఆ వేత్తలు అనుకుంటారు. ఆ వేత్తలు అనుకునేటట్టు శ్రామిక జనాలు అనుకోకూడదు. సరుకుల అమ్మకాలు ఎందుకు తగ్గిపోతూ, ఆగిపోతూ వుంటాయి? ఈ సమస్య లేకుండా చేసేది ఎలాగ? ఈ నిజాల్ని తెలుసుకోవలిసింది శ్రామిక జనాలే. ఎందుకంటే, దానివల్ల హాని జరిగేది వారికే గనక! ఈ విషయాలు గ్రహించినప్పుడే, ఆ మాంద్యానికి అవకాశం లేని సమాజాన్ని భవిష్యత్తులో ఎలా ఏర్పరచుకోవాలో, శ్రామిక జనాలకు అర్ధమౌతుంది.
సరుకుల్ని తయారు చేయించే పరిశ్రమల వాళ్ళు, ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటారు. వాళ్ళు ‘వస్తు రూపం’లో వుండే సరుకుల్ని (తిండీ, బట్టా, ఇళ్ళూ వంటి వాటిని) తయారు చేయించే వారు కావచ్చు; లేదా వస్తువులుగా కాకుండా జరిగే శ్రమల్ని చేయించేవారు కావచ్చు. ఉదా: రవాణా, విద్యా, వైద్యం వంటి శ్రమలు, వస్తువుల్ని తయారు చెయ్యవు. అయినా, అవి అన్నీ అవసరమైన శ్రమలే!
పరిశ్రమల అధిపతుల ప్రకారమూ, వాళ్ళ ఆర్ధికవేత్తల ప్రకారమూ, ఆర్ధిక మాంద్యం అంటే, గడిచిన మూడు నెలల కాలంలో గానీ, ఆరు నెలల కాలంలో గానీ, సంవత్సర కాలంలో గానీ– ఆ కాలంలో తయారైన సరుకుల విలువని, అంతకు ముందు కాలంలో తయారైన సరుకుల విలువతో పోల్చినప్పుడు, కొత్త సరుకుల విలువ తగ్గుతూ పోయే పరిస్తితే! అంటే, కొత్తగా తయారైన సరుకులు, కొన్ని చోట్ల చాలా మందగొడిగా అమ్మకాలు కావడం; అనేక చోట్ల అసలు అమ్మకాలే కాక పోవడం! అంటే, సరుకుల అమ్మకాలు ఎప్పుడూ జరిగే స్థాయిలో జరగక పోవడం. దీని ఫలితం ఏమిటి?
కొన్ని పరిశ్రమలు పూర్తిగా మూత పడతాయి. (లాక్ ఔట్). ఆ పరిశ్రమల్లో శ్రామిక జనాలు నిరుద్యోగులై పోతారు. ‘నిరుద్యోగం’ అనే మాట, ఇక్కడే కొత్తగా పుట్టింది కాదు. అప్పటికే ఉన్న నిరుద్యోగ జనాభాతో ఈ కొత్త నిరుద్యోగులు కూడా కలిస్తే ఏమవుతుంది?ఆ నిరుద్యోగ జనాభా ఇంకా పెరుగుతుంది. కొన్ని పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడతాయి (లే ఆఫ్). కొన్ని పరిశ్రమలు వారానికి రెండు మూడు రోజులే పనిచేస్తాయి. దానికి తగ్గట్టే ఆ కార్మికులకు, సగం పనో, పావు పనో, దొరుకుతుంది. చాలా సార్లు అదీ జరగదు! ఇప్పుడు దేశంలో, అనేక రకాల పరిశ్రమల్లో, ఇదే జరుగుతున్నట్టు, ఆర్ధిక వ్యవహారాల పత్రికలూ, టీవీ చానెళ్ళూ సర్వేలు జరిపి చెబుతున్నాయి. సరుకులు అమ్ముకోలేని పరిస్తితి ఎందుకు ఏర్పడుతుంది? అనేక పరిశ్రమల్లో సరుకులు, గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి, మార్కెట్ అవసరాల్ని మించి ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే, సరుకుల్ని తయారు చేయించే పరిశ్రమల దారుల మధ్య, ఒక ‘సమిష్టి ప్లాను’ వుండదు. పైగా, ఒకళ్ళ లెక్కలు ఒకళ్ళకి తెలియకుండా సరుకుల యజమానులు జాగ్రత్తలు పడతారు.
ఏదైనా ఒక సరుకుని ఉదాహరణగా తీసుకోండి! ఉదా: సబ్బులు. లేదా చెప్పులు. మార్కెట్లో అమ్మడానికి మొత్తం మీద, ఒక సంవత్సరంలో ఎన్ని సబ్బులు అవసరం? సబ్బులు తయారు చేయించేవాళ్ళు, ఒక్కొక్కరూ ఎన్నెన్ని సబ్బులు తయారు చేయించాలి?– అనే ఉమ్మడి ప్లాను ఎవరికీ ఉండదు. (సమాజంలో వున్న మొత్తం జనాభాకి ఎంత ఉత్పత్తి అవసరమో, దాని ప్రకారం ఉత్పత్తి జరగదు. కేవలం అమ్మకాల కోసమే ఉత్పత్తి జరిగే విధానం ఇది.). ఆ ఉమ్మడి ప్లాను లేకపోవడానికి కారణం, ఆ సరుకుని తయారు చేయించేవాళ్ళు, ఒకరితో ఒకరు పోటీలు పడే ప్రైవేటు పెట్టుబడిదారులు కావడమే. అందుకే ఎవరికి వాళ్ళు ఏ లెక్కా లేకుండా మితిమీరిన స్తాయిలో సరుకుల్ని ఉత్పత్తి చేయిస్తారు. సమాజంలో, సబ్బుల్ని కొనే జనాభా 100 మంది అనుకుందాం. వాళ్ళ కోసం వెయ్యి సబ్బులు తయారై వుంటే, వాటిని కొనేది ఎవరు? ఏ సరుకుకైనా ఇదే ఉదాహరణ చాలు. ఈ సరుకుల తయారీ పద్ధతిని మార్క్సు, ఎంగెల్స్ లు ఒక అంటు రోగంగా వర్ణించారు. ఎక్కువ సరుకుని అమ్మాలనే రోగం ఒకరి నించి ఒకరికి అంటుకుంటుంది. ‘‘గత యుగాల్లో అసంభవంగా కనిపించే ఒక ‘అంటు రోగం’. ‘మితిమీరిన సరుకు ఉత్పత్తి’ అనే అంటురోగం. హఠాత్తుగా, మానవ సమాజం, తాత్కాలిక ఆటవిక దశలో ప్రవేశించినట్టుంటుంది. కాటకామో, సర్వ విధ్వంసక ప్రపంచ యుద్ధమో వచ్చి, సకల ప్రాణాధారాల వస్తువుల సరఫరానూ భగ్నం చేసినట్టుంటుంది. పరిశ్రమలూ, వాణిజ్యమూ ధ్వంసమైనట్టుంటుంది. కారణం ఏమంటే, మితిమీరిన నాగరికత, మితిమీరిన ప్రాణాధారిత సంపద, మితిమీరిన పరిశ్రమలు, మితిమీరిన వాణిజ్యం!’’ (కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక).
సరుకుని తయారు చేయించే పెట్టుబడి దారులందరికీ లక్ష్యం ఒక్కటే, ఎక్కువ లాభం! ఇతరుల కన్నా ఎక్కువ లాభం! ఈ లాభాల పోటీలు యుద్ధాల దాకా పోతాయి. అందుకే లాభాల కోసం పోటీపడే పెట్టుబడిదారుల్ని, మార్క్సు ‘‘శత్రు సోదరులు’’ (‘హాస్టైల్ బ్రదర్స్’) అంటాడు. ఇది ఒక్క దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా (ప్రపంచపు మార్కెట్లో) జరిగే వ్యవహారమే. అందుకే ‘సంక్షోభం’ అనేది ఒక దేశానికే పరిమితమై ఉండదు. తరతమ భేదాలతో ప్రపంచమంతటా వ్యాపిస్తుంది.
ఈ సంక్షోభాలు రాకుండా ఉండాలంటే, అంటే అమితోత్పత్తి అనే రోగం రాకుండా ఉండాలంటే, ఉత్పత్తి సాధనాలు ఏ శ్రమా చెయ్యని ప్రైవేటు వ్యక్తుల, సంస్థల చేతుల్లోంచీ, శారీరక, మేధో శ్రమలు చేసేవారి ఉమ్మడి ఆధీనంలోకి వచ్చినప్పుడే సాధ్యం. అది జరగనంత కాలమూ, ఆర్ధిక సంక్షోభాలు కొన్నేళ్లకు ఒకసారి వస్తూనే వుంటాయి. శ్రామికుల ఉమ్మడి ఆధీనంలోకి ఉత్పత్తి సాధనాలు వచ్చినప్పుడు, ప్రతి ఒక్కరూ శ్రమలు చేసే వారుగా వుండే సమాజంలో, జనాభా అంతటికీ అవసరమైన స్తాయిలో, ఉత్పత్తి ఒక ప్లాను ప్రకారం జరుగుతుంది. అలా జరిగినప్పుడు సంక్షోభాలకు అవకాశమే వుండదు.
ఆర్ధికమాంద్యం వల్ల పరిశ్రమాధిపతులకు జరిగే నష్టం ఏమీ ఉండదు. సరుకుల అమ్మకాలు మందగిస్తాయి కాబట్టి, లాభాలు తగ్గుతాయి అనేది నిజమే. లాభాలు తగ్గి, కొన్ని పరిశ్రమల్లో పెట్టుబడులకు కూడా కొన్ని నష్టాలు జరగవచ్చు. అంత మాత్రాన ఆ యజమానుల ప్రాణాలు ఎగిరిపోవు. వాళ్ళు సుఖంగానూ, విలాసవంతంగానూ జీవించడానికి కావలిసినంత సరుకు వాళ్ళకి అందుబాటులో వుంటుంది.
అసలైన కష్టాలూ, నష్టాలూ భరించాల్సింది శ్రామిక జనాలే. అదెలాగంటే: సరుకుల అమ్మకాలు మందగించినప్పుడు, పరిశ్రమల యజమానులు సరుకు తయారీ తగ్గించుతారు. తయారీనే తగ్గించినప్పుడు, ఆ పరిశ్రమల వాళ్ళు ‘ఉత్పత్తి సాధనాల్ని’ కొనడం తగ్గిపోతుంది. కొత్త సబ్బుల తయారీ ఆగిపోతే, లేదా తగ్గిపోతే, ఆ తయారీ కోసం అవసరం అయ్యే ‘ఉత్పత్తి సాధనాల్ని’ తయారు చేసే పరిశ్రమల్లో అమ్మకాలు మందగిస్తాయి. లేదా పూర్తిగా ఆగిపోనూ వచ్చు. అలా ఉత్పత్తిని తగ్గించి వేసిన పరిశ్రమల్లో, శ్రామికులతో అంతకు ముందు ఉన్నంత అవసరం, తగ్గిపోతుంది. అసలు శ్రామిక వర్గంలో కొంత జనం ఎప్పుడూ నిరుద్యోగంలోనే ఉంటారు. కానీ, మాంద్యం కాలాల్లో ముంచుకు వచ్చే నిరుద్యోగం పరిస్తితి, అలాంటిది కాదు. ఒక పరిశ్రమలో, నిన్నటి దాకా 100 మంది కార్మికులు ఉంటే, ఇవ్వాల్టికి, కనీసం 90 మంది నిరుద్యోగులై పోతారు. ఇది ఒక రకం పరిశ్రమల్లోనే కాదు, అనేక రకాల పరిశ్రమల్లో జరుగుతుంది. శారీరక శ్రమల్లోనూ జరుగుతుంది, మేధా శ్రమల్లోనూ జరుగుతుంది.
భారత దేశ ఆర్ధిక వ్యవహారాల మీద పరిశోధన చేసే ఒక స్వతంత్ర సంస్థ (సి.ఎం.ఐ.ఐ.) సర్వే ప్రకారం, 2018వ సంవత్సరంలో, భారత దేశంలోనే 1 కోటీ, 10 లక్షల మందికి ఉద్యోగాలు పోయాయి! ఈ మధ్య కొన్ని నెలలలోనే కార్ల తయారీ పరిశ్రమల్లో పని చేసే వాళ్ళల్లో 3 లక్షల, 50 వేల మందికి ఉద్యోగాలు పోయాయి. కార్ల పరిశ్రమలకి అనుబంధంగా, విడిభాగాల్ని తయారు చేసే చిన్న పరిశ్రమలలో పనిచేసే వారి సంగతి చెప్పనక్కర లేదు. త్వరలో ఒక 10 లక్షల మంది నిరుద్యోగులయ్యేలా ఆ రంగంలో మాంద్యం ఉందని ఒక అంచనా. గృహాల, భవనాల, ఆ రకపు కట్టడాల నిర్మాణ రంగమైన రియల్ ఎస్టేట్ రంగంతో సహా అనేక రంగాలలో ఉద్యోగాలు పోతున్నట్టు తెలుస్తోంది.
అలా ఉద్యోగాలు పోయిన కార్మికులంతా ఏమై పోతారు? మామూలుగా జీతాలు అందుతూ ఉన్న రోజుల్లోనే, కార్మిక కుటుంబాలు సమస్యల్లో కూరుకుపోయి ఉంటాయి కదా? అటువంటప్పుడు, ఆ కుటుంబాలకు జీతాలే ఆగిపోతే, అన్నిటికీ కష్టమే! తిండి సరిపడా ఉండదు. అద్దె ఇళ్ళు ఖాళీ చేసి చెట్ల కిందకో, ఫుట్పాతుల మీదకో, వంతెనల కిందకో, చేరవలసిందే! పిల్లల చదువులు ఆగిపోతాయి. ఆకలి జబ్బులు మొదలవుతాయి. (ఈ దేశంలో వెయ్యి మంది పిల్లలలో 42 మంది పిల్లలు, యాడాది అయినా నిండకుండానే చచ్చిపోతున్నారనేది ఒక లెక్క.) వైద్యం దొరక్క, చావులు మొదలు. బతికి ఉంటే, పిచ్చెక్కడమో, ఆత్మహత్యలు చేసుకోవడమో, నేరాలు చేసుకుంటూ ఉండటమో తప్ప ఇంకే మార్గమూ కనపడదు. శ్రామిక జనాలు క్షీణించి పోకుండా ఉండాలంటే, ఆర్ధిక సంక్షోభాలకు కారణలనూ, పరిష్కారాన్నీ వివరించే సిద్ధాంతాన్ని వారు తెలుసుకోవాలి.
రంగనాయకమ్మ