– స్మోక్ అలారం ఎందుకు మోగలేదు?
– ఆక్సిజన్ సిలిండర్లూ లేవు
– ఉత్పత్తిపైనే శ్రద్ధ…
నిర్వహణ లోపభూయిష్టం
తప్పును… సాంకేతికత పైకి నెట్టే యత్నం
– శ్రీశైలం జల విద్యుత్కేంద్ర ప్రమాదంపై పలు అనుమానాలు
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్కేంద్ర అగ్ని ప్రమాదంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ నిర్వహణపైనా అనుమానాలు వెంటాడుతున్నాయి. ఇంతపెద్ద అగ్ని ప్రమాదం జరిగి, పొగ దట్టంగా కమ్మేసి, 9 మంది మృత్యువాత పడినా ఇక్కడి స్మోక్ అలారం ఎందుకు మోగలేదనే దానిపై అధికారులు ఎవరూ స్పందించట్లేదు. ప్రమాద తీవ్రత పెరిగిన తర్వాత, ప్రాణాలు కాపాడుకొనేందుకు అసిస్టెంట్ ఇంజినీర్ సుందరం ఫైర్ అలారం మోగించి, ఎస్కేప్ టన్నెల్ జీఐఎస్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించి మరణించారని టీఎస్ జెన్కో అధికారులు చెప్తున్నారు. ఫైర్ అలారాన్ని మాన్యువల్గా ఎందుకు ఆన్ చేయాల్సి వచ్చిందనే ప్రశ్నకు మాత్రం ఎవరూ సమాధానం చెప్పట్లేదు. జపాన్ సాంకేతిక నైపుణ్యంతో నిర్మితమైన ఈ ప్రాజెక్ట్లో పొగ కమ్మేయగానే స్మోక్ అలారం దానంతట అదే మోగే సాంకేతిక లేదా…లేక నిర్వహణను పట్టించుకోలేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్మోక్ అలారం మోగి ఉంటే సిబ్బంది వెంటనే అప్రమత్తమై, బయటకు వచ్చేసి ఉండేవారు…లేదా బయట ఉన్న ఫైరింజన్ సిబ్బందికి అలారం వినిపించి ఉంటే తక్షణం ప్రమాద నివారణకు ప్రయత్నించి ఉండేవారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సంఘటనలో ఇప్పటి వరకు ప్రభుత్వం, టీఎస్జెన్కో యాజమాన్యం ఎవర్నీ బాధ్యుల్ని చేయలేదు. జరిగిన సంఘటన దురదృష్టకరమని మాత్రమే ప్రకటించాయి. శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్కేంద్రంలో ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో 15 రోజుల నుంచి నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూనే ఉన్నారు. గడచిన వారం రోజులుగా ఉత్పత్తిని ఏరోజుకు ఆరోజు పెంచుతూ వెళ్ళారు.
ప్రమాదం జరిగిన రోజు దాదాపు 21.5 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. వరుస ఉత్పత్తి గణాంకాలను పరిశీలిస్తే…ఉత్పత్తి పెంపుపై ఎవరు ఆదేశాలు ఇచ్చారనే ప్రశ్న ఉదయిస్తున్నది. ఈనెల 16వ తేదీ ఈ ప్రాజెక్ట్ నుంచి 20.26 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. 17న 20.59 మి.యూ., 18న 20.86 మి.యూ., 19న 20.96 మి.యూ., ఉత్పత్తి జరిగింది. ప్రమాదం జరిగిన 20వ తేదీ రాత్రి 10.30 గంటల సమయానికి ఈ ప్రాజెక్ట్ నుంచి 19.25 మి.యూ., ఉత్పత్తి గ్రిడ్కు అనుసంధానమైనట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 16వ తేదీ నుంచి ఉత్పత్తిని క్రమేణా పెంచుతూ వెళ్లారు.
జలవిద్యుదుత్పత్తిలో ఈ ప్రక్రియ సాధారణంగా జరిగేదే అయినా, ప్లాంట్ సామర్ధ్యాన్ని అంచనా వేయలేకపోయినట్టు తెలుస్తున్నది. దానికి నిర్వహణ లోపాలు తోడు కావడంతో ప్రమాదం జరిగి, 9 మంది మృతికి కారణమైనట్టు ప్రచారం జరుగుతున్నది. మరోవైపు ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్కేంద్రం ఉత్పత్తి సామర్థ్యం 770 మెగావాట్లు (7ఞ110). ఇక్కడి ఉత్పత్తి ఏ దశలోనూ 16.9 మిలియన్ యూనిట్లు దాటలేదు. ఉత్పత్తి పెంపుదల, నిర్వహణకు సంబంధించి ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
భూ ఉపరితలానికి 1.2 కిలోమీటర్ల లోతులో ఈ ప్రాజెక్ట్ ఉంది. సొరంగమార్గం (టన్నెల్) ద్వారానే లోనికి వెళ్లాలి. ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడి సిబ్బంది బయటపడేందుకు వీపుకు తగిలించుకొనే ఆక్సిజన్ సిలిండర్లు, చార్జింగ్ లైట్లు, క్లోజుడ్ కళ్లద్దాలు వంటి ప్రాధమిక రక్షణ చర్యలు అందుబాటులో ఉండాలి. కానీ అవేవీ ఈ ప్రాజెక్ట్లో లేవని తెలుస్తున్నది. అక్కడక్కడ గోడలకు అమర్చిన ఆక్సిజన్ సిలిండర్లు కేవలం అలంకారప్రాయమేననీ, అవి పనిచేయక చాలా కాలం అయినట్టు చెప్తున్నారు. ప్లాంటును కాపాడుకొనేందుకు, మంటలను అదుపులోకి తెచ్చేందుకూ ఉద్యోగులు చేసిన సాహసం మరువలేనిది. అదే సందర్భంలో వారిని వారు కాపాడుకోవడానికి అవసరమైన రక్షణ చర్యలు లేకపోవడం 9 మంది మరణానికి కారణమైనట్టు విద్యుత్ ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది.
Courtesy: NT